సత్యాచరణే ఆయన వేదం

-(జయదేవ్.చల్లా 9884675329)
మన నాయకుల గురించి మనం గొప్పగా చెప్పుకోవడంలో విoతేమీ లేదు.కానీ విదేశీయులు మన భాషా-సంస్కృతులకు ఆమడ దూరంలో ఉంటారు.అటువంటి వారిని సైతం మన జాతిపిత మహాత్మా గాంధీ ఎంతగా ప్రభావితం చేశారో అని తెలిసినపుడు మహాత్ముని అసలైన వ్యక్తిత్వం ఎంతటి విశ్వఃవ్యాప్తమో మనకి అర్ధం అవుతుంది..చైనాకు సన్నిహిత మిత్రుడిగా మెలిగి అక్కడ సైతం తనకంటూ ఓ స్మారకాన్ని పొందిన “ఎడ్గార్ స్నో” అనే దివంగత అమెరికన్ విలేఖరి గాంధీ గురించి రాసిన ఆణిముత్యాల్లాంటి విశేషాలు నేడు గాంధి మహాత్ముని 153 వ జయంతిని పురస్కరించుకుని ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నాను.
1942 వరకూ గాంధీ నా రాతల్లో,దృష్టికోణంలో వో జడవాది.ఈ మాటలు ఎందుకు అన్నానంటే అయన మిత్ర రాజ్యాలతో విప్లవం అనే పేరుతో యుద్హం చేస్తున్నాడనే అపవాదపు బాధతో.అయితే అయన పార్థివ దేహాన్ని సందర్శించడానికి ఇండియా వెళ్లి నపుడు జడ పదార్ధo అయన కాదు నేనేనని జ్ఞానోదయమైంది. స్వతహాగా విదేశీ విలేకరులు వస్తువాదంతో ఉంటారు అటువంటి నన్ను కూడా అయన పార్థివ దేహ దర్శనం కంటతడి పెట్టించింది అంటే అయన గొప్పతనాన్ని గురించి ఏమని రాయాలి? ఎలా రాయాలి? అని నన్ను నేను తొలిసారిగా ప్రశ్నించు కోవాల్సి వచ్చింది.తొలినాళ్ళలో ఆయన్ని నేను గర్వంతో కూడిన దృష్టి తో చూశాను అందుకే గాంధి తత్వం నాకు సరిగా కొరుకుడు పడలేదు.ఆపైన గర్వం దిగిపోయిన సమయంలోనూ ఆయన్ను చూశాను.అదిగో సరిగ్గా అప్పుడే మహాత్ముని నిజమైన అంతరంగాన్ని స్పష్టంగా చూడగలిగాను.సత్యం అనే దాని వాస్తవ రూపాన్ని శాంతి-సౌభ్రాతృత్వం వైపుకి నడిపిన అయన నిజానికి ఒక “యోగి” అయితే మరో కోణంలో “సోమయాజి” కూడా.ఎందుకంటే సత్యాన్వేషణ ,అహింస అనే రెండు యజ్ఞాలను అయన కొన్ని వందల సార్లు చేశారు కనుక. గాంధి తో నా తొలి పరిచయం 1931 సిమ్లా లో అయన గురుంచి చదివినవి,విన్నవి అన్నీ కూడా ఆయన్ను చూసినపుడు అక్షర సత్యాలనిపించాయి.అయితే విలేకరులు అంత తొందరగా నిజాలని ఒప్పుకోరు.నేనూ అదే దారిలో ఉన్నాను కనుక నిజాన్ని వోప్పుకోలేకపోయాను .
వర్ణాశ్రమ తేడాలను బుధ్హుడిలా ఎదిరించి అంటరానితనాన్ని అంతమొందించిన గాంధి అంటే నాకు గౌరవం.అయితే బుద్దుడు ఇందులో పాక్షిక విజయుడు మాత్రమే అంటాను.భారత దేశం ఎందుకు పరాయి మతాల చేతిలో నలిగిపోతున్నదో గాంధీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేది సత్యదూరమైన విషయం కానేరదు.గాంధీలో మరో గొప్ప కోణం ఏమంటే ,తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకున్నప్పుడు క్రైస్తవుల లోని ఒక వర్గం వారిలా తనకు తానుగా స్వయం దండన విధించుకోవడం.చాలా మంది గాంధీ స్వీయ ఆరోగ్యం కోసం ఉపవాస దీక్షలు చేస్త్తారని అనుకొన్నారు కానీ వాస్తవానికి అవి ఆన సత్యాన్వేషణ లోని అంతర్భాగమేనని పెవ్వురికి తెలియనే తెలియదు. ప్రజానాడిని తెలుసుకోవడంలో గాంధీ కి ఎవ్వరూ సరిరారు,సరిపోరు కూడా.ఈ మాట నేను అంటున్నది కాదు స్వయంగా నెహ్రు నాతో చెప్పిన మాటలు.యమునా నది వొడ్డున అయన దేహానికి సంస్కారం జరుగుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటనను నేను మరువలేను.అదేమంటే ఆయనతో పాటు చితిలోకి దూకి ప్రాణ త్యాగం చేయడానికి వందలాది మంది పరుగు పెట్టడం.ప్రపంచంలోని ఏ నాయకుడికి ఇంతటి ప్రజాభిమానం లేదు,రాదూ కూడా.అయన చైతన్యపు ఆత్మ ఎలాగూ మాతో లేదు కనీసం అయన పార్థివ దేహన్నైనా మాకు మిగల్చండి అంటూ జనం చితి వైపుకి వెళుతుంటే పోలీసు బలగాలు వారిని అదుపు చేయలేక పోవడం నేనెరుగుదును.
అహింసా,తపస్సు,సత్యాన్వేషణ అనే మూడు సూత్రాల ముప్పేట గొలుసు ఈ దివంగత గాంధి అనిపించింది.అయన చనిపోవడానికి కొన్ని రోజులకి ముందు నేను గాంధిని కలిసినపుడు వ్యాకులత గా కనిపించారు. మా మాటల సందర్భంలో “మా స్వాతంత్రోద్యమం పూర్తిగా అహింసాయుతం కాదని ఈ మధ్యనే తెలుసుకోగలిగాను.నిజానికి ఇది బలహీనులైన తెల్లవారి శాంతి నిరోధక చర్య లోని వైఫల్యమేనని నేడు నాకు తెలియవచ్చింది.వారి వైఫల్యం మాకు విజయమై౦ది.”అని గాంధి అనడం నాకు సంభ్రమాన్ని కలిగించింది.ఇది ఎందుకు చెప్పానంటే గాంధి ఎంత లోతుగా,గంభీరంగా విశ్లేషణ చేస్తారో ,తన తప్పొప్పులను నిరంతరం ఎలా బేరీజు వేసుకుంటారో చెప్పేటందుకే.స్వాతంత్ర్యం అనంతరం హిందూ-ముస్లిం వర్గాల మధ్య రేగిన ఘర్షణల నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని గ్రహించి ఉంటారు పించింది.అంతే కాదు ఈ ఘర్షణల వలన అయన తన సిద్హా౦తాలను ప్రజలు సరిగా అర్ధం చేసుకోలేకపోయారని కూడా తెలుసుకున్నారు.చివరలో అయన నెమ్మదిగా “శాంతి-అహింసలు కేవలం కాగితాలకీ-నోటి మాటలకి పరిమితమైన నైతిక పదాలు కావని వాటిని సరిగా ప్రయోగించడం తెలిస్తే ఎటువంటి ఫలితాలు వోనగూడుతాయో తెలిసిందని ,ఈ ప్రయోగంలో నేను ఓడిపోయి చివరికి విజేతగా నిలిచానని” చెప్పారు.
గాంధిని తొలిసారిగా “మహాత్మా “ అని సంబోధించిన రవీంద్ర కవికి సైతం ఆయనలో ఈ సత్యమైన ఆత్మ పరిశుద్హతత్వమే కనిపించి ఉండవచ్చు.సత్యం అనేది ఏ మతంలో ఉన్నా గ్రహించాలని ,వేదాలే సత్యములైనా తనకి సత్య ఆచరణే వేదమని వక్కానిణిoచింది కేవలం వొక్క గాంధీయే అని బల్ల గుద్హి చెప్పోచ్చు.వేదమైనా -మతమైనా గాంధికి ఒక్కటే .అవి రెండూ ఆయనకి సత్యరూపమే.అందుకే సత్య నిష్ఠ కలిగిన ఆయనకు అసత్యపు చాయలు ఇట్టే కనిపించేవి.గాంధి సత్య సంధత అయన తోటి నాయకులకు ఒక స్థాయిలో భరించరానిదిగా ఉండేదని చెప్పడానికి ఒక విలేఖరిగా నేను సంకోచించను .విదేశాలలో సామాన్య ప్రజానీకానికి గాంధీ ఒక పిచ్చి ఆదర్శవాది కావచ్చు గాక కాని స్వధర్మం లోపించిన రాజకీయాలు అయన దృష్టిలో అర్ధంలేని రాన్దాతాలు మాత్రమె.ఆయన్ని అనేకసార్లు అపార్ధం చేసుకున్న అనంత కోటి లో నేనూ వోకడిని ,కానీ అయన ఎన్నడూ అటు బ్రిటిష్ అధికార వర్గం తో గానీ ఇటు ధనిక వర్గాలతో కానీ ఎన్నడూ లాలూచీ పడింది లేదు.అదీ అయన వ్యక్తిత్వం లోని గొప్పతనం.వైవిధ్య విశిష్టత ,క్లిష్టతరమైన భిన్న సంఘ వర్గాలను ఒక తాటి పైకి తెచ్చిన నాయకుడిగా గా౦ధీ ని ముందు ఆవాహించి,అవగాహని౦చుకొ౦టే తప్ప ,మిగిలిన విషయాలలో ఆయన్ని అర్ధం చేసుకోవడం మహా మహులకే సాధ్య పడలేదంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Leave a Reply