– యూపీ-బీహార్ వాటాయే 222 సీట్లు
– దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165
– ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461
– దక్షిణాది ఇక దణ్ణం పెట్టాల్సిందేనా?
– జనాభా కాదు ఆదాయ ప్రాతిపదికన విభజంచాలని డిమాండ్
– ఆ లెక్కన దక్షిణాదికే పెరగాల్సిన సీట్లు
– అయినా నోరు విప్పని కూటమి పార్టీలు
(ఏ.బాబు)
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్ విభజన 2026లో జరగాల్సి ఉంది. ఈ భారీ ప్రక్రియ తర్వాత రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ సీట్లలో పెను మార్పులు రాబోతున్నాయి.
ఇందులో అత్యధికంగా ఉత్తరాది రాష్ట్రాలు లబ్ది పొందడం ఖాయంగా తెలుస్తోంది. జనాభా ఆధారంగా జరిగే పునర్ విభజన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటికే ఆ మేరకు భయాలు మొదలయ్యాయి. అయితే కేంద్రం అంచనాల ప్రకారం వివిధ రాష్ట్రాల్లో పెరిగే సీట్ల సంఖ్య ఇలా ఉంది.
2026 తర్వాత పెరిగే లోక్ సభ సీట్లివే ? రాష్ట్రాల వారీగా ఇలా..!
భారత దేశ పటంలో పైన ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఎంపీల సంఖ్య 9కి పెరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో 4, పంజాబ్ లో 18, ఉత్తరాఖండ్ లో 7, హర్యానాలో 18, ఢిల్లీలో 13, యూపీలో 143, రాజస్తాన్ లో 50, గుజరాత్ లో 43, మధ్యప్రదేశ్ లో 52, జార్ఖండ్ లో 24, బీహార్ లో 79, ఛత్తీస్ ఘడ్ లో 19, పశ్చిమ బెంగాల్ లో 60, సిక్కింలో 1, అరుణాచల్ ప్రదేశ్ లో 2, అస్సోంలో 21, నాగాలాండ్ లో 1, మణిపూర్ లో 2, మిజోరంలో 1, త్రిపురలో 2, మేఘాలయలో 2, ఒడిశాలో 28, మహారాష్ట్రలో 70, ఏపీ, తెలంగాణలో కలిపి 54, కర్నాటకలో 41, తమిళనాడులో 49, పుదుచ్చేరిలో 1, కేరళలో 20, లక్షద్వీప్ 1, గోవా 2, అండమాన్ లో 1, దాద్రానగర్ హవేలీలో 2 కాబోతున్నాయి.
మొత్తం సీట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 848కి పెరగబోతోంది. ఇందులో ఒక్క యూపీ-బీహార్ వాటాయే 222 సీట్లు కానుంది. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు 165, ఇతర రాష్ట్రాల్లో సీట్లు 461 కాబోతున్నాయి. దీంతో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఏంటో ఇట్టే అర్దమవుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ కేంద్రం సన్నాయినొక్కులు నొక్కుతోంది.
అయితే దీనికి విరుగుడుగా జనాభా ఆధారంగా కాకుండా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం ప్రాతిపదికగా ఈ విభజన చేయాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించడం లేదు.
అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న ఆందోళన అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, దక్షిణాదిలోని ఎన్డీఏ కూటమి పార్టీలు మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జనాభా లెక్క కాకుండా, ఏ రాష్ట్రం నుంచి ఆదాయం ఎక్కువగా వస్తే ఆ రాష్ట్రాల్లో సీట్లు పెంచాలన్న డిమాండ్ ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రానికి ఏమాత్రం ఆదాయం ఇవ్వని ఉత్తరప్రదేశ్లో భారీగా సీట్లు పెంచుతున్ను కేంద్రం… అధిక ఆదాయం ఇచ్చే మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల్లో సీట్లు ఎందుకు పెంచరన్న చర్చకు తెరలేచింది. అయితే దీనిపై దక్షిణాది బీజేపీ నేతలు మౌనంగా ఉండటమే ఆశ్చర్యం.