Suryaa.co.in

Andhra Pradesh

నాదెండ్ల మనోహర్ వి బ్రోకర్ మాటలు..!

– అజ్ఞాతవాసి పవన్‌.. అజ్ఞానవాసి నాదెండ్ల మనోహర్‌
– టీడీపీ, జనసేన కలయికలో మనోహర్ ఒక పొలిటికల్‌ బ్రోకర్‌
– తెలంగాణలో డిపాజిట్లు కోల్పోయి బుర్ర చెడి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాడు
– పరిశ్రమలకు భూములు కేటాయిస్తే ప్రభుత్వంపై నిందలు తగదు
– ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిప్రదాత జగన్‌
– రూ.750 కోట్ల విలువైన అభివృద్ధిపనుల ప్రారంభోత్సవానికి రేపు సీఎం రాక
– ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చీసెంటర్, పలాసలో ఇండస్ట్రీయల్‌ పార్కుకు శంకుస్థాపన
– మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడి

సీఎం చేతులమీదుగా రూ.750 కోట్ల పనుల ప్రారంభోత్సవంః
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఉద్దానం ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి.. కిడ్నీ వ్యాధుల బారిన పడిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఒక కిడ్నీ రీసెర్చీ సెంటర్‌ను నెలకొల్పడంతో పాటు అక్కడ్నే ఏర్పాటు చేసిన మంచినీటి ప్రాజెక్టును ప్రారంభించేందుకు జగన్‌ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా పలాసలో కొత్తగా ఏర్పడనున్న ఇండస్ట్రీయల్‌ పార్కుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిప్రదాత జగన్‌
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే చెప్పినట్లు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి పనిచేస్తోంది. రేపు ప్రారంభం కానున్న పనులన్నీ మా ప్రభుత్వహయాంలోనే మొదలయ్యాయి. వాటిని పూర్తి చేసి మేమే ప్రారంభోత్సవం చేస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాను. వీటన్నింటితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మూలపేటలో పోర్టు, భోగాపురంలో ఏయిర్‌పోర్టు నిర్మాణం, అనేక పరిశ్రమలతో పాటు ఇన్‌ఆర్బిట్‌ మాల్‌ పనులు కూడా శరవేగంగానే సాగుతోన్నాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తోన్న వాస్తవాలేనని గుర్తుచేస్తున్నాను.

పొలిటికల్‌ బ్రోకర్‌గా నాదెండ్ల మనోహర్
ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోన్నప్పటికీ, ఒకవైపు ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలు.. మరోపక్కన ఎల్లోమీడియా కలిసి ఏ విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయో.. ఏరకమైన రోత రాతలు రాస్తున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడి ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. అందులో ఆయన అనేక అబద్ధాల్ని అల్లి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యాడు. ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్‌గా పనిచేసినవాడు కాబట్టి, కాస్తాకూస్తో వాస్తవాలు పలకాలి గానీ.. మరీ, దిగజారుడు రాజకీయాలు మాట్లాడుతాడని మేమెప్పుడూ అనుకోలేదు. ఈరోజు మాటల్ని బట్టి ఆయన్ను పొలిటికల్‌ బ్రోకర్‌ అనడంలో తప్పేమీలేదు.

జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి జతచేయడం కోసమో.. లేదంటే, జనసేనను హోల్‌సేల్‌గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయడానికి పనిచేస్తున్న వ్యక్తిగా అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు మధ్యవర్తిగా ఉంటూ రెండుపార్టీల కలయికకు పనిచేస్తున్న వ్యక్తి కాబట్టే అతన్ని ఎవరైనా పొలిటికల్‌ బ్రోకర్‌ అంటారు. ఎందుకంటే, ఆ రెండు పార్టీలు కలిస్తే వాళ్ల మొఖాల్లో ఆనందం కంటే ఇతనిలో కలిగే ఆనందమే ఎక్కువని చెప్పాలి. అలాంటి బ్రోకరేజి పనులు మానేసి ప్రభుత్వం మీద, జగన్‌ గారిపై బురదజల్లే ప్రయత్నం చేసి ప్రజల్లో పలుచనయ్యాడు. లేనిపోని కబుర్లతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడటమనేది నాదెండ్లకు సమంజసం కాదని మేము ఖండిస్తున్నాం.

‘అపారెల్‌’ భూములపై ‘అజ్ఞానవాసి’ అబద్ధాలు
జనసేన పార్టీ అధినేత అజ్ఞాతవాసి కాగా.. నాదెండ్ల మనోహర్‌ మాత్రం అజ్ఞానవాసిగా పేరుతెచ్చుకున్నాడు. 2005–06 లో మహానేత దివంగత వైఎస్‌ఆర్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన హిందూపూర్‌లో అపారెల్‌ పార్కు కోసం 350 ఎకరాల్ని కేటాయించారు. అప్పటి ఏపీఐఐసీ సంస్థ కూడా వారికి సంబంధించి సెజ్‌కు అనేక సదుపాయాల్ని కల్పిస్తూ ఆమోదం తెలిపింది. అప్పట్నుంచీ కొనసాగుతోన్న అపారెల్‌ పార్కు ప్రాసెస్‌ కాస్త 2009 వచ్చేసరికి మహానేత హఠాన్మరణంతో నిలిచిపోయింది.

అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 2011లో నియోజస్‌ సంస్థకిచ్చిన 350 ఎకరాల భూమిని రద్దు చేసింది. అపారెల్‌ పార్కు పనులు మొదలు పెట్టనందున ఆ భూమి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో నియోజస్‌ సంస్థ అదే ఏడాది కోర్టును ఆశ్రయించింది. వాస్తవం ఇలా ఉంటే, నాదెండ్ల మనోహర్ మాత్రం 2019లో జగన్‌గారు అధికారంలోకి వచ్చాక నియోజస్‌ సంస్థకిచ్చిన భూమిని రద్దు చేస్తే.. వారు కోర్టుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అంటే, ఆయన ఎలాంటి అబద్ధాలు చెప్పినా ప్రజలు అమాయకంగా నమ్ముతారనే పిచ్చిభ్రమల్లో ఉన్నాడేమో..

కోర్టు వివాదం పరిష్కరించి భూములు కేటాయిస్తే తప్పా?
ఇదిలాఉంటే, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమలో అత్యంత వెనుకబడి ప్రాంతమైన హిందూపూర్‌లో అపారెల్‌ పార్కు రావాలని.. 2011 నుంచి కోర్టులో ఈ వివాదం పెండింగ్‌లో ఉండటంలో ప్రయోజనమేమీ లేదని మరలా నియోజస్‌ సంస్థను పిలిపించి మాట్లాడారు. ఆ సంస్థ కోర్టులో పిటీషన్‌ను విత్‌డ్రా చేసుకుని వస్తే మరలా వారికి 350 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమని వివరించారు. అక్కడ అపారెల్‌ పార్కు వస్తే తద్వారా దాదాపు 15వేల మంది ఆ ప్రాంతవాసులకు ఉద్యోగవకాశాలొస్తాయని జగన్‌ గారు భావించారు. అపారెల్‌ పార్కు భూముల దగ్గర్నుంచీ అటు బెంగుళూరు కేవలం రెండున్నర గంటల దూరంలోనే ఉంది కనుక.. అక్కడ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ యూనిట్స్, జనరల్‌ ఇంజినీరింగ్‌ యూనిట్స్‌ కూడా వస్తే ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతోందనేది ప్రభుత్వ సంకల్పం.

వీటన్నింటిపై నియోజస్‌ సంస్థ కూడా ముందుకురావడంతో కిందటి కేబినెట్‌లో వారికి పర్మిషన్‌ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం దగ్గర్నుంచీ ఇప్పటిదాకా ఏపీఐఐసీకి సంబంధించి దాదాపు 10వేల ఎకరాలకు పైగా భూముల కేసులు కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. అంటే, ఈ 10వేల ఎకరాలు కోర్టు కేసుల్లో మగ్గిపోయి ఎవరికీ ఉపయోగం లేకుండా ఉంటే రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా..? అలాగే, నెల్లూరులో మరో సంస్థ పవర్‌ప్లాంట్‌ పెట్టుకుంటామని 2వేల ఎకరాలు 2007–08లో తీసుకుంటే, ఇప్పుడు థర్మల్‌పవర్‌ ప్లాంట్‌కు మాకు వయబుల్టీ లేదు..

మేము అక్కడ ఇండస్ట్రీయల్‌ పార్కును డెవలప్‌ చేస్తామని సదరు సంస్థ ముందుకొస్తే ప్రభుత్వం ముందుకొచ్చి అంగీకరించింది. ఈ విధంగా ఒక్కొక్క కేసులోని అవాంతరాలన్నీ పరిష్కరించుకుంటూ పారిశ్రామికవేత్తల అవసరాల్ని గుర్తించడం, తద్వారా ప్రజలకు కలిగే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటుంటే.. వాటిని కూడా నాదెండ్ల మనోహర్‌లాంటి వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నీచమైన బురదజల్లే ప్రయత్నాలు మంచిది కాదని చెబుతున్నాను.

ఏపీలో ముందెన్నడూ లేని పారిశ్రామిక ప్రగతి
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్స్‌ కలిగిన రాష్ట్రం దేశంలో మనదొక్కటే. దేశంలోనే 600 స్వేర్‌ కిలోమీటర్ల పీసీపీఐ రీజన్‌ కలిగిన రాష్ట్రం కూడా మనదే.గడచిన మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నెంబర్‌ ఒన్‌ స్థానంలో నిలిచాం. జీఎస్‌డీపీ గ్రోత్‌రేట్, పర్‌ క్యాపిటా ఇన్‌కంకు సంబంధించి 2019లో ఉన్న ర్యాంకింగ్స్‌ కన్నా మెరుగైన ర్యాంకింగ్‌నకు ఏపీ చేరుకుందని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఐటీ ఎక్స్‌పోర్టుల్లోనూ మన రాష్ట్రమే ముందంజలో ఉంది.

2019లో రూ.800 కోట్ల ఐటీ ఎక్స్‌పోర్టులు ఉంటే… 2023కి వచ్చేసరికి ఇప్పుడు దాదాపు రూ.1800 నుంచి రూ.1900 కోట్లుకు చేరాయి. పక్క రాష్ట్రాలతో పోటీపడుతూనే మన రాష్ట్రంలో ఉన్న ఇన్‌ఫ్రాస్టక్చర్‌ను వినియోగం చేసుకుంటూ పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. పోర్టులు, ఫిష్షింగ్‌ హార్బర్లు నిర్మాణం చేస్తున్నాం. నూతనంగా భోగాపురంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నాం. మరో నెల రోజుల్లో రామాయపట్నం పోర్టు మొదటి దశ పూర్తికి సిద్ధమవుతున్నాం. మరోవైపు మూలపేట పోర్టు, బందరు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులొస్తున్నాయి.

ప్రభుత్వాన్ని నిందిస్తే తగిన శాస్తి తప్పదు
తెలంగాణ ఎన్నికల ఫలితాలొచ్చాక జనసేన నాయకులందరికీ బుర్ర పాడైందనుకుంటా.. నిన్న విశాఖలోని టైకూన్‌ హోటల్‌ జంక్షన్‌ దగ్గర కూడా నాదెండ్ల అనవసర రాద్ధాంతం చేశాడు. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని జంక్షన్‌లో ఫ్రీ మూవ్‌మెంట్‌ కోసం కొన్ని విధానాలు తీసుకుంటే తప్పేంటి..? అభివృద్ధి చెందిన ప్రసిద్ధ నగరాల్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ రద్దీని కంట్రోల్‌ చేయడానికి ట్రాఫిక్‌ పోలీసు వ్యవస్థ తమదైన రీతిలో నిబంధనల్ని అమలు చేస్తారు. దీన్ని కూడా ఎవరినో ఉద్దేశించి నిర్ణయాలు తీసుకుంటున్నారం టూ తప్పుదోవ పట్టించి ఏం సాధిస్తావ్‌ ..? అని అడుగుతున్నాను.

జనసేన పార్టీకి ప్రజల్లో స్పందన రాకపోతే.. కారణాలేంటని ఆత్మపరిశీలన చేసుకోవాలే గానీ.. ప్రభుత్వం మీద ప్రతీ చిన్నదానికీ దుమ్మెత్తిపోస్తే ఆ పార్టీ సాధించేదేమీ ఉండదని గుర్తుచేస్తున్నాను. జనసేన, తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఏపీలో ప్రజలెవరూ నమ్మడం లేదనేది వాస్తవం. అందుకే, మీరు ఉనికి పోరాటం చేస్తూ ప్రభుత్వంపై నిందలేసే పనిలో పడ్డారని అందరికీ అర్ధమైంది. ఏదిఏమైనా ఉన్నవి లేనివి కల్పించి ప్రజల్ని తప్పుదోవబట్టించే ప్రయత్నాల్లో మీకు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నాను.

LEAVE A RESPONSE