Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబులా కాళ్లూ చేతులూ అడ్డుపెట్టి తుపానును మళ్లించలేం

– రేయంబవళ్లు డ్యాష్‌ బోర్డు ముందే కూర్చుని షో చేయలేం.
– పలుగు,పార బట్టి మీడియా ముందు విన్యాసాలు చేయలేం.
– తుపానునంతా తానే జయించాననే కబుర్లు జగన్‌ గారికి చేతకాదు.
– మాకు తెలిసిందల్లా..వాస్తవాల్లో బతకడం..ప్రజలకు మేలు చేయడమే
– విద్యుత్‌ అంతరాయం వస్తే 24 గంటల్లోనే పునరుద్ధరణ చేశాం.
– బాధితులను ఇంటికి పంపించే ముందే వారికి పరిహారం అందించాం
– సంక్షోభాలను రాజకీయ అవకాశంగా మార్చుకోవడంలో చంద్రబాబు దిట్ట.
– ఇలాంటి విపత్తుల కోసమే పచ్చ బ్యాచ్‌ ఎదురుచూస్తుంటుంది
రాష్ట్ర అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి

బాబులా తుపానును మళ్లించడం మా వల్ల కాదు:
చంద్రబాబు తుపాను, కరవు అంశాలపై ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు.చంద్రబాబులా మేమైతే కరవును జయించాం..కాళ్లు చేతులు అడ్డుపెట్టి తుపానును అడ్డుకున్నాం అని చెప్పడం మాకు చేతనైన పనికాదు.హుద్‌ హుద్‌ తుపానులో చంద్రబాబు తెల్లవారుజాములూ డ్యాష్‌బోర్డు వద్దే కూర్చుని తుపానును మళ్లించి నష్టం లేకుండా చేశారని పచ్చ పత్రికల్లో వార్తలు రాశారు. ప్రధాని వచ్చి రూ.వెయ్యి కోట్లు ప్రకటిస్తే…ఈయన మాత్రం రూ.3వేల కోట్ల నష్టం అని నివేదికలు ఇచ్చారు.

తుపానులను డైవర్ట్‌ చేయడం మానవమాతృలకు సాధ్యమేనా..? ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందులో ముందుగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. చంద్రబాబుకు మాదిరిగా ఫోటోలకు ఫోజులిచ్చి తుపానునంతా తానే జయించాననే కబుర్లు జగన్‌ గారికి చేతకాదు.యంత్రాంగాన్ని మొత్తాన్ని కదిలించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేయించాలి.విద్యుత్‌ అంతరాయం వస్తే 24 గంటల్లోనే పునరుద్ధరణ చేశాం.బాధితులను ఇంటికి పంపించే ముందే వారికి పరిహారం ఇచ్చి పంపాము.

చంద్రబాబులా నెలలు తరబడి పెండింగ్‌ పెట్టలేదు.ఆయనలా పలుగు పార బట్టి మీడియా ముందులా చంద్రబాబులా విన్యాసాలు చేయడం మాకు చేతకాదు.తాను ఏం చెప్పినా సరే రాసే మీడియా ఉంది కదా అని చంద్రబాబు ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు.సంక్షోభాలను అవకాశంగా మార్చుకుంటానని చంద్రబాబే చెప్తుంటాడు. ఇలాంటి విపత్తు ఎప్పుడొస్తుందా అని ఆ పచ్చ బ్యాచ్‌ ఎదురు చూస్తూ ఉంటుంది. అది కరవైనా, తుపాను అయినా, గోదావరి పుష్కరాల్లో జనం చనిపోయినా ఆయన దాన్ని కూడా అవకాశంగా మార్చుకుంటారు.

చంద్రబాబులా కేంద్రానికి తప్పుడు లెక్కలు చూపించడం లేదు
చంద్రబాబులా ఊహల్లో కాకుండా వాస్తవంలో జీవిస్తారు మా ముఖ్యమంత్రి. మిగ్‌జాం తుపానులో ముందుగా అధికారులను అప్రమత్తం చేసి ముఖ్యమంత్రిగా జగన్‌ గారు సహాయక చర్యలను మానిటర్‌ చేశారు. తుపాను తగ్గిన తర్వాత ఫీల్డ్‌ విజిట్ చేసి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు భరోసా ఇచ్చారు. నష్టం ఎంత జరిగిందో చూసి డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపుతాం.అప్పుడు కేంద్ర బృందాలు వస్తాయి..వాస్తవ నష్టాన్ని పరిశీలించి అంచనా వేస్తాయి.

ఇవన్నీ క్రమబద్ధంగా జరిగాయి. ఈ రోజు కూడా కేంద్ర బృందం పర్యటించింది. ముఖ్యమంత్రి గారిని కూడా కలవనున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేశాం. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా మేం కొనుగోలు చేస్తున్నాం.రాష్ట్రంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విధి విధానాల ప్రకారం 103 మండలాలను కరవు మండలాలుగా గుర్తించాం.దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపాము. కేంద్రబృందం వచ్చి రాయలసీమలో పర్యటించి వెళ్లింది కూడా. మిగ్‌జాం తుపానుకు సంబంధించి ప్రాథమికంగా రూ.3,711 కోట్లు నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి నివేదించాం.

చంద్రబాబులా తప్పుడు లెక్కలు చూపడం, కేంద్రానికి రకరకాల మాయ చేసే పనులు మేం చేయం. హుద్‌ హుద్‌ తుపాను సమయంలో చంద్రబాబు కేంద్రానికి ఇచ్చిన నివేదికలో మహారాష్ట్రలో చనిపోయిన మృతదేహాన్ని చూపెట్టి రూ.3వేల కోట్ల నష్టం అని కేంద్రానికి నివేదిక ఇచ్చాడు.దాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టుకుని రూ.600 కోట్లు ఇచ్చి సరిపెట్టారు. అలాంటి మోసాలు ఈ ప్రభుత్వానికి, జగన్‌ కి చేతకాదు. రైతులకు జరిగిన నష్టానికి ప్రతిఫలం అందితేనే న్యాయం జరుగుతుంది. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షమైతే లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. రాజకీయాలు వేరు..తుపానులు వేరు…కానీ చంద్రబాబు చేసేదంతా రాజకీయాలే. పంట నష్టం అంచనాలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయి. 19వ తేదీకి జాబితా కూడా ఆర్బీకేల్లో పెడతాం. సోషల్‌ ఆడిట్‌ అయిన తర్వాత నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE