Suryaa.co.in

Andhra Pradesh

కాణిపాకం ఆలయంలో బంగారు విభూతి పట్టీ ఆభరణం మాయం

సత్య ప్రమాణాలకు నిలయంమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిత్యం ప్రమాణాలు అంటే ఎంతటి వారైనా భయపడాల్సిందే. బావిలో నుంచి వెలసిన విఘ్నేశ్వరుడు‌ పెరుగుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ప్రతి నిత్యం వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి‌ భక్తులు కాణిపాకం ఆలయానికి చేరుకుని స్వామి వారి దర్శన భాగ్యం పొందుతుంటారు.

రోజు దాదాపుగా ఇరవై వేలకు పైగా భక్తులు కాణిపాకంలో మొక్కులు చెల్లించుకుంటారు. అయితే స్వామి వారిపై భక్తి భావంతో భక్తులు వారి స్థోమతకు తగ్గట్టుగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు, భూములను విరాళంగా అందిస్తారు. ఇలా స్వామి వారికి అందించిన ఆభరణాలను కాణిపాకం ఆలయ ఈవో స్ట్రాంగ్ రూంలో భధ్ర పరుస్తారు. కాణిపాకం ఆలయాన్ని పునఃనిర్మాణం పూర్తి అయిన తరువాత ఆలయ కుంభాభిషేకం రోజున స్వామి వారి మూలవరుల విగ్రహాన్ని అలంకరించేందుకు బంగారు విభూతి పట్టీని విరాళంగా అందించారు.

దాత అందించిన విభూతి పట్టీ ఉన్నట్టుండి మాయం అయ్యింది. ఆలయం విరాళాల రశీదు పుస్తకంలో విరాళానికి సంబంధించిన వివరాలు లేక‌పోవడంతో విరాళం విషయాన్ని అధికారులు, పాలక మండలి మరిచిపోయింది. ఇంతలో దాత తనకు రశీదు పత్రం అందించలేదని ఆలయ అధికారులును కోరడంతో గుర్తు చేసుకున్న అధికారులు విభూది పట్టీ ఆభరణంపై ఆరా తీశారు. నలభై ఐదు రోజులగా ఆలయంలో కనిపించని ఆభరణం ఉన్నట్టుంది ఆలయంలోని యాగశాలలో ప్రత్యక్షం అయ్యింది. అసలు తిరిగి యాగశాలలోకి ఆభరణం ఎలా వచ్చిందంటే…

ఆలయాలను సందర్శించిన సమయంలో భక్తులు తమ స్థోమతకు తగ్గట్టుగా విరాళాలు ఇవ్వడం తరచూ జరిగే విషయమే. కానీ ఇలా విరాళాలు అందిన భక్తులకు వెంటనే అందుకు సంబంధించిన రశీదును అధికారులు ఇస్తారు. అయితే కాణిపాకం ఆలయంలో భక్తుడు స్వామి వారిపై భక్తిభావంతో విభూది పట్టీని విరాళంగా ఆలయ కుంభాభిషేకం నాడు అందజేశారు. అయితే కుంభాభీషేకం ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, ఆర్.కే. రోజాలు హాజరయ్యారు. మంత్రులు, అధికారులు, భక్తులతో ఆలయంలో హడావిడి‌గా ఉండే సమయంలో వేలూరుకు చెందిన ఒక ట్రస్ట్ నుంచి కుంభాభిషేకం రోజు సుమారు 18 లక్షలు విలువ చేసే బంగారు విభూదిపట్టిని విరాళంగా ఆలయ అర్చకుడి చేతికి అందజేశారు.

కుంభాభిషేకం రోజు స్వామి వారి మూలవిరాట్ కి అలంకరించి తర్వాత ఆలయ అర్చకుడు బంగారు విభూదిపట్టిని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. ఆలయ అధికారులు సైతం కుంబాభిషేకం రోజు స్వామివారి పైన ఉన్న బంగారు విభూదిపట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అనే సంగతి అడగటం మరచారు. అయితే యాగశాలో అర్చకులు, అధికారులు, పాలక మండలి సభ్యులకే మాత్రమే అనుమతి ఉంటుంది. లక్షల విలువ చేసే ఆభరణం విషయంలో ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని దాతలు ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత జరిగినా విభూదిపట్టి కాజేసేందుకు ప్రయత్నించిన ఆలయ అర్చకుడిపై అధికారులు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అయితే విభూది పట్టి మాయం అయిన ఘనట బయటకు వస్తే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని అధికారులు, పాలక మండలి విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

కాణిపాకం ఆలయంలో దాత విరాళంగా అందిన విషయంపై స్వాతంత్ర ఛానల్ ప్రతినిధి ఆలయ ఈవోని వివరణ అడుగగా విరాళంగా అందించిన విభూది పట్టీకి సంబంధించిన రశీదును దాతకు అందించామన్నారు. తాను నూతనంగా భాధ్యతలు చేపట్టడంతో ఈ విషయాలు తమకు తెలియదని, విభూది పట్టి విషయం తమ దృష్టికి రావడంతో ఆరా తీసి ఆభరణం స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కాణిపాకం ఆలయానికి దేవదాయ శాఖ మంత్రి సందర్శింినప్పుడు విషయం మంత్రి దృష్టికి తీసుకురాగా.. దీని పై స్పందించిన మంత్రి ఈ సంఘటన నిజేమైతే శాఖ పరమైన చరియలు తప్పవని అన్నారు. ఎంక్వయిరీ కమిటీ వేసి తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు అన్నారు మంత్రి. ఏది ఏమైనా స్వామివారికి బక్తులు సమర్పించిన కానుకలు అర్చకుల ఇంతకీ చేరుతూ ఉంటే ఆలయ అధికార్లు చోద్యం చూస్తున్నారు,కాణిపాకం వంటి పెద్ద దేవస్థానంలో ఇలాంటి సంఘటనలు చోటచేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

LEAVE A RESPONSE