Suryaa.co.in

Andhra Pradesh

ఇది డ్రామా కాదా.. జగన్మోహన్ రెడ్డి?

– పులివెందుల గొడ్డలి పంచాయతీలు విశాఖపట్నంలో మీకు కావాలా?
– నేను నేరాలు చేయను…నేరాలు చేసేవాళ్లను తుంగలో తొక్కేస్తా
– పులివెందులది గొడ్డలి పంచాయతీలు
* ముఖ్యమంత్రి రోడ్డు షోలో కరెంటు పోవడం ఏంటి? డ్రామా కాకపోతే..
*చీకట్లో జగన్ పై గులకరాయి వేస్తే…నాపై వెలుగులో రాయి విసిరారు
– నీ పోలీసులు…నీ కరెంటు డిపార్ట్మెంట్ అధికారులను నీ చేతిలో పెట్టుకుని నాపై పడి ఏడ్వడం ఏంటి?
* రాష్ట్రం ఏమైనా జగన్, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డివాళ్ల అబ్బ జాగీరా?
*వైసీపీ ప్రభుత్వం ఓ డ్రామ కంపెనీ అని ప్రజలు గుర్తించాలి
*విశాఖను వైసీపీ నాయకులు డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారు
*ఉత్తరాంధ్రకు పరిశ్రమలు, కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా
*భావితరాల భవిష్యత్తు నా బాధ్యత
* కోడి గుడ్డు మంత్రి అనకాపల్లిని ఊడ్చేసి..నేడు గాజువాక వచ్చాడు
*గాజువాక ప్రజలు కోడిగుడ్డును పగలుకొట్టి ఆమ్లెట్ వేయాలి
– టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు

గాజువాక: వైసీపీ అధికారంలోకి వచ్చాక పల్లా శ్రీనివాస్ ను ఇబ్బంది పెట్టాలని ఆయన కట్టిన కాంప్లెక్స్ కూల్చారు..అయినా ఎక్కడా తగ్గకుండా ప్రజల కోసం పోరాడుతున్నారు. భరత్ కు చెందిన కేఎల్‌యూ బిల్డింగ్ లను సైతం కూల్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. కేఎల్‌యూ గొప్పతనం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తెలియదు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, ఏపీలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సంకల్పించిన గొప్ప వ్యక్తి. గాజువాక ప్రాంతంలోని బీజేపీ- జనసైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు.

భారతదేశానికి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. రాష్ట్ర ప్రజలంతా నెత్తిమీద పెట్టుకున్న కుంపటిని దించుకోవాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఎన్డీయే కూటమే…ప్రజల భవిష్యత్తును ఉజ్వలంగా చేయడమే మా లక్ష్యం.హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి ముందుగా వచ్చిన వ్యక్తిని నేను. హుద్ హుద్ ఎంత వేగంగా వచ్చిందో…అంత వేగంగా నేను ఇక్కడికి వచ్చాను.10రోజులు ఇక్కడే బస్సులో పడుకుని విశాఖ ప్రాంతాన్ని చక్కదిద్దాక నేను ఇంటికి వెళ్లాను. మీ మీద ఉన్న ప్రేమ, అభిమానం నన్ను ఇక్కడ నిలబెట్టింది. 2019లో రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినా…విశాఖలో టీడీపీ గెలిచింది.

విశాఖపట్నంలో ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలను కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, ఏ సదస్సు పెట్టినా విశాఖలోనే నిర్వహించాం. విశాఖను టూరిజం, ఐటీ హబ్ గా, పరిశ్రమల కేంద్రంగా ఇక్కడ అభివృద్ధి చేశాం…మెడ్ టెక్ జోన్ గా విశాఖను తీర్చిదిద్దాం. ఇలాంటి విశాఖను వైసీపీ నాయకులు వచ్చాక గంజాయి కేంద్రంగా మార్చారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది..దీనికి సంబంధించిన దోషి వైసీపీ ప్రభుత్వం. ప్రభుత్వ సహకారం లేకుండా విశాఖపట్నం పోర్టుకు ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ దిగుమతి అవుతాయా? ఏపీలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముతున్నారని ప్రభుత్వంపై నేను పోరాడితే..టీడీపీ పార్టీ ఆఫీసుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. నేను 2రోజులు నిరవధిక నిరాహాద దీక్ష చేసి పోరాడాను..సమస్యను ఢిల్లీ స్థాయికి తీసుకెల్లి కేంద్రం పెద్దలకు మెమొరాండం ఇచ్చి పోరాడాను.

వైసీపీ ప్రభుత్వం చెత్త ప్రభుత్వం…చేతకాని ప్రభుత్వం. ఇక్కడికి గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వచ్చి రాళ్లు విసురుతున్నారు. రాళ్లు విసిరిన వారిని ప్రజలు వదిలిపెట్టరు..తరిమి తరిమి కొడతారు. పోలీసులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ విషయంలో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చిల్లర చిల్లర వేషాలు వేస్తే ప్రజలు బట్టలు విప్పి తరిమి తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డి తన జే గ్యాంగ్ ను అదుపు చేసుకోవాలని హెచ్చరిస్తున్నా… నేడు తెనాలిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే వారాహి పైకి జే గ్యాంగ్ రాళ్లు విసిరారు. నేను గతంలో విశాఖకు వస్తే..నన్ను వైసీపీ గూండాలు అడ్డుకుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. నన్ను విశాఖ నుండి వెనక్కి పంపించేశారు. నేను అమరావతి వెళితే ఆ సమయంలో వైసీపీ గూండాలు నాపైకి చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు. ఆ సమయంలో జే గ్యాంగ్ చర్యలను డీజీపీ సిగ్గులేకుండా సమర్థించారు. వైసీపీ ఎమ్మెల్యే నా ఇంటి మీదకు తన గ్యాంగ్ తో రాళ్లు, కర్రలతో వస్తే..పోలీసులు దాన్ని కూడా సమర్థించారు. చివరకు ఆ ఎమ్మెల్యే నా అపాయింట్మెంట్ కోసం వచ్చాడని వెనకేసుకొచ్చారు. క్లెయిమోర్ మైన్ లకే భయపడని నేను ఈ రాళ్లకు, కర్రలకు, చెప్పులకు భయపడతానా?

విజయవాడలో నిన్న ముఖ్యమంత్రి కార్యక్రమంలో కరెంటు పోయింది..కరెంటు పోవడానికి నేను కారణం అంటున్నారు. అసలు ప్రభుత్వం ఎవరిది? కరెంటు ఎవరి చేతుల్లో ఉంటుంది? ముఖ్యమంత్రి గా ఈ మాటలు మాట్లాడడానికి సిగ్గు లేదా? కరెంటు పోవడానికి ఎవరిది బాధ్యత? గతంలో ఓసారి కోడికత్తి డ్రామా ఆడాడు..గొడ్డలి వేటుతో బాబాయ్ ను చంపి ఆ నేరాన్ని నాపై మోపడానికి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు వివేకా హత్య గురించి అడుగుతోంది సమాధానం చెప్పాలి. వివేకాను చంపిన వాడికి ఎంపీ పదవి ఇచ్చాడు, వైసీపీ కి రాష్ట్ర ప్రజలు ఓటు వేసే పరిస్థితి లేదు..వైసీపీ పార్టీ పూర్తిగా రక్తపు మరకలతో తడిచిపోయి ఉందని జగన్మోహన్ రెడ్డిని తన చెల్లెలు ప్రశ్నిస్తోంది. నేను నేరాలు చేయను..నేరాలు చేసేవాడిని వదిలిపెట్టను…తుంగలో తొక్కేస్తాను. ఇన్ని రోజులు నాపై దాడులు చేశారు..గతంలో పవన్ కళ్యాణ్ పై దాడులు చేశారు.

జగన్ పై గులకరాయి పడితే మేం ఖండించాం…కానీ పవన్ కళ్యాణ్ పై రాళ్ల దాడి జరిగితే కనీసం ముఖ్యమంత్రి ఖండిచలేదు. జగన్ పై గులకరాయి పడిన 15నిమిషాల్లో వైసీపీ గ్యాంగ్ ప్లేకార్డులతో నిరసన తెలిపారు. ఇది ఎలా సాధ్యమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇది డ్రామా కాదా? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్ది రెడ్డి మీ అబ్బ సొత్తా, మీ అబ్బ జాగీరా ఈ రాష్ట్రం? మేం బానిసలం అనుకుంటున్నారా? మేం బానిసలం కాదు..తెలుగుజాతి వారసులం..నీచులపై పోరాడుతాం, బుద్ధి చెబుతామని మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను. భావితరాల భవిష్యత్తును తీర్చి దిద్దాలని ప్రజలను నన్ను కోరుతున్నారు..అందుకే మీకోసం నేను నిలబడి పోరాడుతున్నాను.

నిన్న ముఖ్యమంత్రి సంఘటనను నేను ఖండించాను. ప్రధానమంత్రి కూడా ఖండించారు. ఘటనపై అందరం స్పందించాలని చూశాము. సంఘటన జరిగిన అరగంటలోనే జగన్మోహన్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ప్లేకార్డులు తెచ్చి నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కొన్ని పేటీఎం కుక్కలు ఇష్టానుసారం మొరుగుతూనే ఉన్నాయి.. కరెంటు తీసి..నీపై గులకరాయి వేయించడానికి నాకేం పని జగన్? నీ పోలీసులు…నీ కరెంటు డిపార్ట్మెంట్ అధికారులను నీ చేతిలో పెట్టుకుని నాపై పడి ఏడ్వడం ఏంటి? నీకు ముఖ్యమంత్రిగా పనిచేయడం చేతకాకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి…ఒక్కగంటలో కరెంటును ఎలా గాడిలో పెట్టాలో తెలిసిన వాడిని..నాకు ఆ సత్తా ఉంది. చేసి చూపించిన ట్రాక్ రికార్డు నాకు ఉంది. నీ బాబాయ్ ను నువ్వే చంపి..నాపై నేరారోపణ చేసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకోవాలని చూసిన దుర్మార్గుడివి నువ్వు జగన్.. చెల్లెలిపై అక్రమ కేసులు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.

కోడికత్తి డ్రామా ఆడి..కోడి కత్తిని నేను ఉపయోగించానని అర్థరహితంగా మాట్లాడారు. నిన్న ఎవరో గులకరాయి వేస్తే…దాన్ని నాపై నెడుతున్నారు…దాన్ని సాకుగా చూపి నాపై రాళ్లు వేయిస్తున్నారు. బాంబులు వేస్తేనే నేను భయపడలేదు…ఈ రాళ్లకు భయపడతానా? తప్పుడు పనులు చేయొద్దు అని హెచ్చరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ పై , నాపై రాళ్లువేస్తే…ప్రధానమంత్రి కార్యక్రమంలో మైక్ లు కట్ చేస్తే మేం భయపడం. ప్రధానమంత్రి ఏపీకి వచ్చి మాట్లాడుతుంటే మైక్ లు పనిచేయలేదు..దీనిపై నేను, ప్రధాని అప్పీల్ చేస్తే పట్టించుకోలేదు. కొంత మంది టవర్లు ఎక్కితే ప్రధాని అప్పీల్ చేసి దిగేలా చేశారు..మీ ప్రాణాలు ముఖ్యం అని ప్రజలకు చెప్పారు. ప్రధాని సభలో పోలీసులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. పోలీసులకు నేను అప్పీల్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. మా కార్యక్రమాన్ని ఫెయిల్ చేస్తే మేం భయపడతామని అనుకున్నారు. ప్రధాని మాట ప్రజలు వినకూడదనేలా వ్యవహరించారు. అలా వ్యవహరించి పోలీసులపై నేటికీ చర్యలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా.

ముఖ్యమంత్రి కార్యక్రమం సమయంలో కరెంటు తీసేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ముఖ్యమంత్రిపై గులకరాయి వేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? 24గంటలైనా పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? దీనిపై సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ కు బాధ్యత లేదా? నాపై దాడి చేయిస్తూ రాక్షసానందం పొందాలని చూస్తున్నారా? ఓ ఎంపీని అక్రమంగా అరెస్టు చేయించి..ఇష్టమొచ్చినట్లు కొట్టించి..వీడియో తీయించి..ఆ వీడియో చూసి ముఖ్యమంత్రి రాక్షసానందం పొందాడు. ముఖ్యమంత్రిపై గులకరాయి పడితే కొంపలు కూలినట్లు అరుస్తున్నారు..గులకరాయి వేయడాన్ని నేను సమర్థించడం లేదు

గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను వైసీపీ రౌడీలు అడ్డుకున్నారు. కారులో హోటల్ కు వెళితే ఆ హోటల్ నుండి 24గంటల్లో విశాఖ వదిలిపెట్టాలని పోలీసులు హుకుం జారీ చేశారు. పోలీసులు ఉన్మాది జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని రెచ్చిపోయారు..ఈ విశాఖ మీ తాతజాగీరా జగన్మోహన్ రెడ్డి? ఈ విశాఖ రాష్ట్ర ప్రజలది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు నేను విజయవాడలో కలిసి ధైర్యం చెప్పాను..ఉన్మాది ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని చెప్పాను. పోలీసులు కూడా ఉన్మాది జగన్మోహన్ రెడ్డి మాటలు విని మనసు చంపుకుని, ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేశారు. నన్ను అరెస్టు చేసిన సమయంలో మొట్టమొదటిసారిగా స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్.

నిన్న ముఖ్యమంత్రిపై చీకట్లో పడింది ఓ చిన్న గులకరాయి…కానీ నేను ఇప్పుడు మాట్లాడుతుంటే వెలుగులో నాపైకి విసిరారు ఓ పెద్ద రాయి. ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే కరెంటు ఉండదా? ఏంటి ఈ డ్రామాలు? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు. నేను 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆవిలిస్తే నీ పేగులు లెక్కపెడతా…నాకు రాజకీయాలు నేర్పిస్తావా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి కి కార్యక్రమాలకు జనం రావడం లేదు..రారు…రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి బాధితులే..నేను కూడా బాధితుడినే…విశాఖ ప్రజలు బాధితులే…పల్లా శ్రీనివాస్, శ్రీ భరత్, గాజువాక ప్రజలంతా బాధితులే.

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదు. కరెంటు తక్కువుగా ఉన్న సమయంలో కూడా 24గంటలూ కరెంటు ఇచ్చాను. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి పర్యటన చేస్తున్న సమయంలో కూడా కరెంటు పోయే పరిస్థితి వచ్చింది. కరెంటు బిల్లు వైసీపీ పాలనలో 5రెట్లు పెరిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి అసమర్థతనం. ఇది అడిగితే మనపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను మనం క్షమించాలా? ముఖ్యమంత్రికి ప్రజలకు జవాబుదారీతనం లేదా? జగన్మోహన్ రెడ్డిని జవాబు అడిగితే పులివెందుల పంచాయతీలు చేస్తున్నాడు…పులివెందులది గొడ్డలి పంచాయతీలు. పులివెందుల గొడ్డలి పంచాయతీలు విశాఖపట్నంలో మీకు కావాలా?

.తెలుగుదేశంపార్టీ, భారతీయజనతాపార్టీలకు అభివృద్ధి చేయడం తెలుసు. దేశంలో సంపద సృష్టించడంలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ…కానీ ఏపీ అన్ని విధాలా నష్టపోయింది. 40ఏళ్లుగా మీరు నన్ను ప్రత్యేకంగా అభిమానించారు..ఉమ్మడి ఏపీలో అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నన్ను మీరు ఆశీర్వదించారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలోకి పోయింది…మనకు ఆదాయ వనరు పోయింది. ఏపీకి మరో హైదరాబాద్ లాంటి నగరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం ప్రారంభించాను..నదులను అనుసంధానం చేశాను. రూ.16లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాను. 2029నాటికి దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని చూశాను. మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు, నేను ఏపీని అభివృద్ధి చేయాలని చూశాను. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలని ప్రయత్నం చేశాను.

బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీలో ఎవరూ తక్కువ కాదు..మేం నిలబడతాం…మిమ్మల్ని నిలబెడతాం. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది…మనం కూడా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం. సంపద సృష్టిస్తాం…ఆదాయాన్ని పెంచుతాం..యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం..స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం…ఖర్చులు తగ్గించి…ఆదాయాన్ని పెంచి మెరుగైన జీవితాన్ని అందిస్తాం. ఆ బాధ్యత మాది.

గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇక్కడి ప్రజలను ఎన్ని తిప్పలు పెట్టాడో తెలియదు..ఎంత సంపాదించాడో తెలియదు. అన్నీ చేశాడు..కానీ నేడు అతని వసూళ్లన్నీ ఆగిపోయాయి. అతని గ్రాఫ్ రేట్ పడిపోయిందని ఇక్కడికి కోడిగుడ్డు మంత్రిని తీసుకొచ్చారు. పరిశ్రమలు ఎక్కడున్నాయి మంత్రి అని అడిగితే కోడి, గుడ్డు..కోడి గుడ్డును పాదగాలి అని చెబుతున్నాడు. ఈ కోడి గుడ్డును పగలకొట్టి ఆమ్లెట్ వేసి బుద్ధి చెప్పాలి. ఈ కోడి గుడ్డు మంత్రి ఓ కార్పొరేటర్ గా నా దగ్గర పెరిగాడు..నన్ను ఎన్ని తిట్లు తిట్టాడో..పవన్ కళ్యాణ్ ను కూడా ఇష్టానుసారం తిట్టాడు. ఎదుటి వ్యక్తులను ఆ కులాలకు చెందిన వ్యక్తులతో తిట్టించి శునకానందం పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కోడిగుడ్డు మంత్రి అనకాపల్లిని ఊడ్చేసి ఇక్కడికి వచ్చాడు. ముఖ్యమంత్రిని దావోస్ ఎందుకు వెళ్లలేదు అని అడిగితే చలి అని కబుర్లు చెబుతున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9సార్లు దావోస్ వెళ్లాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ లో ఏపీ ఓ బ్రాండ్ గా ఉండేది.

LEAVE A RESPONSE