Suryaa.co.in

Andhra Pradesh

సజావుగా ప్రాదేశిక ఎన్నికలు

ఒంగోలు, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ప్రాదేశిక ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో దర్శి నియోజకవర్గంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధం చేశామని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత ఏడాది కోవిడ్ కారణంతో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ నుంచి మొదలయ్యాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 8వ తేదీన ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు ముగియగానే బ్యాలెట్ బాక్సులను రిసెప్షన్ సెంటర్లకు డిపాజిట్ చేస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు తొలిదశ శిక్షణ ముగిసిందన్నారు. ఈ నెల 7వ తేదీన రెండవ విడత శిక్షణ ఇస్తామన్నారు. ఎం.పి.డి.ఓ. కార్యాలయాలను ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు తదితర సామగ్రి సిద్ధం చేసి ఆయా మండలాలకు తరలించాలన్నారు. ప్రజలు ధైర్యంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి దుర్ఘటనలు జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకోసం 10 మంది ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దర్శి నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలకు ఏ.పి. మోడల్ స్కూల్ లో 2 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఒక ఎం.పి.టి.సి. పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం ఉంటే ఒక కౌంటింగ్ టేబుల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. 2 పోలింగ్ కేంద్రాలు లేదా ఆ పైగా వుంటే ఆ ప్రాంతంలో 2 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. మొత్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో 1285 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలాంటి నూతన విధానం ద్వారా ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందని, వేగంగా ఫలితాలు వెల్లడించవచ్చని ఆయన తెలిపారు. ఈ విషయంపై ఎం.పి.డి.ఓ.లకు, పోటీలో వున్న అభ్యర్థులకు సమాచార ఇచ్చామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి బరిలో వుండే అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు హాజరుకావచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు సజావుగా సాగడానికి జిల్లాలోని ప్రజలంతా యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కె.కృష్ణ వేణి, తహశీల్దారు వరకుమార్ , ఎం.పి.డి.ఓ., జి.శోభన్ బాబు, సి.ఐ. బీమా నాయక్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE