Suryaa.co.in

Andhra Pradesh Telangana

యువనేత లోకేష్ సమక్షంలో రెస్కో మాజీ చైర్మన్ చేరిక

– పుట్టపర్తిలో వైసిపికి బిగ్ షాక్..టిడిపిలోకి కీలక నేత

హైదరాబాద్: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపికి చెందిన కీలకనేత, రెస్కో మాజీ చైర్మన్ శెట్టివారి రాజశేఖర్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, టిడిపి అభ్యర్థి పల్లె సింధూర నేతృత్వాన టిడిపిలో చేరారు. హైదరాబాద్ లోని నివాసంలో యువనేత నారా లోకేష్ సమక్షంలో రాజశేఖర్ తో పాటు 100మంది ముఖ్యనేతలు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పుట్టపర్తిలో కాపుసామాజికవర్గ బలమైన నేతగా ఉన్న రాజశేఖర్ 1999లో ఇండిపెండెంట్ గా పోటీచేయగా, 13,800 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కలిసి పనిచేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ పార్టీల ముఖ్యనేతలు పెద్దఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. పుట్టపర్తిలో టిడిపి జెండా ఎగురవేసేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. రాజశేఖర్ మాట్లాడుతూ… ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే విజనరీ లీడర్ చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయన నేతృత్వంలో తామంతా కలసి పనిచేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE