ఈడీ చేతికి ‘ఐన్యూస్‌’ ఛానల్…

తెలుగులో మరో న్యూస్‌ ఛానల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేతికి వెళ్ళింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘సాక్షి’ పత్రికకు చెందిన పలు ఆస్తులు ఈడీ చేతికి వెళ్ళిన విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో విఫలం కావడంతో ఐన్యూస్‌ ఛానల్‌ ప్రస్తుత ఓనర్లకు సంబంధించిన షేర్లను ఈడీ జప్తు చేసింది. ఐన్యూస్‌ ఛానల్‌ను ఇంటెగ్రేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ నిర్వహిస్తోంది.
ఈ కంపెనీ పెయిడ్ అప్‌ క్యాపిటల్ 4.39 కోట్ల షేర్లు. ప్రస్తుతం ఈ కంపెనీలో జై అంబే గౌరి కెమె లిమిటెడ్‌కు మెజారిటీ వాటా ఉంది. ఈ కంపెనీ నరేందర్‌ కుమార్‌ పటేల్‌కు చెందినది. గుజరాత్‌కు చెందిన ఈ పారిశ్రామిక వేత్త బ్యాంకుల నుంచి సుమారు రూ. 100 కోట్ల రుణం తీసుకున్నాడు. అయితే రుణాలు చెల్లించడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా ఎస్బీఐకు రూ. 65.29 కోట్లు, స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌కు రూ. 36.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే చెన్నైకి చెందిన ఎగ్జిమ్‌ బ్యాంక్‌కు రూ. 30.76 కోట్లు, డీసీబీ బ్యాంక్‌కు రూ. 8 కోట్లు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది.
రుణాల ఎగవేయడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. 2016లో ఈ కంపెనీ ఛైర్మన్‌, డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ, ఆ తరవాత ఈడీ జరిపిన దర్యాప్తుల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏ వ్యాపారం కోసమైతే రుణాలు తీసుకున్నారో… వాటిని బ్యాంకుల అనుమతి లేకుండా ఇతర వ్యాపారాలకు మళ్ళించినట్లు తేలింది. ఐ న్యూస్‌లో పెట్టుబడి పెట్టిన మొత్తం అంతా ఈ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణమేనని ఈ దర్యాప్తులో వెల్లడైంది.
ఐన్యూస్‌లో జై అంబే గౌరి కెమ్‌ లిమెటెడ్‌ పేరుతో 2,15,50,000 షేర్లు, ఇదే గ్రూప్‌నకు చెందిన ఇన్‌రిథమ్‌ ఎనర్జి లిమిటెడ్‌కు 32 లక్ష లషేర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ షేర్ల కొనుగోలు బ్యాంకు రుణ మొత్తం వినియోగించినట్లు తెలియడంతో వాటిని ఈడీ జప్తు చేసింది. అలాగే బ్యాంకు నుంచి తీసుకున్న రుణం నుంచి రూ. 6.75 కోట్లను ఐన్యూస్‌కు ఇన్‌రిథమ్‌ ఎనర్జి లిమిటెడ్‌ అన్‌సెక్యూర్డ్ రుణంగా ఇచ్చినట్లు కూడా తేలింది. ఇంకా బ్యాంకు రుణంతో కొనుగోలు చేసిన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. ఎంఎన్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో కూడా రుణాలు తీసుకుని మోసం చేశారని ఈడీ పేర్కొంది. హైదరాబాద్‌, వైజాగ్‌తో పాటు మహేశ్వరంలో నరేందర్‌ కుమార్‌ పటేల్‌తో పాటు జిగిషాబెన్‌ పటేల్, మధు మరు స్వామి పేరున ఉన్న ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది.

Leave a Reply