Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ఆరు విధ్వంసర ఆర్ధిక విధానాలతో రాష్ట్రం సర్వనాశనం

జగన్ రెడ్డి పాలనలో బడ్జెట్ కేటాయింపులకు విలువ లేదు.
అసెంబ్లీకి చెప్పకుండా తెచ్చిన రూ.5 లక్షల కోట్ల రుణాలు ఏం చేశారు.?
ఆర్.బి.ఐ నుంచి తీసుకున్న తాత్కాలిక అప్పులు రూ.1,18,039 కోట్లు ఏమయ్యాయి?
– శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

బ్యాడ్ డెట్, హై కరెప్షన్, హై ఇన్‌ప్లేషన్, హై అన్ ఎంప్లాయ్‌మెంట్, హై డెఫిసిట్స్, సిస్టమ్స్ కొలాప్స్ అనే ఆరు విధ్వంసకర ఆర్ధిక విధానాలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ రెడ్డి దోపిడిలో భాగంగా రాష్ట్రంలోని సహజవనరులను ఇష్టానుసారం దోచుకున్నారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్లు దోచుకున్నారు. 2-3 శాతం కంటే ఎక్కువ ఉండకూడని ద్రవ్యోల్బణం నేడు రాష్ట్రంలో 8.5 శాతంగా ఉంది.

రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగిత 24 శాతం. 2018-19 లో రూ.35,467 గా ఉన్న ద్రవ్యలోటు 2022-23 కి రూ.52,508 కోట్లకు చేరుకుంది. 2018-19 లో రూ.13,899 గా రెవెన్యూ లోటు 2022-23 నాటికి రూ.43,487 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ లోటు టిడిపి హయాంలో మొత్తం రెవెన్యూ రాబడుల్లో 12.12% ఉంటే నేడు అది 28%. ఇది టిడిపి హయాంలో కంటే రెండు రెట్లు కన్న అధికం.

రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. జగన్ రెడ్డి పాలనలో అసెంబ్లీ నుంచి అనుమతి పొందిన పద్దులకు విలువ లేకుండా చేశారు. అసెంబ్లీకి చెప్పేదొకటి చేసేది మరొకటిలా ఐదేళ్ల పాలన సాగింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి శాసనసభకు చెప్పి తెచ్చిన అప్పులని సైతం బుగ్గన దాచిపెట్టారు. ఇవికాక ఏడాదికి లక్ష కోట్లకు పైగా బడ్జెటేతర అప్పులు తెచ్చారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు కేవలం బడ్జెటేతర అప్పులే ఉన్నాయి.

ఆర్ధిక మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం అబద్దాల తేనెతుట్టెలా తియ్యగా పలికారు. 2022-23 ఏడాది రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం ఆర్.బి.ఐ నుంచి తెచ్చిన తాత్కాలిక అప్పులతోనే నడిపింది. ఏడాదిలో 365 రోజుల్లో 24 రోజులు తప్ప మొత్తం ఏడాది చేబదుళ్లతోనే గడిచింది. ఓడీ 152 రోజులు తీసుకున్నారు. ఈ విధంగా ఆర్.బి.ఐ ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో తీసుకున్న రూ.1,18,039 కోట్లు ఏం చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. జగన్ రెడ్డి పాలన మొదలైన ఏడాది నుంచి చివరి ఏడాది వరకు ఏడాదికి లక్ష కోట్లకు చొప్పున ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు కార్పొరేషన్ రుణాలు తీసుకున్నారు. ఈ అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో కాగ్‌కు సైతం చెప్పలేదు.

జగన్ రెడ్డి ప్రభుత్వ అప్పులపై కేంద్రం, ఆర్.బి.ఐ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థలకు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలని ఆర్.బి.ఐ బ్యాంకులను హెచ్చరించింది. ఐదేళ్లలో జగన్ రెడ్డి రూ.7.80 లక్షల కోట్లు అప్పులు చేసినా రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. 2022-23 లో తీసుకున్న బడ్జెట్ అప్పులు రూ.67,985 కోట్లు అయితే అందులో నుంచి రాష్ట్రానికి ఆస్తులు కల్పన చేసే మూలధన వ్యయంకు చేసిన ఖర్చు కేవలం రూ.9,017 కోట్లు మాత్రమే.

ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.55 శాతం మాత్రమే. ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్.జి.ఎస్.టి) ఎలా పెరుగుతుంది? రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021-22 లో 11,22,837 కోట్లు ఉండగా 2022-23 లో 13,17,728 కోట్లకు పెరిగిందని తప్పుడు లెక్కలు ప్రచురించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శూన్యం. ఆర్.టి.ఐ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమలు కేవలం 18. వాటి విలువ కేవలం రూ.5,710 కోట్లు. వాటి ద్వారా కల్పించబడ్డ ఉద్యోగ అవకాశాలు 9,158. టిడిపి ఐదేళ్ల హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల సంఖ్య 40,969, పెట్టుబడులు రూ.11,17,907 కోట్లు, 13,88,733 మంది ఉపాధి అవకాశాలు పొందారు.

గత పదేళ్ల టిడిపి, వైకాపా ప్రభుత్వాలు వివిధ రంగాలకు చేసిన వాస్తవ ఖర్చుల శాతాలు చూస్తే…వ్యవసాయంలో టిడిపి ప్రభుత్వం 86% ఖర్చు చేస్తే వైకాపా ఖర్చు చేసింది 71%. గ్రామీణాభివృద్ధిలో 121 % టిడిపి ఖర్చు చేస్తే..వైకాపా చేసింది 72%, నీటిపారుదల, వరద నివారణలో 102 % వైకాపా చేసింది 59 %, త్రాగునీరు, సానిటేషన్ లో టిడిపి 130% ఖర్చు చేస్తే..వైకాపా చేసింది కేవలం 61% మాత్రమే. వివిధ రంగాలకు బడ్జెట్ లో కేటాయించిన ప్రకారం ఖర్చు చేయకుండా రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుంది? రాష్ట్ర తలసరి ఆదాయం ఎందుకు పెరుగుతుంది? రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై వైకాపా ప్రభుత్వం చెప్పేవన్నీ దొంగ లెక్కలే.

జగన్ రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలయ్యారు
బుగ్గన్న బడ్జెట్ ప్రసంగంలో పేదలు తగ్గారని అబద్దాలు చెప్పారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో మన రాష్ట్రం స్థానం ఎక్కడో చెప్పకుండా పేదరికం తగ్గిందని చెప్పడం అవివేకం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మన రాష్ట్రంది 13 వ స్థానం. హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో మనది 20 వ స్థానం.

దక్షిణాధి రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక లు పేదరిక నిర్మూలనలో మనకంటే ఎంతో మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మన కంటే వనరులు తక్కువైన పొరుగు రాష్ట్రం తెలంగాణ ఏపీ కంటే మెరుగ్గా 21 స్థానంలో నిలిచింది. పేదల ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సిన ఆరోగ్యశ్రీకి కూడా జగన్ రెడ్డి రూ.1200 కోట్లు బకాయి పెట్టారు. ఇదేనా పేదరిక నిర్మూలన?

LEAVE A RESPONSE