Suryaa.co.in

Andhra Pradesh

స్థానికేతర లాబీయిస్టుల్ని ఓడించాలి

– ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్నారా?
– ‘సామాజిక న్యాయం’ పేటెంట్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే
– పార్లమెంట్‌ స్థానాల్లో జగన్ 70 శాతం బలహీనవర్గాలకే సీట్లిచ్చారు..
– బీసీల కోసమే పుట్టినట్టు చెప్పుకునే టీడీపీలో బీసీలకు సీట్లేవి..?
– చంద్రబాబు మార్క్‌తో ఓటడిగే దమ్మూధైర్యం ఉందా..?
– పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెట్టి టిడిపి పైశాచిక ఆనందం..
– డీఎస్సీని అడ్డుకుని చంద్రబాబు ఏం లాభపడతాడు..?
– పేదల ప్రయోజనాలపై పనిగట్టుకుని పిటీషన్లు వేయడం దుర్మార్గం
– ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల్ని మేం గౌరవిస్తాం
మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: మా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని మొదట్నుంచీ చెప్పుకుంటూ వస్తున్నట్లుగానే ఆయా వర్గాలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించారు. అదే తెలుగుదేశం పార్టీ పరిస్థితిని చూస్తే.. తమ పార్టీ బీసీల కోసమే పుట్టిందని గొప్పలు చెప్పుకుంటూ మాటల్లోనే తప్ప చేతల్లో ఏమీలేదని నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కేటాయించిన అభ్యర్థుల వివరాలను బేరీజు వేసుకుంటే ఈ విషయం తేటతెల్లమైంది.

25 పార్లమెంట్‌ స్థానాల్లో సుమారు 68 నుంచి 70 శాతం అణగారిన, బలహీనవర్గాలకే కేటాయించాం. అదే తెలుగుదేశం పార్టీ తీసుకుంటే, కనీసం 50 శాతం స్థానాలనూ ఇవ్వలేదు. ఓసీలకే 70 శాతం స్థానాలను కట్టబెట్టారు. ముఖ్యంగా బలహీనవర్గాలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐదింటిలో ఒక ఎస్సీ స్థానం పోగా.. మిగిలిన నాలుగు స్థానాలనూ బలహీన వర్గాల అభ్యర్థులకే కేటాయించారు. తెలుగుదేశం పార్టీనైతే కేవలం రెండు స్థానాలనే బలహీనవర్గ అభ్యర్థులకివ్వడం.. మిగిలిన స్థానాల్ని ఓసీలకివ్వడం.. అసలు ఈ ప్రాంతంతో సంబంధం లేని వారికి ఇవ్వడం జరిగింది.

పొత్తులలో చంద్రబాబు భావజాలమే ఆయన పార్టీతో జతకట్టిన మిగతా రెండుపార్టీల తాలూకూ పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థుల పరిస్థితి కనిపిస్తోంది. పవన్‌కళ్యాణ్‌ పార్టీ జనసేన తరఫున 2 సీట్లిస్తే.. ఆ రెండింటిలో ఒకటి కూడా బీసీల్లేరు. బీజేపీ 6 స్థానాల్లో పోటీచేస్తుంటే, ఒకటి ఆబ్లిగేషన్‌ కింద ఒక ఎస్సీకి కేటాయిస్తే మిగతా స్థానాల్లో ఎవరు నిలబడ్డారో చూస్తే తెలుస్తోంది.

ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను స్థానికతతో సంబంధం లేకుండా .. వారి పార్టీలకు లాబీయిస్టులుగా పనిచేసేవారిని తెచ్చి ఈ ప్రాంతంలో సీట్లిచ్చారు. అంటే, కూటమి పార్టీల ధైర్యం ఏంటి? ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానంతో మీరు ఆటలాడుతున్నారా..? ఈ కూటమి పార్టీల నిలబెట్టిన అభ్యర్థులెవరు..? వారు ఏ ప్రాంతానికి చెందిన వారు..? ఈ వ్యవహారం ఎక్కడికెళ్తుంది..? రాజకీయాల్లో ఇలాంటివి చాలా ప్రమాదకర పరిస్థితులని ప్రజలంతా అర్ధం చేసుకోవాలి.

ఎక్కడినుంచో లాబీయిస్టులను తెచ్చి నిలబెట్టారేంటని ప్రశ్నిస్తే కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారు..? వారి తాలూకూ ప్రజాస్వామ్యం అంతేనని వారు చెబితే.. ఉత్తరాంధ్ర ప్రాంత సీనియర్‌ నాయకునిగా మా ప్రాంతం తాలూకూ నిరసనను మేం తెలియజేస్తున్నాను. ఇలాంటి స్థానికేతర లాబీయిస్టులను ఎన్నికల క్షేత్రంలో ఓడించి ఇంటికి పంపడమే ఉత్తరాంధ్ర ప్రజల లక్ష్యంగా పెట్టుకోవాలి.

వాలంటీర్లను, వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల్లో ఇన్వాల్వ్‌ చేయొద్దని నిన్న ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులిచ్చింది. ఆ నిర్ణయం మంచిదే. మేమూ ఒప్పుకుంటాం. మరి, నెలనెలా వాలంటీర్ల ద్వారా వృద్ధులు, వితంతువులు , విభిన్న ప్రతిభావంతులకు అందే ప్రభుత్వ పింఛన్‌లను కూడా అందించ రాదంటూ చంద్రబాబు పిటీషన్‌ పెట్టించారంటే..ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా..? పాపం లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెల పింఛన్‌ ఎవరిస్తారు..? వాళ్లు ప్రభుత్వ కార్యాలయాలకెళ్లి తెచ్చుకోవాల్నా..?

లేదంటే, ప్రభుత్వం నేరుగా వారికీ డీబీటీ వేయొచ్చనుకుంటే.. పింఛన్‌దారుల అకౌంట్‌ నెంబర్లు వివరాలు అవసరం కదా..? ఇప్పటికిప్పుడు పింఛన్‌దారుల వివరాలను తీసుకోవడం అయ్యేపనేనా..? అదే వాలంటీర్‌ వ్యవస్థ ఉంటే ఇంటింటికీ తిరిగి తెచ్చేవారు. ఇప్పుడు వాళ్లను వద్దంటున్నారు కదా..? రేపు ఒకటో తేదీనే పింఛన్‌ రూపంలో అందే రూ.3వేల కోసం ఎదురుచూసే పేద లబ్ధిదారులకు ఏం సమాధానం చెబుతారు?

ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత డీఎస్సీ పెట్టుకోవాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది .. బాధ్యతగల ప్రభుత్వం తరఫున మేమూ కమిషన్‌ నిర్ణయాన్ని శిరసావహిస్తాం. త్వరలోనే డీఎస్సీ తేదీలనూ ప్రకటిస్తాం. అంటే, ప్రతిపక్షం తాలూకూ.. కూటమి అనేది ఎలాంటి ఆలోచనలతో పనిచేస్తుందో చెప్పేందుకు ఇవన్నీ ఉదాహరణలు.

మొన్నటిదాకా కేంద్రంతో వైఎస్‌ఆర్‌సీపీ సపోర్టు చేస్తుందని ఇదే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రచారం చేశారు. మా సపోర్టుతోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరుగుతుందంటూ కూడా విషప్రచారం చేశారు. మరి, ఇప్పుడు ప్రత్యక్షంగా కేంద్రంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టిందెవరు..? మీరే కదా..? కేంద్రంతో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేయమని.. ఆ ప్రతిపాదన రద్దు చేస్తామని ఇప్పుడు అనిపించండి. మీరు ఎన్నికల ప్రచారానికి ఈ ప్రాంతం వచ్చేలోగానే కేంద్రంతో ప్రకటిస్తేనే.. కూటమి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చే హక్కు ఉంటుంది.

LEAVE A RESPONSE