Home » చీర కట్టుకుని బస్సెక్కు కేటీఆర్‌

చీర కట్టుకుని బస్సెక్కు కేటీఆర్‌

-టిక్కెట్‌ అడగకుంటే కాంగ్రెస్‌ అమలు చేసినట్లే
-అలంపూర్‌ జనజాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలంపూర్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఈ గడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. తల తెగిపడ్డా సరే ఈ నడిగడ్డ బిడ్డలు ఇచ్చిన మాట తప్పరు. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

ఈ గడ్డపై కాంగ్రెస్‌ మూడు రంగుల జెండా ఎగరే యడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని కేటీఆర్‌ అంటుండు…కేటీఆర్‌ నువ్వు చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. నిన్ను టిక్కెట్‌ అడిగితే కాంగ్రెస్‌ ఏమీ చేయనట్టు..అడగకపోతే కాంగ్రెస్‌ చేసినట్టు అని కౌంటర్‌ ఇచ్చారు. ఈ నెల 9లోగా రైతు భరోసా పూర్తిస్థాయిలో చెల్లిస్తాం. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం. సెమీఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడిరచాం. ఫైనల్స్‌లో మోదీని ఓడిరచాలి. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది..మోదీ తెచ్చింది ఏమీ లేదు..గాడిద గుడ్డు తప్ప. మల్లు రవిని లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా
నిర్మల్‌: బలహీనవర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్‌ గాంధీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ ఒక్కసారి కూడా మహిళకు దక్కలేదు. తొలిసారిగా ఆత్రం సుగుణకు దక్కింది. ఆదిలాబాద్‌ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమ తెరిపించే బాధ్యత తీసుకుంటాం. ఈనెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులు ఖాతాల్లో జమచేస్తాం. పంద్రాగస్టు లోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశాం. తెలంగాణకు భాజపా గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు.

Leave a Reply