Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం

– రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడు
– టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సి.రామచంద్రయ్య, ద్వారకానాథ్ రెడ్డి, దాడి వీరభద్రరావు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో చేరిక
– అనంతపురం, బాపట్ల, చీరాల, పార్వతీపురం నియోజకవర్గాల నుండి పలువురు పార్టీలోకి రాక
– అందరినీ సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి :- రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టమని, వైసీపీ నేతలు రాక్షసుల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రాజకీయాల్లో లేకుండా ఉంటే రాష్ట్రంలో ఇంతటి విధ్వంసం జరిగేది కాదని, పోలవరం, రాజధాని అమరావతిని నాశనం చేశాడని దయ్యబట్టారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అన్నమాటే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను జగన్ అపవిత్రం చేశాడన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల కోసం 5 ఏళ్లు కష్టపడతారు..కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంజాయ్ చేసి, రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు దాడి వీరభద్రారావు, ఆయన తనయులు దాడి రత్నాకర్, దాడి జైవీర్, బాపట్ల జిల్లా, కర్లపాలెం జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, అనంతపురంనకు చెందిన డా.కె.రాజీవ్ రెడ్డితో పాటు పలువురు ముస్లిం నేతలు బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…‘‘మరో వంద రోజల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. 45 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా..1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. ఎంతోమంది సీఎంలను చూశాను గానీ జగన్ లాంటి దారుణమైన ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా దందాలు..దోపిడీలే
జగన్ సీఎం అయ్యాక రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారు.. 75 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యవస్థలను జగన్ విధ్వంసం చేశాడు. రాష్ట్రంలో రోడ్లు, వ్యవసాయం, విద్య, వైద్యం అన్నీ దెబ్బతిన్నాయి. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై ఎవరు మాట్లాడినా దాడులు చేసి కేసులు పెట్టారు. ఎక్కడ చూసినా దందాలు, దోపిడీలే. ప్రజలు అసహ్యించుకుంటుంటే జగన్ కొత్తగా ఆలోచించి ఎమ్మెల్యేలను మార్చుతున్నాడు. ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేసి, ప్రజల మద్ధతు కోల్పోతే నీ ఇంటెలిజెన్స్ ఏమి చేసింది.? తప్పు చేసిన ఎమ్మెల్యేలను ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా.? ఇది తప్పు అని చెప్పారా.? వాళ్లకు దొరికింది వాళ్లు దోచుకున్నారు.

నువ్వు చేసిన సర్వేలో నువ్వే లాభం లేదని అనుకుంటున్నారు జగన్. పరిశ్రమలు తరిమేశాడు. రోడ్లన్నీ పాడైపోయాయి. ఏ ప్రాజెక్టూ పూర్తి చేయలేదు..విపరీతంగా అప్పులు చేశాడు. ఇష్టారీతిన అవినీతి చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. జగన్ రాజకీయాలను అపవిత్రం చేశాడు. మంచి, చెడుకు తేడా తెలియని వ్యక్తి జగన్. రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలోకి నెట్టారు. వ్యవస్థలు సక్రమంగా ఉండి..నడిపించే వ్యక్తులు సమర్థులుగా ఉంటే దాని ఫలితాలు సామాన్యులకు దక్కుతాయి.

టీడీపీ ప్రవేశపెట్టిన వంద సంక్షేమ పథకాలు రద్దు
స్కూలు బిల్డింగులకు రంగులు వేయడం అభివృద్ధి కాదు… చదువుకున్న విద్యార్థి మేథావి అయి, మంచి ఉద్యోగం సాధిస్తే అది నిజమైన అభివృద్ది. పైపైన రంగులు దుద్ది అదే అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ కూడా ఇచ్చింది..మేం ప్రవేశపెట్టిన 100 సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్కాలర్ షిప్ లు టీడీపీ హయాంలో 16 లక్షల మందికి ఇస్తే..దానికి విద్యా దీవెన అని పేరు పెట్టి 10 లక్షలకు కుదించి బటన్ నొక్కుతూ సొంత పత్రికకు ప్రకటనలిచ్చుకుంటున్నాడు.

చదువుకోవాలనుకునే ప్రతి విద్యార్థికీ విదేశాల్లోనూ చదువుకునే అవకాశం కల్పిస్తేనే నిజమైన విద్యాభివృద్ధి..అదే టీడీపీ చేసి చూపింది. విదేశీ విద్య కింద ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఆర్థిక సాయం అందించాం. భయంకరంగా జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. నా జీవితంలో ఇంతలా మార్పులు వినలేదు..చూడలేదు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి..జవాబుదారీ తనం తీసుకురావడానికి. ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజల్ని లీడ్ చేయాలి. పుచ్చలపల్లి సుందరయ్యను ప్రజలు ఇప్పుడూ గుర్తంచుకుంటున్నారు.

రాజకీయాలకు నూతన నిర్వచనం నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్
తెలుగుజాతి బతికున్నంతకాలం గుర్తుండే వ్యక్తి ఎన్టీఆర్. 60 ఏళ్ల వయసు తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు..ఆయన జీవితం ఒక ఆదర్శం. పదవి, డబ్బులు కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. తనను ఆదరించిన ప్రజలకు సేవ చేయాలని, నీతివంతమైన రాజకీయం చేయాలని వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం నేర్పించారు ఎన్టీఆర్. అభివృద్ధి-సంక్షేమాన్ని పద్ధతిప్రకారం నడిపించారు. రిషికొండ లాంటి చారిత్రక కొండను తవ్వేసి, ప్యాలెస్ కట్టేశాడు. ఈయనే సీఎంగా శాశ్వతంగా ఉంటాడనుకున్నారు.

రూ.500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకుని ఏ విధంగా సమర్థించుకుంటావు.? మా ఇంటికి వంద గజాల చిన్న రోడ్డు వేస్తే ప్రతి రోజూ విమర్శించిన వ్యక్తి…తన ఇంటికి 4 లైన్ల రోడ్డు వేసుకున్నాడు. రాజధాని విశాఖ తీసుకెళ్తానంటే కోర్టులు కూడా ముట్టికాయలు వేశాయి. అమరావతి అంశాన్ని ఏప్రిల్ లో వింటామని సుప్రీంకోర్టు చెప్పింది..అప్పటికి జగన్ ఉండరు..మళ్లీ టీడీపీనే వస్తుంది. నువ్వు రాజధాని మార్చలేవు..విశాఖ పోలేవు. కానీ రాజధాని పేరుతో విశాఖ ప్రజలను మోసం చేశావు. సాధ్యం కాదని తెలిసి కూడా వందల కోట్లు లాయర్లకు విచ్చిలవిడిగా డబ్బులిచ్చి దుర్వినియోగం చేశాడు.

నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ…వారినే మార్చేస్తున్నాడు
మొన్న 11 మందిని, నిన్న 27 మందిని మార్చాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడు..కానీ వారినే మార్చాడు. నేను పుల్లను నిలబెట్టినా గెలుస్తారు అన్నావ్ కదా…మరి ఇప్పుడున్నవాళ్లను పెట్టి ఎందుకు గెలిపించలేవు.?. సీఎం పదవి కోసం నేను ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఎవరన్నా రావాలన్నా భయపడిపోతున్నారు. ఆస్తులను రాసిస్తావా లేదా అని మెడపై కత్తిపెట్టి రాయించుకుంటున్నారు.

విశాఖలో యువతిపై 11 మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు..అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా.? శాంతి భద్రతల గురించి సీఎం పట్టించుకుంటున్నాడా.? నేను సీఎంగా ఉన్నప్పుడు పిడుగురాళ్లలో అత్యాచారం జరిగితే టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి నిందితుడు భూమ్మీద ఎక్కడున్నా పట్టుకురమ్మంటే..విషయం తెలుసుకున్న నిందితుడు తెలుసుకుని ఉరేసుకుని చనిపోయాడు. పాలకులు సమర్థులుగా ఉంటే మిగిలిన వాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని పని చేస్తారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే విమర్శలు చేస్తారా అని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు.

రాష్ట్రంలో పండిన గంజాయి పక్క రాష్ట్రాలకు వెళ్లడంతో వాళ్లూ ఏపీని తిడుతున్నారు. బాధ్యత కలిగిన నాయకులందరూ ఆలోచించాలి. మనం చూసుకుంటూ కూర్చుంటే రాష్ట్రంలో ఏమీ మిగలదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ నెల 5వ తేదీ నుండి రా..కదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రజలకు ఏమి చేస్తానో చెప్పేందుకు 25 పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తా. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులు, గురుకులాల సిబ్బంది రోడ్లపైకి వస్తే వాళ్లని బెదిరిస్తున్నారు. న్యాయమైన కోరికల కోసం ఆందోళన చేస్తే సమర్థిస్తాం..వాటిని పరిష్కరించేందుకు ముందుకొస్తాం.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అంతకుముందు పార్టీలో చేరిన వారిలో చీరాలకు చెందిన క్రీడా మాజీ అధికారి నక్కల అర్జున రావు, హైకోర్టు న్యాయవాది సింగయ్య గౌడ్, పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లతో మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందిరినీ చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యేలు, పీలా గోవింద్, ప్రభాకర్ చౌదరి, లింగారెడ్డి, యరపతినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, పుట్టా సుధాకర్ యాదవ్, చీరాల ఇంఛార్జ్ మాలకొండయ్య యాదవ్, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, శ్రీరామ్ చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE