Suryaa.co.in

Andhra Pradesh

సీఎంఏలో ఎంజేపీ విద్యార్థుల ప్రతిభ

* 104 మందికి 97 మంది ఉత్తీర్ణత
* మంత్రి సవిత హర్షం

అమరావతి : సీఎంఏ (సర్టిఫైడ్ మేనేజ్ మెంట్ అకౌంటెన్సీ) ఫౌండేషన్ పరీక్షల్లో ఎంజేపీ గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ పరీక్షకు 104 మంది విద్యార్థులు హాజరవ్వగా, 97 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 18 ఎంజేపీ గురుకుల కళాశాలలకు చెందిన 104 మంది విద్యార్థులు సీఎంఏ ఫౌండేషన్ పరీక్షకు సిద్ధమయ్యారు. వారికి నెల్లూరుకు చెందిన రావూస్ విద్యా సంస్థ ఉచితంగా ఆన్ లైన్ ద్వారా శిక్షణ అందజేసింది.

విద్యార్థులకు పలు అంశాల్లో ఎంజేపీ కళాశాలల సిబ్బంది సలహాలు సూచనలు కూడా అందజేశారు. ఇటీవల విడుదలైన సీఎంఏ ఫౌండేషన్ పరీక్షా ఫలితాల్లో 104 విద్యార్థులకు గాను 97 మంది ఉత్తీర్ణత సాధించారు. వారంతా సీఎంఏ ఇంటర్మీడియట్ అర్హత సాధించారు. ఈ పరీక్షల్లో గట్టెక్కితే సీఎంఏ ఫైనల్ చేరుకోనున్నారు. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షా ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ప్రైవేటు కంపెనీల్లో రూ.30 నుంచి రూ.40 వేల ప్యాకేజీ లభించే అవకాశముంది.

మంత్రి సవిత హర్షం

సీఎంఏ ఫౌండేషన్ పరీక్షల్లో 97 మంది ఎంజేపీ గురుకుల కళాశాల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా ఉచిత శిక్షణ అందజేసిన రావూస్ కు, కళాశాల సిబ్బందికి, విద్యార్థులకు ఆమె అభినందనలు తెలియజేశారు.

బీసీ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, అత్యుత్తమ స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో అత్యుత్తమ విద్య అందిస్తున్నారనడానికి ఎంజేపీ గురుకుల కళాశాల విద్యార్థుల ప్రతిభే ఇందుకు నిదర్శనమని మంత్రి సవిత పేర్కొన్నారు.

LEAVE A RESPONSE