-ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను బాధ్యతల నుంచి తొలగించాలి
– ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగొట్టారు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “నీళ్లు – నిజాలు”పై రౌండ్ టేబుల్ సమావేశం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: నీళ్ల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం. నీటి విషయాల్లో రాజకీయం చేయడం మానేసి నిజాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ బురదరాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ మేరునగధీరుడిలా నిలబడింది. కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం పూర్తి చేయాలి. రాజకీయాలకు అతీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజనీతజ్ఞతను ప్రదర్శించాలి. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. అదే తరహాలో కేసీఆర్ ప్రారంభించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించాలి.
సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్ లా పనిచేస్తున్నారు. కేసీఆర్ శత్రువు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ మన జలాలను తరలిస్తున్న ఆంధ్రా పాలకులు మన శత్రువులని ఆయన గమనించాలి. ఆంధ్ర కేడర్ లో పనిచేసిన ఆదిత్యానాథ్ దాస్ ను బాధ్యతల నుంచి తొలగించాలి. కృష్ణా ట్రైబ్యునల్ లో రాష్ట్రం తరఫున బలంగా వాదనలు వినిపించాలి.
కేసీఆర్ నాయకత్వంలో అవిశ్రాంతంగా పని చేస్తేనే కోటి ఎకరాల మాగాణంగా మారింది. ఎంతో మంది మేధావులు, ఇంజనీర్ల కృషి ఫలతమే అనేక ప్రాజెక్టుల నిర్మాణం. తెలంగాణ సమగ్రాభివృద్ధిలో నీటి వనరులు ఒక ప్రధాన అంశంగా పెట్టుకొని ముందుకెళ్లాం. కానీ ఈ ప్రభుత్వం జలవనరుల రంగాన్ని విర్మిస్తున్నది.ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు నీళ్లందించారు.
కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో కోటి ఎకరాలకుపైగా నీళ్లందించాం. కాలంతో పోటీ పడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేశాం. మిషన్ కాకతీయ ద్వారా 15 లక్షల నీళ్లించుకోవడం జరిగింది. కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల 9.6 టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకున్నాం.
తెలంగాణ ఏర్పడే సమయానికి 68 లక్షల టన్నుల వరి పండితే… 2022-23 నాటికి కోటి 68 లక్షల టన్నుల ధాన్యం. వరి పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానానికి ఎదిగింది. ఇన్ని చేసినా పదేళ్లలో ఏమి జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చుకోడానికి కేసీఆర్ కష్టపడ్డారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పరిపాలించి ప్రాజెక్టుల్లో పల్లేర్లు మొలిపించారు.
కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం ఫైరవీలు చేసుకున్నారు తప్ప ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు. గట్టిగా జై తెలంగాణ అంటే… వెంటనే ఫేక్ ప్రాజెక్టును శంకుస్థాపనలు చేసేవారు. వైఎస్ఆర్ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రా ప్రాంతానికి మన జలాలను తరలించారు. అదే ఒరవడిని జగన్, చంద్రబాబు కొనసాగించారు. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం రాయలసీమ, బనకచర్ల ప్రాజెక్టులను చేపడుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్, టీడీపీలే అన్యాయం చేశాయనుకుంటే.. ఇప్పుడు వాటికి బీజేపీ తోడయ్యింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్ర బలగాలను మోహరింపజేశారు. కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకున్న నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. జలవనరుల విషయాల్లో ఇతర రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా ఒక్కటవుతారు. కానీ తెలంగాణ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు పనికిరావని దుష్ప్రచారం చేస్తున్నారు. నీళ్లు ఇవ్వక రైతుల పొట్టకొడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత జిల్లాలో పంటను ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే సీతారామ ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఆర్భాటంగా ప్రారంభించినా, ఆ ప్రాజెక్టు ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వలేదు.