– జీవీ ఆంజనేయులు
వినుకొండ: భారీ ఎత్తున చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణం రూపురేఖలు మారబోతున్నాయని, సాధారణ పరిపాలన శాఖ నుంచి వచ్చిన రూ.కోటి 54 లక్షలు, రూ. 150 కోట్ల మంచినీటి పథకం పునరుద్ధరణతో పట్టణాన్ని ప్రగతిబాట పట్టించాలని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు.
ఆలస్యం, అలసత్వానికి ఏ మాత్రం తావులేకుండా అభివృద్ధి పనులు శరవేగంగా జరిపి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ విభాగానికి సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ వినుకొండ మున్సిపల్ సాధారణ నిధులు నుంచి రూ. కోటీ 54 లక్షలతో 14 అభివృద్ధి పనులను మంజూరు చేసి టెండర్లు పిలవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ప్రతి కాలనీ చివరి వరకు విద్యుత్ స్తంభాలు వేసి బల్బులు అమర్చాలని ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట్ల బస్ షల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణం నలువైపులా నాలుగు బస్ షెల్టర్లు ఏర్పాటుకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.
రూ.150 కోట్లతో మంచినీటి పథకం 2019లో గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరు చేయిస్తే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వెంటనే కొత్త డీపీఆర్లు తయారు చేయించి టెండర్లు పిలవాలని అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, డీఈ విష్ణుమూర్తి, శానిటరీ, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.