Suryaa.co.in

Telangana

సోనియా, రాహుల్ నకిలీ గాంధీ వారసులు

– సోనియా గాంధీది అవినీతిలో ఇమిడిపోయిన కుటుంబం
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్: గాంధీ వారసులమని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలు అసలైన గాంధీ వారసులు కాదు. నకిలీ గాంధీ వారసులు. నేషనల్ హెరాల్డ్ కేసుపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ నేపధ్యంలో, ఒక కుటుంబం చేసిన అవినీతి దాగడానికి కోర్టులను, చట్టవ్యవస్థను గౌరవించకపోవడం అత్యంత దురదృష్టకరం.

గాంధీ కుటుంబం పేరుతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. కోర్టులు తమ తప్పులను ప్రశ్నించవద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన సంస్థలే విచారణ చేస్తున్నాయి. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ నాయకులు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసుకు భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదు. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలి. 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ఈ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురిస్తుంది. 2008లో ఆర్థిక సంక్షోభం కారణంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను మూసివేశారు. దాంతో AJL తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.

2010లో యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (YIL) అనే కంపెనీ స్థాపించబడింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తలా 38 శాతం వాటా కలిగి ఉన్నారు. వాస్తవానికి AJL ఆస్తుల మొత్తం విలువ రూ. 2,000 కోట్లు ఉన్నప్పటికీ, YIL సంస్థ కేవలం రూ. 50 లక్షలతో వాటిని సొంతం చేసుకుంది.

2012లో సుబ్రమణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసు దాఖలు చేశారు. YIL సంస్థ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన AJL ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో కొనుగోలు చేయడం అవినీతి ఆరోపణలకు దారి తీసింది. 2013లో సీబీఐ ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. అయితే, సీబీఐ దర్యాప్తును అర్ధాంతరంగా నిలిపివేసినా, ఈడీ దర్యాప్తు కొనసాగింది.

2023 నవంబరులో ఈడీ, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు చెందిన రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. YIL సంస్థకు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసింది.

2025, ఏప్రిల్ 5న ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన నిందితులుగా పేర్కొంది. ఈడీ చేసిన చార్జ్‌షీట్ ప్రకారం, కోర్టు విచారణకు ఆదేశించగానే కాంగ్రెస్ పార్టీ కోర్టు ఎదుట వేలాదిమంది కార్యకర్తలతో ధర్నాలు నిర్వహించింది. కోర్టు తీర్పును గౌరవించకుండా వ్యవహరించింది. కోర్టు తీర్పును కూడా అగౌరవపర్చేలా నకిలీ గాంధీ కుటుంబం వ్యవహరించింది. దేశ వ్యాప్తంగా కూడా ధర్నాలు చేపట్టింది.

ఏప్రిల్ 25, 2025న ప్రత్యేక కోర్టు విచారణ ప్రారంభించనుంది. అయినా కూడా న్యాయస్థానాలపై ఒత్తిడి తీసుకురావడంలో, కోర్టులను, రాజ్యాంగాన్ని అగౌరవపర్చడంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ముందున్నారు. YIL సంస్థ ద్వారా విలువైన AJL ఆస్తులను కేవలం రూ. 50 లక్షలతో సేకరించడం, ఇందుకు ప్రధాన నాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం సిగ్గుచేటు.

ఈడీ ఇప్పటికే విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది. చార్జ్‌షీట్ దాఖలుతో కేసు వేగంగా కొనసాగుతోంది. అయినప్పటికీ సోనియా, రాహుల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈడీ, ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జ్‌షీట్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి పలువురు నేతల పేర్లు ఉన్నాయి.

ఈడీ ఆధారాల ప్రకారం, YIL సంస్థ 2010లో AJL సంస్థ యొక్క విలువైన ఆస్తులను కేవలం రూ. 50 లక్షలకే సొంతం చేసుకుంది. ఇది పెద్ద స్థాయి మోసం. హర్యానాలో 2010లో రియల్ ఎస్టేట్ ఒప్పందం కేసులో రాబర్ట్ వాద్రాను (ప్రియాంక గాంధీ భర్త) ప్రశ్నించి, తరువాత చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సోనియా గాంధీ కుటుంబం అవినీతిలో ఇమిడిపోయిన కుటుంబం. అయినప్పటికీ వారు న్యాయ ప్రక్రియను తక్కువ చేస్తూ, కోర్టులను గౌరవించకుండా వ్యవహరించడం తీవ్రంగా ఖండించదగిన చర్య.

LEAVE A RESPONSE