Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులపై జగన్ రెడ్డి షాడోల పెత్తనం

•ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా మారిన వైనం
• రాష్రంలోని 36 రిజర్వడ్ నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి నియమించిన షాడోలే పెత్తనం చేస్తున్నారు
• వైసీపీలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు, ఆఖరికి మంత్రుల పరిస్థితి ఉత్సవ విగ్రహాల కంటే దారుణంగా ఉంది
• రాయలసీమలోని దళిత ఎమ్మెల్యేలపై పెద్దిరెడ్డి పెత్తనం చేస్తుంటే, కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజాప్రతినిధుల్ని సజ్జల ఆడిస్తున్నాడు.
•గోదావరి జిల్లాల్లో పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, తానే సర్వం అంటున్నాడు
• ఉత్తరాంధ్ర దళిత, గిరిజన ఎమ్మెల్యేలపై విజయసాయిరెడ్డి.. వై.వీ.సుబ్బారెడ్డి అజమాయిషీ చేస్తున్నారు
•వైసీపీ టిక్కెట్ కావాలంటే నోటిదూలైనా ఉండాలి.. కాళ్లదగ్గరైనా ఉండాలి..లేకుంటే విజయానందరెడ్డిలాగా ఘనమైన నేరచరిత్ర అయినా ఉండాలి
• చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి తప్ప.. జగన్ కు మంచివాళ్లు దొరకలేదా?

*నక్కా ఆనంద్ బాబు( టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి)

రాష్ట్రంలోని 36 రిజర్వడ్ నియోజవకర్గాల్లో ప్రజలచే ఎన్నుకోబడిన వైసీపీ ఎమ్మె ల్యేల పరిస్థితి దారుణంగా తయారైందని, ఉత్తరాంధ్రప్రాంతంలో వైసీపీ గెలుపొందిన ఎస్సీ.. ఎస్టీ నియోజకవర్గాలపై విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి పెత్తనం చేస్తుంటే, రాయలసీమ నియోజకవర్గాలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోస్తాంధ్ర నియోజకవర్గాలపై మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అజమాయిషీ చేస్తున్నారని, జగన్ రెడ్డి షాడోలుగా సర్వం తామై అధికారం వెలగబెడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!

మంత్రైనా.. మాజీ మంత్రైనా.. ఉత్తరాంధ్రలో వై.వీ.సుబ్బారెడ్డి.. విజయసాయిరెడ్డి చెప్పిందే శాసనం

“ఉత్తరాంధ్రప్రాంతంలోని రిజర్వడ్ నియోజకవర్గాల పరిధిలోని విలువైన అటవీ ఖనిజ సంపద దోచేసే పనిలో విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి నిమగ్నమ య్యారు. తామే చెప్పిందే శాసనమన్నట్టు దళిత, గిరిజన ఎమ్మెల్యేలను ఆడిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి కేవలం పేరుకే ఎమ్మెల్యే. పెత్తనమంతా సుబ్బా రెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిదే. అతను కాకుంటే ఎమ్మెల్సీ పాలవాయి విక్రాంత్ పెత్త నం సాగిస్తాడు. అరకు నియోజకవర్గం నుంచి శెట్టి ఫల్గుణను పూర్తిగా పక్కన పెట్టారు. రంపచోడవరం శాసనసభ్యురాలిగా నాగులాపల్లి ధనలక్మి ఉంటే, పెత్తన మంతా ఎమ్మెల్సీ అనంతబాబుదే.

రంగురాళ్ల వ్యాపారం, గంజాయి సాగు, అమ్మకం… మైనింగ్.. ఇతరత్రా ఖనిజ సంపద దోపిడీ వ్యవహారాలన్నీ జగన్ రెడ్డి అనుచరుడిగా అనంత బాబే సాగిస్తుంటారు. రాజన్న దొర పేరుకే మంత్రి.. ఆయన నియోజకవర్గంలో కూడా సుబ్బారెడ్డి కొడుకు చెప్పిందే వేదం. పాముల పుష్పశ్రీ వాణి నిన్నటివరకు మంత్రిగా చేశారు. ఆమె నియోజకవర్గంలో ఆమె భర్త పరీక్షిత్ రాజు పెత్తనం సాగిస్తుంటాడు. వాస్తవానికి అది ఎస్సీ నియోజకవర్గం.. కానీ ఎస్టీలుకాని పుష్ఫశ్రీవాణి, ఆమె భర్త అక్కడ తమదే రాజ్యమన్నట్టు వ్యవహరిస్తు న్నారు. ఇలాంటి వారంతా ఎలాంటి అధికారం లేకపోయినా, జగన్ రెడ్డి అండతో తామే సర్వస్వం అన్నట్టు పేట్రేగిపోతున్నారు.

*రాయలసీమలో పెద్దిరెడ్డి పెత్తనం…ఇటీవలే బోరున ఏడ్చిన పద్మావతి*

రాయలసీమ ప్రాంతానికి వస్తే శింగనమల ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతి ఇటీవలే నా నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పెత్తనమేంటి అని వాపోయారు. ఆమె తనబాధలు మీడియాతో చెప్పుకొని బోరున ఏడ్చింది. పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు తనకు జరిగిన అన్యాయం చెప్పుకొని, మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలపై బావురు మన్నారు. ఎం.ఎస్.బాబుకి మరలా టిక్కెట్ ఇవ్వకూడదనే పెద్దిరెడ్డి అతన్ని వేదిస్తున్నాడు. ఆర్థర్ నియోజకవర్గంలో సిద్ధార్థరెడ్డి పెత్తనం చేస్తున్నాడు. కుల అహంకారంతో సిద్ధార్థ రెడ్డి ఎక్కడలేని రౌడీయిజం చేస్తుంటాడు
.
గోదావరి జిల్లాల్లో పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సజ్జల రామకృష్ణారెడ్డిల హావాతో చేష్టలుడిగి చూస్తున్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు*

కోస్తా ప్రాంతానికి వస్తే పినిపె విశ్వరూప్ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి జులుం ప్రదర్శిస్తుంటాడు. తండ్రి రాయలసీమలో రౌడీయిజం చేస్తుంటే కొడుకు గోదావరి జిల్లాల్లో అధికారదర్పం ప్రదర్శిస్తుంటాడు. హోంమంత్రి తానేటి వనితను కేవలం హోంకే పరిమితం చేసి ఆమె అధికారం కూడా వీళ్లే సాగిస్తుంటారు. తెల్లం బాలరాజు నియోజకవర్గమైన పోలవరంలో కూడా మిథున్ రెడ్డిదే పెత్తనం. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని డమ్మీల్ని చేసి వారి నియోజకవర్గాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం సాగిస్తున్నాడు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని రిజర్వడ్ నియోజకవర్గాలన్నీ జగన్ రెడ్డి తనకు రాసిచ్చాడన్నట్టుగా సజ్జల నియంత్రత్వం గా వ్యవహరిస్తున్నాడు.

చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కూడా జగన్ సామాజి కవర్గం నేతల బాధితుడే. పత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మేకతోటి సుచరితను సజ్జల ఎంతగా వేధించాడో చూశాం. తాడికొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి, వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చివరకు బయటకు వచ్చింది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా వేరేవారికి ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించి, శ్రీదేవిని తెలివిగా బయటకు పంపించారు. మంత్రిగా ఉన్న మేరుగ నాగార్జునను వేమూరులో పనికిరాడని సంతనూతలపాడుకి పంపించారు అక్కడేమో అంతా మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హావా. దాంతో ఎటూపాలు పోక నాగార్జున తలపట్టుకున్నాడు.

గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పై ముగ్గురు రెడ్లు పెత్తనంచేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36 నియోజకవర్గాల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల పై, ఆఖరికి మంత్రులగా ఉన్న వారి నియోజకవర్గాల్లో కూడా జగన్ రెడ్డి షాడోల పెత్తనమే. ఐ.ఏ.ఎస్, ఐపీఎస్ అధికారులుగా చేసినా, ఎంతటి ఉన్నతస్థానాల నుంచి వచ్చి, ప్రజల మద్ధతుతో ఎమ్మెల్యేలుగా గెలిచినా దళితులు.. దళితులే అన్నట్టు జగన్ రెడ్డి.. అతని షాడోలు వ్యవహరిస్తున్నారు.
తెలుగుదేశంలో దళిత, గిరిజన నాయకులు తలెత్తుకు తిరుగుతుంటే, వైసీపీలో చేతులుకట్టుకొని తలదించుకొని బతుకుతున్నారు

తెలుగుదేశం పార్టీలోని దళిత నాయకులు ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో తలెత్తుకు బతుకుతుంటే, వైసీపీలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్నకూడా రెడ్డి సామాజికవర్గం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిన దుస్థితి. నిన్నటివరకు జగన్ రెడ్డి దళిత, గిరిజనజాతుల్ని నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆయా వర్గాల ప్రజాప్రతినిధుల్నే పూచిక పుల్లల కంటే హీనంగా తీసి పారేస్తున్నాడు. గతంలో వైసీపీ దళిత ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారికి ఓట్లేసిన ప్రజలు కూడా .. ఇప్పుడు వారికి జగన్ రెడ్డి చేస్తున్న శాస్తి చూసి.. అలా జరగాల్సిందే అంటూ సంతోషిస్తున్నారు.

వైసీపీలోని దళిత, గిరిజన నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి

వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, జగన్ రెడ్డిని తమ భుజాలపై మోసి, ఎవరైతే తనకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టారో ఆ వర్గాలనే జగన్ రెడ్డి.. అతని షాడో నాయకులు పూర్తిగా అణచివేశారనే చెప్పాలి. దళిత, బలహీనవర్గాలు జగన్ రెడ్డి తమకు చేస్తున్న అన్యాయం, మోసం గుర్తించారు. వైసీపీలోని ఆయా వర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులకే ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. వారు ఎంత త్వరగా కళ్లు తెరిస్తే, అంత త్వరగా తమ రాజకీయ జీవితాలను కాపాడుకోగలరు.

నోటిదూల ఉన్నవాళ్లను.. కాళ్లదగ్గర ఉండే వాళ్లనే జగన్ వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తాడు

వైసీపీలోని దళిత ప్రజాప్రతినిధుల్లో కూడా ఎక్కువ నోటిదూల ఉన్న వాళ్లను… ఎవరైతే తమ కాళ్ల దగ్గర పడిఉంటారో అలాంటి వాళ్లను మాత్రమే జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తాడు. మంత్రి నారాయణస్వామి ఆ కోవకు చెందినవాడే. పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి.. తాను కింద కూర్చున్నాడు కదా! మిథున్ రెడ్డి.. సుబ్బారెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వీళ్లే. ఎవరైనా వాళ్ల వెనకుండాల్సిందే.

గతంలో హోంమంత్రిగా ఉన్న మేకతోటి సుచరితను పక్కనపెట్టి, సజ్జల గుంటూరుజిల్లాలో ప్రారంభోత్సవాలు చేశాడు. ఆత్మాభిమానం చంపుకొని జీవచ్ఛవాల్లా బతకడం కంటే స్వేఛ్చగా బయటకు వచ్చి తలెత్తుకు జీవించడమే మంచిది.

వైసీపీ టిక్కెట్ పొందడానికి ఉండాల్సిన మరో గొప్ప అర్హత విజయానందరెడ్డిలాగా ఘనమైన నేరచరిత్ర
వచ్చే ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ కావాలంటే నోటిదూలైనా ఉండాలి.. లేక జగన్ రెడ్డి, ఆయన షాడోల కాళ్లదగ్గరైనా పడుండాలి..అవేవీ చేయలేకపోతే కనీసం విజయానందరెడ్డిలాగా గొప్ప నేరచరిత్రైనా ఉండాలి. అవి ఉంటేనే జగన్ రెడ్డి ఇష్ట పడతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో పేరుప్రఖ్యాతులున్న వ్యక్తిని చిత్తూరు అభ్యర్థి గా నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా అనతికాలంలోనే వందలకోట్లకు పడగలెత్తి, అక్రమార్జనతో రాజకీయనాయకుడి అవతారమెత్తిన మెట్టపల్లి చిన్నప రెడ్డి విజయానందరెడ్డిని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు.

2014లో టీడీపీప్రభుత్వంలో ఆయనపై పీడీయాక్ట్ నమోదై జైలుకువెళ్తే, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజమహేంద్రవరం జైలుకెళ్లి మరీ విజయా నందరెడ్డితో భేటీ అయ్యాడు. విజయానంద రెడ్డికి మొదట్నుంచీ జగన్ తో సత్సంబంధాలున్నాయి. 2014 జనవరి 23న జగన్ రెడ్డి స్వయంగా కొట్రాలపల్లె లోని విజయానందరెడ్డి ఇంటికెళ్లాడు. ముఖ్యమంత్రి ప్రపంచం సిగ్గుపడేంత పెద్ద నేరస్తుడు అయినప్పుడు తన కింద విజయానందరెడ్డి లాంటి చిన్నచిన్న నేరస్తు లు, స్మగ్లర్లు, ఉండాలనుకోవడంలో ఆశ్చర్యమేముంది?

ఎన్ని విగ్రహాలు పెట్టినా స్మృతివనం ముందు దిగదుడుపే

రాజధాని అమరావతిలో చంద్రబాబునాయుడు ప్రారంభించిన అంబేద్కర్ స్మృతి వనం పూర్తిచేయకుండా విజయవాడ లో విగ్రహాలు పెడితే ఉపయోగం ఏమిటి? విజయవాడ.. విశాఖపట్నం..తిరుపతి ఎక్కడ ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, రాజధానిలో ఆయన పేరిట నిర్మించతలపెట్టిన స్మృతివనం ముందు అవ న్నీ దిగదుడుపే.” అని ఆనంద్ బాబు తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE