• కూటమి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతోంది
• మంత్రి నిమ్మల రామానాయుడు
పెదవడ్లమూడి: సనాతన ధర్మంలో గోమాతను పూజించడం, రక్షించడం, పెంచుకోవడం ద్వారా సేవ చేయడం పుణ్య కార్యక్రమంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. గోమాతను రక్షించుకునేలా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోందని అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లమూడి గ్రామంలో భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 19వ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి నిమ్మల షిర్డీసాయిబాబా ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్దానం నిర్వాహకుల ఆధ్వర్యంలోని గోమాత ఆర్గానిక్ డెయిరీ ఫామ్ ను సందర్శించిన మంత్రి స్వయంగా గోవులకు గ్రాసం అందించారు. తానూ ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన వాడినేనని, గోమాత విలువ తనకు బాగా తెలుసని గోవుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి, భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. విజన్ 2047 లక్ష్య సాధన దిశగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యి, ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సాయిబాబాను ప్రార్దించానని మంత్రి నిమ్మల తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, 19 ఏళ్ళుగా దేవస్దాన వార్షికోత్సవాలు నిర్వహిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందంటూ నిర్వాహకులను మంత్రి అభినందించారు.