Suryaa.co.in

Andhra Pradesh

నీ చెల్లెళ్లను నీ పార్టీవాళ్లు నిందిస్తుంటే పట్టదా జగన్?

-నీ మీడియానే చెల్లి వ్యక్తిత్వ హననం చేస్తుంటే పట్టించుకోవా జగన్?
-చిన్నాన్నను హత్య చేసిన వాడికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా?
-జగన్‌కు వివేకా భార్య సౌభాగ్యమ్మ బహిరంగలేఖ

వివేకా హత్యపై ఇప్పటివర కూ పెద్దగా మాట్లాడని ఆయన భార్య సౌభాగ్యమ్మ తొలిసారి సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. చిన్నాన్నను హత్య చేసిన వారికి టికెట్ ఇవ్వడం ధర్మమేనా అని నిలదీశారు. సొంత పార్టీ, సొంత మీడియా జమిలిగా చెల్లెళ్లను వ్యక్తిత్వ హననానికి గురిచేస్తుంటే మౌనంగా ఉంటావా జగన్?అంటూ ప్రశ్నల వర్షం సంధించారు.

సౌభాగ్యమ్మ ఇంకా తన లేఖలో ఏమన్నారంటే…
‘‘2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.. 2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన అంశం.. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం.

హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా నీ పత్రిక, నీ టీవీ చానెల్, నీ సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం, చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా ? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.. నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.. నీకు మాత్రం పట్టడం లేదా?

సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే.. నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి ? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన అయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం. ఇది సమంజసమా ?

ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నా. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా.’’ అని సౌభాగ్యమ్మ తన లేఖలో దీనంగా అర్ధించింది.

LEAVE A RESPONSE