-పోలీసుల ప్రేక్షకపాత్రపై బాబు ఆగ్రహం
-ఇది జె గ్యాంగ్ పనేనని ఆరోపణ
-బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా?
– గాజువాక సభలో జగన్ సర్కారుపై బాబు ఫైర్
గాజువాక: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న వేదికపై ఆకతాయిలు విసిరిన రాయి కలకలం సృష్టించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆగంతకులు విసిరిన రాయి దూరంగా పడింది. వెలుగు ఉండగ నే తనపై రాయి విసిరారంటే జె గ్యాంగ్ ఏ స్థాయిలో రెచ్చిపోతోందో అర్ధమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్న బెజవాడలో సీఎం జగన్పై రాత్రి వేళ రాయి వేశారు. ఇప్పుడు ఇంత వెలుగులో కూడా నాపై రాయి వేశారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది పోలీసు వైఫల్యమే’ అని ఆరోపించారు. డ్రగ్స్ గురించి ప్రశ్నించినందుకు పార్టీ ఆఫీసుపై దాడి చేశారన్నారు. నేను నాపై బాంబు దాడి జరిగితే భయపడలేదు. రాళ్ల దాడికి భయపడతానా? అని ప్రశ్నించారు.