Suryaa.co.in

Andhra Pradesh

ఇరిగేషన్ శాఖ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి వాటా

-ఇరిగేషన్ శాఖలో భారీ కుంభకోణం
– ఒకే పని పేరుతో మూడు, నాలుగు సార్లు బిల్లులు. పనులు చేయకుండానే వందల కోట్ల ప్రజల సొత్తు స్వాహా
– రైతులు చందాలు వేసుకుని చేసుకున్న పనులకు కూడా బిల్లులు చేసేసుకున్న వైసీపీ నేతలు
-ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే రూ.300 కోట్లకు పైగా స్కామ్
– మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీలైన శ్రీధర్, నిరంజన్ రెడ్డిల పేరుతో బిల్లుల డ్రా
-ఒక్కసారి బిగిస్తే రెండు దశాబ్దాలు పాటు ఉండాల్సిన ఐరన్ షట్టర్ల పేరుతో ఏటా బిల్లులు చేసుకున్న వైనం
– కాకాణి నేతృత్వంలో జరిగిన అక్రమాలకు అడ్డగోలుగా సహకరించిన ఇరిగేషన్ శాఖ అధికారులు
– ఈ స్కామ్ లో మంత్రి కాకాణితో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డికి షేర్ ఉండటంతోనే ఉన్నతాధికారుల మౌనం
– నెల రోజుల క్రితమే 10 మంది రాష్ట్ర స్థాయి అధికారులకు ఆధారాలతో సహా రైతులు ఫిర్యాదు చేసినా స్పందన కరువు
– డేంజర్ జోన్ లో ఉన్న సోమశిల ఆఫ్రాన్ పనుల బిల్లులకు రూ.20 కోట్లకు దిక్కులేదు కానీ, ఇక్కడ పనులు చేయకుండానే వైసీపీ నేతలకు వందల కోట్లు దోచిపెట్టిన అధికార యంత్రాంగం
– ప్రైవేటు టోల్ లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాటా
– దారుణాలను మౌనంగా చూస్తున్న కలెక్టర్ ను కూడా వదిలిపెట్టబోము.
– భారీ కుంభకోణాన్ని పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో బయటపెట్టిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
-ఇవి రాజకీయ ఆరోపణలు కాదని, జర్నలిస్టులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు జరిగాయో, లేదో పరిశీలించాలని పిలుపు
– టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారందరినీ ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరించిన సోమిరెడ్డి

నెల్లూరు : ఇరిగేషన్ శాఖ అక్రమాలకు అడ్డాగా మారింది. సెంట్రల్ డివిజన్ పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గంలోనే రెగ్యులర్ ఫండ్స్, ఓ అండ్ ఎం, ఎఫ్.డీ.ఆర్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.300 కోట్లను పనులు చేయకుండానే భోంచేశారు. ఒకే పనిని వివిధ హెడ్ల కింద వేర్వేరుగా చూపి నిధులు కాజేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిపోయిన పనులకు కూడా ఈ ప్రభుత్వంలో మళ్లీ చేసినట్లు చూపి భారీ స్కామ్ కు పాల్పడ్డారు.

ఎఫ్.డీ.ఆర్ 11/2021లో రూ.10 లక్షల లోపు పనులను రూ.100 కోట్లకు అగ్రిమెంట్ చేశారు. సీఎఫ్ఎంఎస్, జీఎస్టీ పోర్టల్ లో 1/2022 నుంచి 12/2023 వరకు ఎవరి పేరుతో ఎంత పేమెంట్ జరిగిందో స్పష్టంగా ఉంది. పనులు చేయకుండానే సెంట్రల్ డివిజన్ పరిధిలో డ్రా చేసిన నిధుల వివరాలు నెల వారీగా ఆన్ లైన్ లో ఉన్నాయి.

ఉదాహరణకు ఈదగాలి హెడ్ రెగ్యులేటర్ కు ఓ అండ్ ఎం 12/2019లో రూ.9 లక్షలు మంజూరయ్యాయి. అదే పనికి 2021లో ఎఫ్.డీ.ఆర్ నిధులు రూ.9.50 లక్షలు డ్రా చేశారు. అసలు పనులు మాత్రం టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు కింద రూ.9 లక్షలతో చేయడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్ షట్టర్స్ రీప్లేస్ మెంట్, కాంక్రీట్ పనులను ఒకసారి చేస్తే పది నుంచి 20 ఏళ్ల పాటు మళ్లీ చేసే అవసరం ఉండదు. కానీ పనులు చేయకుండానే రెండు, మూడు సార్లు నిధులు దోచేశారు.

ముత్తుకూరు గేటు వర్క్ షాపు వద్ద నీరు –చెట్టు నిధులు రూ.9.50 లక్షలతో 2017లో షట్టర్స్ ఏర్పాటు చేశారు. అదే పని పేరుతో 2021లో రూ.9.50 లక్షలు డ్రా చేశారు. షట్టర్ల ఏర్పాటుకు సుమారు రూ.9 కోట్లు మంజూరు చేయించి శ్రీదర్ ఇంజనీరింగ్ కంపెనీకి నామినేషన్ విధానంలో పనులు అప్పగించారు. ఒక్క షట్టర్ ఏర్పాటు చేయకుండానే ఆ రూ.9 కోట్లు నిధులు స్వాహా అయిపోయాయి.

కోడూరు సిస్టమ్ లో 19 పనులు, కృష్ణపట్నం కాలువకు సంబంధించి 21 పనులు, వల్లూరు కాలువ 14 పనులు, సర్వేపల్లి కాలువ పేరుతో 7 పనులు, సర్వేపల్లి రిజర్వాయర్ కింద 21 పనులకు నిధులు డ్రా చేశారు. వీటన్నింటిలో ఒక్క పని చేస్తే ఒట్టు. కనుపూరు కాలువ కింద 16 పనులు, కొమ్మలపూడి బ్రాంచ్ కెనాల్ కింద 18 పనులు బుక్ చేశారు. ఈ పనులు చేయకుండానే కోట్ల రూపాయల నిధులు డ్రా అయ్యాయి.

నిధుల స్వాహాకు సంబంధించి పూర్తి వివరాలు జర్నలిస్టుల ముందు పెడుతున్నాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు జరిగాయో లేదో పరిశీలించవచ్చు. పెన్నార్ డెల్జా సిస్టమ్ కింద ఐదు ప్యాకేజీల్లో పనులు చేసినట్టు చూపారు. అవి కూడా బోగస్. చరిత్రలో ఎప్పుడూ ఇలా అడ్డగోలుగా దోపిడీ జరగలేదు.

ఓ అండ్ ఎంలో 4/2019 నుంచి 3/2022 వరకు పనులు చేయకుండానే ఎంత నిధులు డ్రా చేశారో ఆన్ లైన్ లో స్పష్టంగా ఉన్నాయి. కొమ్మరపూడి –ములుముడి వద్ద కాలువ హద్దుకు రాళ్లు నాటి ట్రెంచ్ ఏర్పాటు చేశామని నిరంజన్ రెడ్డి పేరుతో రూ.90 లక్షలు డ్రా చేశారు. కనుపూరు కాలువ పరిధిలో మామిడిగుంట చెరువులో సిల్టు తీయడం పేరుతో మరొకరికి రూ.25 లక్షలు జమయ్యాయి. ఆయా గ్రామాలకు వెళ్లి చెరువుల్లో పూడిక తీశారా, కాలువకు హద్దు రాళ్లు నాటారో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి.

ఎన్.ఆర్.ఈ.జీఎస్ నిధులతో కాలువలు పూడికలు తీసినట్లు చూపి ఒక్కో ఊరిలో రూ.30 లక్షలు నుంచి రూ.80 లక్షల వరకు లేపేశారు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు రూ.70 కోట్లు వరకు డ్రా అయినట్లు తెలుస్తోంది. పొదలకూరు మండలం విరువూరులో రైతులు చందాలు వేసుకుని కాలువ తవ్వుకుంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి శిష్యుడు రూ.54 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఎక్కువ శాతం నిధులు శ్రీధర్, నిరంజన్ రెడ్డిల పేరుమీదే డ్రా అయ్యాయి. వీరిద్దరూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బినామీలు, ఏజెంట్లు.

ఒక్క సర్వేపల్లిలో నియోజకవర్గంలోనే రూ.300 కోట్ల స్కామ్ వెలుగుజూసింది. ఇక జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. కాలువలు, చెరువుల పేరుతో మాత్రం వందల కోట్లు అడ్డంగా దోచేశారు. ప్రధానమైన సోమశిల జలాశయ ఆఫ్రాన్ దెబ్బతింటే మాత్రం పట్టించుకోరు. ఇప్పటికే ఈ స్కామ్ వివరాలు, పక్కా సాక్ష్యాధారాలను ఏపీ విజిలెన్స్ కమిషన్, ఏసీబీ డీజీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈఎన్సీ, కడా కమిషనర్, క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్, తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్, కలెక్టర్ కు పంపాము.

నెల రోజుల క్రితం పక్కా ఆధారాలను అధికారులకు పంపితే ఈ రోజుకి విచారణ లేదు. ఒక్క అధికారిపై చర్యలు లేవు. జిల్లాలో ప్రజల సొత్తు పట్టపగలే దోపిడీకి గురవుతున్నా కలెక్టర్ కు పట్టదు. వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమి చెబితే అదే ఆయన చేస్తారు. నెల్లూరు జిల్లాలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు. అన్నింటిలో షేర్ తీసుకుని అక్రమాలను ఆయనే ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.

కృష్ణపట్నం పోర్టు గేటు వద్ద కాకాణి ఏర్పాటు చేసిన ప్రైవేటు టోల్ లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందంట. ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో దోచేసిన వందల కోట్ల రూపాయలను కాకాణి ఒక్కడే తీసుకున్నాడా. లేక జగన్మోహన్ రెడ్డికి కూడా వాటా వెళ్లిందా?

మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఈ అక్రమాలన్నింటిపై నిపుణుల కమిటీతో విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వారంతా ఊచలు లెక్కపెట్టాల్సిందే. ఇన్ని దారుణాలను మౌనంగా చూస్తున్న కలెక్టర్ ను కూడా వదిలిపెట్టబోము.

LEAVE A RESPONSE