Suryaa.co.in

National

ఇక మూడు నెలలూ ముచ్చెమటలే

– ఏప్రిల్‌, మే, జూన్‌లలో విపరీతమైన వేడి గాలులు ఐఎండీ హెచ్చరిక

దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఎండలు మండిపోనున్నాయని, విపరీతమైన వేడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది.

మధ్య, పశ్చిమ ద్వీపకల్ప భాగాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మధ్య, పశ్చిమ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఒడిశా ఉత్తర భాగంలో సాధారణం నుంచి సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అదే సమయంలో మైదాన ప్రాంతంలో వేడి గాలులు వీచే రోజులు పెరిగే అవకాశముందన్నారు. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులు వేడి గాలులు వీచేవని, ఈ సారి పది నుంచి 20 రోజుల పాటు వీచే అవకాశముందని హెచ్చరించారు. గుజరాత్‌, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుందని మహాపాత్ర చెప్పారు.

LEAVE A RESPONSE