భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం?

-ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం?
– ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనను ఆదరించారు
– వైఎస్సార్ బిడ్డకు అన్యాయం చేస్తుంటే చలించిపోయా
– ఏడాదిన్నర ఉండగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా
– చంచల్ గూడ జైల్లో బంధించిన జగన్మోహనరెడ్డిని కలిశా
– కుటుంబ సభ్యుడిలా జగన్ నన్ను అక్కున చేర్చుకున్నారు
– నన్ను ఎవరెన్ని తిట్టారు, ఏమి రాశారనేది అనవసరం
– జగన్ క్యారెక్టర్ ను దెబ్బతీస్తే వదిలే ప్రసక్తి ఉండదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 24: ముఖ్యమంత్రి హెూదాలో 2005 లో రాజీవ్ నగర బాటకు వచ్చిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనను పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న తనను ఎంతగానో ఆదరించారని, అలాంటి వైఎస్సార్ ను ఎలా మర్చిపోతానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. ప్రముఖ మీడియా ఛానల్స్ లో మంత్రి కొడాలి నాని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. 2004 లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండగా వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పారు. 2005 లో రాజీవ్ నగర బాటలో భాగంగా గుడివాడ వచ్చారని, కృష్ణాజిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా దేవినేని ఉమా వైఎస్సార్ కార్యక్రమానికి వెళ్ళవద్దని చెప్పాడన్నారు. పెండింగ్ సమస్యలను ప్రస్తావించేందుకు వెళ్తానని చెప్పడంతో చంద్రబాబుతో ఫోన్ చేయించాడన్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు చెప్పినా రాజీవ్ నగర బాటకు వెళ్ళానన్నారు. ఇళ్ళపట్టాలు, మంచినీటి సమస్య, కాలనీల్లో రోడ్ల నిర్మాణం వంటి వాటిని మంజూరు చేయాలని గుడివాడ జడ్పీ అతిథి గృహంలో వినతి పత్రాన్ని అందించానన్నారు. వెళ్ళిపోతున్న తనను పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టారన్నారు. 2007 లో పేదప్రజలకు 10 వేల ఇళ్ళపట్టాలు ఇవ్వాలని కోరుతూ గుడివాడ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేశానన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అపాయింట్మెంట్ అడిగిన వెంటనే ఇచ్చిన దేవుడు వైఎస్సార్ అని అన్నారు. 2008 లో 77 ఎకరాల భూమిని సేకరించి పేదలకు ఇళ్ళపట్టాలుగా కేటాయించారన్నారు.

అటువంటి రాజశేఖరరెడ్డిని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే వస్తే, చంద్రబాబు పుట్టినరోజు నాడు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. అటువంటి వైఎస్సార్ మరణం తర్వాత ఎటువంటి సంబంధం లేని జగన్మోహనరెడ్డిని జైల్లో బంధించారన్నారు. ఆ సమయంలో చంద్రబాబును దగ్గరగా చూశానని, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించారన్నారు. నన్ను అంతగా ఆదరించిన వైస్సార్ బిడ్డను అన్యాయం చేస్తున్నారని చలించి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి జగన్మోహనరెడ్డికి మద్దతు ఇచ్చానన్నారు.

ఆనాటి నుండి నేటి వరకు తనను కుటుంబ సభ్యుడిలా జగన్మోహనరెడ్డి అక్కున చేర్చుకున్నారు. నన్ను ఎవరేమి తిట్టారన్నది అనవసరమని, నాపై ఏమి రాశారన్నది కూడా అవసరం లేదన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిపై ఈగ వాలితే రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, చంద్రబాబు వంటి 420 గాళ్ళలో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదన్నారు. జగన్మోహనరెడ్డి వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి చూశానని చెప్పారు. నాకు ఏ పదవులూ అవసరం లేదని, మంత్రి పదవి కూడా ఈక ముక్కతో సమానమని, జగన్మోహనరెడ్డి తనకు ముఖ్యమని అన్నారు.

420 గాళ్ళ ఆటలు ఈ రాష్ట్రంలో సాగకూడదని, జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని చచ్చే వరకు వీళ్ళందరితో యుద్ధం చేస్తూనే ఉంటానన్నారు. నన్నెవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే వీళ్ళలా తిట్టించనని, తానే నేరుగా మాట్లాడతానని చెప్పారు. కులం కోసం 420 గాళ్ళతో ఉండాలా, రాష్ట్రానికి మేలు చేసిన, చేస్తున్న వైఎస్సార్, జగన్మోహనరెడ్డి కుటుంబంతో ఉండాలా అనే దానిలో నాకున్న ఏకైక ఆప్షన్ జగన్ తో కలిసి పనిచేయడమేనని అన్నారు. జగన్మోహనరెడ్డి ఫ్లోర్ లీడర్ గా ఉండగా ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నానన్నారు.

తన రాజకీయ జీవితం నాశనం అయిపోయినా జగన్మోహనరెడ్డితో ఉండాలని నిర్ణయించుకుని చంచల్ గూడ జైలుకు వెళ్ళి ఆయనను కలిశానన్నారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, తనకు మంత్రి పదవి ఇస్తారని కలలో కూడా అనుకోలేదన్నారు. ఏది ఏమైనా జగన్మోహనరెడ్డి కుటుంబానికి అండగా ఉండాలని ఆయన దగ్గరకు వెళ్ళానన్నారు. నేను చచ్చే వరకు పార్టీ మారేది లేదని, రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను, తన పిల్లలు కూడా జగన్మోహనరెడ్డి విధేయులుగానే ఉంటామన్నారు.

అన్నం పెట్టిన చేతులను నరికినట్టుగా ఎన్టీఆర్ మరణానికి కారణమైన వ్యక్తులు చేసే లుచ్ఛా పనులు మాత్రం చేయనన్నారు. వైఎస్సార్ కు పదింతలు జగన్మోహనరెడ్డి అని, గత పదేళ్ళలో జగన్ నోటి వెంట ఒక్క బూతు మాట కూడా వినలేదన్నారు. వాడు, వీడు అనే పదాలను కూడా వాడరని, నేను మాట్లాడేవి విమర్శలని మంత్రి కొడాలి నాని మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply