Suryaa.co.in

Telangana

PJTAU ని సందర్శించిన డాక్టర్ M.L జాట్

హైదరాబాద్: భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) డైరెక్టర్ జనరల్ గా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (DARE) కార్యదర్శి గానూ నూతనంగా నియమితులైన డాక్టర్ M.L జాట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

పరిపాలనా భవనంలో ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ G.E.CH విద్యాసాగర్, ఇతర విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ విభాగాల సంచాలకులు పాల్గొన్నారు. PJTAU ఉపకులపతిగా గత ఆరు నెలల కాలంలో తాను తీసుకున్న చర్యల్ని జానయ్య వివరించారు. విశ్వవిద్యాలయ ప్రగతిని నెమరు వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించేందుకు విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలని ఘనంగా నిర్వహించామని తెలిపారు.

ఈ ఉత్సవాలకి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ అధికారుల పదవులని భర్తీ చేశానన్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా విశ్వవిద్యాలయ అధ్యాపక, పరిశోధన, విస్తరణ వ్యవస్థల్ని పునర్వ్యవస్థీకరిస్తున్నామని జానయ్య తెలిపారు. అదేవిధంగా Ph.D పూర్తిచేసిన అభ్యర్థులకి రెండేళ్లపాటు విశ్వవిద్యాలయంలోనే పోస్ట్ డాక్టోరల్ అకడమిక్ అప్రెంటిస్ షిప్ అవకాశం కల్పిస్తున్నామని జానయ్య అన్నారు.

ఈ సమయంలో నెలకి 30 వేల రూపాయలు గౌరవ వేతనంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల ప్రవేశాలలో ఐదు శాతం సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విద్యనభ్యసించే వారిలో సుమారు 72 శాతం మంది బాలికలు ఉన్నారని అందుకు తగిన విధంగా వసతి గృహాలు మంజూరు చేయవలసిందిగా జానయ్య DG ని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కొన్ని అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాయని.. అందువల్ల తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల మంజూరు చేయవలసిందిగా జానయ్య కోరారు. ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థకు నాయకత్వం వహించే అవకాశం వచ్చినందుకు ఉపకులపతిని, ఇతర అధికారుల్ని డైరెక్టర్ జనరల్ M.L జాట్ అభినందించారు. తెలంగాణ అనేక అంశాల్లో దేశంలో అగ్రగామిగా నిలుస్తోందని జాట్ అన్నారు.

ముఖ్యంగా భూగర్భ జల నిల్వల్ని కాపాడుకుంటూనే వరి దిగుబడిలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. ప్రస్తుతం సాగుపరంగా వస్తున్న కొత్త సవాళ్లని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వివిధ సంస్థలు అన్ని సమన్వయంతో పనిచేయాలని జాట్ పిలుపునిచ్చారు. దిగుబడితోపాటు మార్కెటింగ్, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటి అంశాల్ని ఎదుర్కోవడానికి నూతన దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు.

మారుతున్న పరిస్థితుల్లో సామాజిక శాస్త్రాల నిపుణుల భాగస్వామ్యం పెరగాలన్నారు. అధ్యాపకులు, శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త అంశాల్ని నేర్చుకుని తర్వాత తరాలకి అందించాలన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తూ రైతాంగం మొహాంల్లో చిరునవ్వులు తీసుకురావడానికి కృషి చేయాలని జాట్ పిలుపునిచ్చారు. ఉపకులపతి ప్రస్తావించిన అంశాలకు సంబంధించి సాధ్యా సాధ్యాలు పరిశీలించి పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని DG జాట్ హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE