Suryaa.co.in

Andhra Pradesh

జనం సొమ్ము కొల్లగొట్టి.. సలహాదారులను మేపిన జగన్

-సొమ్ములన్నీ సలహాదారులకే సమర్పయామి!
-క్యాబినెట్ ఏర్పడక ముందే సలహాదారుల నియామకం
-సాక్షి ఉద్యోగులు, జగన్ రెడ్డి సామాజిక వర్గం, జగన్ అనుంగ అధికారులకు సలహాదారుల పదవులు
-ఒక సలహాదారుడికి నెలకు 30 లక్షలు ఖర్చు చేసిన వైనం
-నామ్ కే వాస్తిగా మంత్రులు, జగన్.. ఐదేండ్లు వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిన సలహాదారులు
-ప్రతి పక్ష నాయకులపై విమర్శలు చేయడమే సలహాదారుల పని
-60 మంది జంబో సలహదారులతో ప్రభుత్వానికి, ప్రజలకు ప్రయోజనం శూన్యం
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

వైసీసీ సలహాదారుల నోర్లను కట్టడి చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నోటీసులు వచ్చాయి. దాని ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకే వస్తారని, వాళ్లకు కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని.. వాళ్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి వీళ్లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు… టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మాట్లాడుతూ..

అసలు ఎవరు ఈ సలహాదారులు ?
ఏపీలో అసలు సలహాధారులు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఎలా అపాయింట్ అయ్యారు ? గత ఐదు సంవత్సరాల్లో చక్రం తిప్పిన వీరి నోళ్లను, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు కట్టడి చేసింది? వీరు చేసిన హంగామా ఏంటి? అసలు వైసీపీ ప్రభుత్వాన్ని గత ఐదు సంవత్సరాలు వీళ్లే నడిపారా? వీళ్లే శాసించా రా? వీళ్లు ఏమైనా ఐఏఎస్ అధికారులా? పోని ప్రజలు చేత ఎన్నుకో బడ్డ నాయకులా? అసలు ఎవరు ఈ సలహాదారులు ? ప్రభుత్వ సొమ్మును లక్షల్లో దిగమింగుతున్న వీరు, ప్రజలకు ఎవరో కూడా తెలియదని.. వైసీపీ నాయకులుగానే ప్రజలు భావిస్తున్నారని విజయ్ కుమార్ అన్నారు.

జంబో సలహాదారులతో జగన్ రెడ్డి పాలన
రాజ్యాంగాని సంబంధం లేకుండా దొడ్డి దారిలో వచ్చి ఐదు సంవత్సరాలు అసలు వీళ్లు చేసింది ఏంటి ? 2019 మే 31న జగన్ ప్రమాణ స్వీకారం తరువాత కేవలం ఆరు నెల్లల్లో 37 మంది సలహాదారుల నియమించున్నారు. ఆ తరువాత తీసుకున్న సలహదారులు మొత్తం 55 మంది… ప్రస్తుతం ఉన్న సలహదారులు 40. జీవోలకు తాళం వేయడంతో ఎంత మంది ఉన్నారో క్లారిటీ లేదు. మంత్రులతో పాటు అడ్డదారిలో వచ్చిన వారు మంత్రుల కంటే, ఎక్కువ అధికారం చెలాయించారు. 69 మందికి ఏపీలో క్యాబినేట్ స్టేటస్ కల్పించి, హంగులు హంగామాలతో దోచి పెట్టారు. 1980 అంజయ్య హయాంలో 64 మందికి మంత్రి పదవులు ఇచ్చింది నేడు గుర్తుకు వస్తుంది. జగన్ రెడ్డి జంబోవర్గం నాటి అంజయ్య మంత్రి వర్గాన్ని దాటిపోయింది.

క్యాబినెట్ ఫామ్ కాకముందే సలహాదారుల నియామకం
మంత్రులందరూ నామకేవాస్తిగా , బుట్టబొమ్మలా మాదిరిగా ఉన్నారు. ఈ ఐదేండ్లు ప్రభుత్వాన్ని నడిపింది సలహాదారులే. ప్రభుత్వం సలహదారులందరూ ‘వైసీపీ ప్రైవేట్ టీమ్’ సాక్షిలో పనిచేసిన వారే. క్యాబినెట్ కూడా ఫామ్ చేయకుండానే 6 మంది సలహాదారులను నియమించుకున్నారు. 8 జూన్ 2019 న, మే1 న మరో ఇద్దరు సలహదారులను నియమించుకున్నారు. అందులో మొదటి వ్యక్తి సజ్జల. ఆ తరువాత జవీడీ కృష్ణమోహన్ వచ్చారు.

సలహాదారులకు ఉన్న అర్హతలు ఏంటి ?
మొదటి ఆరు నెలల్లో 37 మంది సలహాదారులగా వచ్చిన వీళ్ల అర్హతలు ఏంటి ? వీళ్లు ఎలా వచ్చారు? గవర్నమెంట్ లోకి. మొదటి నెలలో వచ్చిన వారు అందరూ సాక్షిలో పనిచేసిన వారే. వైసీపీ చేత వైసీపీ కొరకు, వైసీపీ కోసం పనిచేసిన వాళ్లే. వీళ్లు కాక మిగిలిన వారు జగన్ బంధవులు, జగన్ కు దగ్గర వారు. రాజశేఖర్ రెడ్డికి కావాల్సిన వారు. టీడీపీ హయాంలో చంద్రబాబుకు యాంటీగా పనిచేసిన ఐఏఎస్ లను, జగన్ సలహాదారులుగా నియమించుకున్నారు. చేసిన అ ప్పులు, చేస్తున్న అప్పుల కోసం రిటైర్డ్ బ్యాంక్ అధికారులను సలహాదారులను పెట్టుకున్నారు. సాక్షిలో పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు . సలహాదారులందరిలో 23 మంది రెడ్లే ఉన్నారు. టీడీపీని తిట్టే వారిని సలహాదారులుగా నియమించుకున్నారు.

అసలు సలహాదారులు ఏం చేస్తారు ?
ప్రభుత్వ సలహాదారులుగా అఫీషియల్ గా ఏమి చేయరు. అన్ అఫీషియల్ గా అన్ని చేస్తున్నారు. ఒక జీవో విడుదల చేసి దాదాపు క్యాబినెట్ హోదాను కల్పించి, ఒక్కొక్క సలహదారుడికి దాదాపుగా 30 లక్షల రూపాయాలు నెలకు ఖర్చుపెట్టారు. వీళ్లకు ఎటువంటి రూల్స్ తెలియదు. తనవాళ్లు అనుకున్నవాళ్లను, జగన్ రెడ్డి సలహదారులుగా నియమించుకున్నారు. ఇంత మంది సలహాదారుల ను పెట్టుకోవచ్చని దేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదు. 60 మంది ని పెట్టుకుని జగన్ రెడ్డి వారికి దోచి పెట్టాడు. ప్రభుత్వ సొమ్ము దిగమింగుతూ.. జగన్ తొత్తులుగా సలహాదారులు మారారు.

ప్రభుత్వంలో ఉండి ప్రజల సొమ్ము దిగమింగుతూ .. జగన్ కు పాద సేవల చేస్తున్న…అనుంగ సలహాదారులుల్లో కొంత మంది గురించి..

1. సకల శాఖ మంత్రిగా సజ్జల
ప్రభుత్వ పాలనలో కాళ్లు, వేళ్లు, నోరు ముక్కు అన్ని పెట్టేస్తున్న వ్యక్తి సజ్జల… ప్రభుత్వంతో ట్రాన్సక్షన్ లు నడిపే కంపెనీలను గమనిస్తూ వాటి నుండి డబ్బు దండుకోవడమే సజ్జల పని. ఈయన పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఉన్నారు. జీఓ నెంబర్ 1341 ప్రకారం.. 18.06.2019న ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడ్డారు. అంతకు ముందు సాక్షి పత్రికలో ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ గా ఉన్నారు. ప్రభుత్వ నిర్వహణలో ఈయన పాత్ర గురించి కొత్తగా చెప్పక్కరలేదు. ప్రభుత్వమంతా తానేనట్టుగా వ్యవహరిస్తాడు. వైసీపీకి సర్వాంతర్యామిగా ప్రవర్తిస్తాడు. ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ వైసీపీపార్టీ తొత్తుగా మారాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి వర్తించే రూల్స్ రెగ్యులేషన్స్ ను ఈ సలహాదారు అస్సలు పట్టించుకోడు. ప్రభుత్వ సలహాదారు గా పొద్దున్న లేచి ప్రతిపక్షాలని తిట్టిపోయడమే సజ్జలకు తెలుసు.

2. అజేయ కల్లం రెడ్డి మాజీ ఐఏఎస్ – ముఖ్యమంత్రి సలహాదారు
31 మే, 2019 ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన 5 వ రోజే జీవో నెంబర్ 1219 ద్వారా, ముఖ్యమంత్రి సలహాదారుగా అజేయ కల్లం నియమించబడ్డారు. ఆయన అంతకు ముందు ఆంద్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రెటరీ లాంటి కీలక స్థానాల్లో ఉండి.. పదవీ కాలం అయిపోగానే….వేరే ప్రభుత్వం లో సలహాదారులుగా చేరిపోవచ్చా? ఆ ప్రశ్నకు ఎందుకు వైకాపా పార్టీ సమాధానం ఇవ్వలేదు. వైసీపీ దురాగాతాల్లో చక్రం తిప్పిన వ్యక్తుల్లో ఈయన కూడా ముఖ్యలే. ఈయన పేరు చెప్పగానే వివేకా అనే పేరు కూడా గుర్తుకు రావడం యాదృచ్చికం మాత్రం కాదు.

3. శామ్యూల్.. రిటైర్డ్ ఐఏఎస్
క్యాబినెట్ ఏర్పడిన 14 రోజులకి ముఖ్యమంత్రిసలహాదారు గా ఈయన నియమించబడ్డారు. సోలార్ పాలసీలు మొదలుకొని చాలా విషయాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెగ తిట్టేవారు.సలహాదారులుగా చేరి ప్రజా ప్రయోజనాలను మరిచి ప్రతిపక్షాలని తిట్టే పని పెట్టుకున్నారు. సోలార్ ఒప్పందాల్లో తెలుగుదేశం అవినీతి చేసేసిందని పత్రికా సమావేశాలు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఒప్పందాలను తిరగ రాసి తెలుగుదేశం ఇచ్చిన దానికంటే ఎక్కువ రాయితీలకు ఇచ్చి.. లక్షా ఇరవై వేల ఎకరాలను ఇండోసోల్, అరబిందో లాంటి కంపెనీలకు ధారాదత్తం చేసిన ప్రక్రియలో కీలక పాత్రధారి ఈయనే.

4. జీవీడి కృష్ణమోహన్ – కమ్యూనికేషన్ సలహాదారు
క్యాబినెట్ ఏర్పడడానికి ఒక రోజు ముందే.. జీవో నెంబర్ ఆర్.టి. 1226 తో 07.06.2019న కమ్యూనికేషన్ సలహాదారుగా నియమింప బడిన ఈయన.. సాక్షి పత్రికలో ఎడిటర్ స్థాయిలో ఉండే వారు. సాక్షి పత్రిక నుంచి వచ్చి ప్రభుత్వంలో కమ్యూనికేషన్ సలహాదారు అయిపోయారు. క్యాబినెట్ ఏర్పడక ముందే సలహాదారుగా చేరిన ఘనత ఇతనిదే.

5. డా.రామచంద్రమూర్తి కొండుభట్ల
ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నర నెలల తర్వాత జీవో నెంబర్ ఆర్.టి. 2285 ను అనుసరించి ఈయన ప్రభుత్వ సలహాదారుడిగా చేశారు. 15.10.2019 న ఈయన సాక్షి పత్రికకు చీఫ్ ఎడిటర్ గా పనిచేశారు. తెలంగాణా వాదిగా వుండి అప్పట్లో ఆంధ్రాను వేరే ఛానళ్లలో పలు రకాల వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన ఈయన, వైసీపీ అధికారం వచ్చాక ఆంధ్రా ప్రభుత్వంలో సలహాదారుగా చేరాడం విడ్డూరంగా ఉంది. ఆంధ్రా బాగు కోసం ఏమి సలహాలు ఇచ్చారో… ఆ దేవుడికే ఎరుక.

6. దేవులపల్లి అమర్
వైకాపా అధికారానికి వచ్చిన సరిగ్గా నాలుగు నెలలకి జీవో నెంబర్ ఆర్.టి. 2165 ను తీసుకు వచ్చి, 04.10.2019 న దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారుడిగా నియమింపబడ్డారు. ఈయన సాక్షి టీవీలో దాదాపు సాక్షి ఛానల్ పెట్టినప్పటి నుండీ హోస్ట్ గా సాయంత్రం సాక్షి టీవీలో చర్చా వేదికలు నిర్వహించే వారు. సలహాదారుడి బాధ్యలు చేపట్టి ప్రభుత్వానికి ఎటువంటి సలహాలు ఇచ్చారో ఆయనకే తెలియాలి.

7. తుమ్మల లోకేశ్వర్ రెడ్డి
వైసీపీ అధికారానికి వచ్చిన మూడు నెలల్లో జీవో నెంబర్ ఆర్.టి. 2036 ను ప్రవేశ పెట్టి 16.09.2019న తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారు గా తీసుకున్నారు. జగన్ కు ఈయన బంధువు. ఈయన అప్పట్లో ఉత్తి పుణ్యానికి ఏవీ లేకుండానే, తెలుగు దేశం మీద డేటాచోరీ జరిగి పోయిందని అభాండాలు వేస్తూ కేసు పెట్టిన వ్యక్తి అందుకే ఈయనకు “టెక్నికల్ ప్రాజెక్టుల సలహాదారుడు” గా పదవి ఇచ్చారు.

8. కృష్ణ జీవీ గిరి – ఆర్ధిక సలహాదారుడు
ఆర్టీ నెంబర్ 78.. 20.09.2019 న ప్రభుత్వం వచ్చిన నెలన్నరలోనే నియమితులైన ఈయన రాజశేఖర్ రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రులైన ఆడిటర్ సోమయాజులు కొడుకు. ఈయన సలహాదారుగా బాధ్యలు చేపట్టి.. పత్రికా సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలు ఆర్ధిక పరంగా లేవనెత్తిన అప్పులు, ఆర్ధిక తప్పులకు ప్రతి విమర్శలు చేస్తూ కౌంటర్ లు ఇస్తుంటారు. అప్పులు ఎలా తేవాలి, కార్పొరేషన్ నుంచి బాండ్లు జారీ లాంటి ఆర్ధిక పరమైన పనుల్లో మునిగి తేలారు. ఇలాంటి విధాన పరమైన పనుల్లో సలహాదారులు కలుగచేసుకో కూడదు. కానీ ఈయన ఏకంగా మనిగిపోయారు.

9. రజనీష్ కుమార్ – ప్రభుత్వ ఆర్ధిక సలహాదారులు
06.09. 2021 న సలహాదారుగా నియమింపబడిన ఈయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పనిచేసి అంతకు ముందే రిటైర్ అయ్యారు. SBI లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రీమియర్ బ్యాంకు చైర్మన్ గా రిటైర్ కాగానే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరి పలు బ్యాంకులనుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోన్లు ఇప్పించడంలో పాత్ర పోషించారు. ఆంధ్రా బ్యాంకులు, బరోడా బ్యాంకుల నుంచి 2021లో లోన్లు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. చివరికి రిజర్వ్ బ్యాంకు కలుగజేసుకొని చెబితే కానీ ఆ బ్యాంకులు ఆపలేదు.

10. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
జీవో నెంబర్ 78 20.09. 2019న సలహాదారుని గా వచ్చిన ఈయన జగన్ కు చాల దగ్గరి బంధువు. ఐటీ అడ్వైజర్ గా నియమింపబడి IT మీద ఏమి సలహాలు ఇచ్చారో, ఎన్ని కంపెనీలు తెచ్చారో తెలియదు. కానీ ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ పార్టీ కోసం ఐప్యాక్ ను కోఆర్డినేషన్ చేస్తూ, వాలంటీర్ల కోసం ఏర్పరచబడిన ఎఫ్ఓఏ ని కూడా తెరవెనుక నుండి పార్టీ కోసం చూస్తుంటారు.

ఇలా చెప్పుకొంటూ పోతే.. ప్రభుత్వ సలహాదారులు అంతా వైసీపీ అస్మదీయుల సమూహమే. ఇటువంటి సలహాదారులను పెట్టుకుని ప్రజా సొమ్ములను లక్షల్లో కుమ్మరించి జగన్ చేసిన మోసం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

LEAVE A RESPONSE