Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి

– నేడు మీరు సాయం చేసి నిలబెడితే… రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటాం
– రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించండి… స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వండి
– రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన ముఖ్యమంత్రి
– గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించాం
– 16వ ఆర్థిక సంఘానికి స్వయంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు
– రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి
– రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన
– రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆర్థిక సంఘం ప్రశంస
– ప్రధానికి వివరించారా అని ఆరా తీసిన అరవింద్ పనగారియా

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం అన్నారు.
రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని… దృఢమైన నిర్ణయాలతో, ఉత్తమ పాలసీలతో పాలన సాగిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామని సీఎం అన్నారు. రాజధాని లేకపోవడం వల్ల రెవెన్యూ జనరేషన్‌కు అనేక సమస్యలు ఉన్నాయని సీఎం వివరించారు. ఈ కారణంగానే ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ఆర్ధిక సంఘానికి సాదర స్వాగతం

రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తరువాత వృద్ధిరేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు.

గత ప్రభుత్వంలో ఐదేళ్లూ తీవ్ర నష్టం

2019 తరువాత నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా రాష్ట్ర ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని సీఎం వివరించారు. గత 10 నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ప్రజెంటేషన్ ద్వారా సీఎం వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సాయం అందించాలని కోరిన సీఎం…రాష్ట్రంలో నెలకొన్ని ప్రత్యేక పరిస్థితులు దృష్ట్యా కేంద్రం కేటాయింపులు జరిపేలా సిఫారసులు చేయాలని సీఎం విన్నవించారు.

పనగారియా సేవలు ఎంతో విలువైనవి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ”16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దేశానికి చేస్తున్న సేవలు ఎంతో విలువైనవి. పనగారియా నీతి ఆయోగ్‌లో పని చేసిన సమయంలోనే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు. దేశంలో ఉన్న ఇతర జాతీయ ప్రాజెక్టుల పురోగతి మందగించడంతో పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని సిఫారసు చేశారు. వచ్చే పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు కూడా రావాలని కోరుతున్నాను” అని సిఎం అన్నారు.

మోదీ నాయకత్వంలో దేశ ముఖచిత్రం మారుతోంది

“ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ వైపు ప్రయాణిస్తోంది. ఒకప్పుడు దేశ వృద్ధి రేటు చూసి ప్రపంచం హేళన చేసేది. కానీ నేడు ప్రపంచం గర్వించే స్థాయిలో భారత్ వృద్ధి సాధిస్తోంది. నేడు మనం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం… 2028 నాటికి మూడవ స్థానానికి చేరుకుంటాం. 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ది చెందుతాం. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సాధిస్తున్న విజయాలు స్ఫూర్తివంతంగా ఉంటున్నాయి.

సంస్కరణలు దేశ ముఖచిత్రాన్ని మార్చే ఫలితాలను ఇస్తున్నాయి. ఉమ్మడి ఏపీలో తెచ్చిన అనేక సంస్కరణలు అనేక మార్పులు తెచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐటీని ప్రోత్సహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. నేడు ఏఐ గురించి మాట్లాడుతున్నాం. జనాభా విషయంలో కూడా మేం ఒక పాలసీ తీసుకున్నాం. జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణ వైపు ఆలోచిస్తున్నాం. ఇది భారత దేశానికి కీలకమైన దశ. అమృత్ కాల్ అని చెప్పాలి. దేశం అతి గొప్ప విజయాలు సాధించేలా ఫైనాన్స్ కమిషన్ కీలక భూమిక పోషించాలి అని కోరుకుంటున్నా” అని సిఎం అన్నారు.

4 సార్లు సీఎంగా చేసినా ఇన్ని సవాళ్లు చూడలేదు

“నేను ప్రస్తుతం నాలుగవ సారి సీఎంగా ఉన్నాను. కానీ ఇన్ని సవాళ్లు, ఇన్ని ఆర్థిక కష్టాలు ఎప్పుడూ చూడలేదు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వానికి రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అప్పుల కోసం గత ప్రభుత్వం తహసీల్దార్ ఆఫీస్ లు కూడా తాకట్టు పెట్టింది. 25 ఏళ్లకు మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టింది. ఇలాంటి సమస్యల నుంచి బయటకు వచ్చి రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం. సంక్షేమ, అభివృద్ది బ్యాలెన్స్ చేసుకుంటూ…..సుపరిపాలన అందిస్తున్నాం.

ఇలాంటి సమయంలో…ఈ రోజు మేం నిలబడేందుకు, ముందుకు వెళ్లేందుకు మీరు సాయం చేస్తే…రేపు పుంజుకుని మాకున్న బలం ద్వారా అనూహ్య విజయాలు సాధిస్తాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో మా వంతు పాత్ర పోషిస్తాం. తద్వారా దేశ నిర్మాణంలో ముఖ్యమైన రాష్ట్రంగా నిలుస్తాం. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు, ఉద్యోగ కల్పనకు అవసరమైన పెట్టుబడులు సాధించేందుకు మేం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. జాబ్ ఫస్ట్ అనే నినాదంతో…స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానంతో మేం పని చేస్తున్నాం”అని ముఖ్యమంత్రి వివరించారు.

వాట్సప్ గవర్నెన్స్‌కు హ్యాట్సాఫ్

అనంతరం వివిధ అంశాలపై ఆర్థిక సంఘం తమ అభిప్రాయాలు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై చైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులు ప్రశంసలు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారా అని సీఎంను పనగరియా అడిగారు… ఇంకా లేదని, వచ్చే నెలలో ప్రధానితో భేటీ సందర్భంగా ఆయనకు ఈ ప్రాజెక్ట్‌పై వివరిస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సేవలకు కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ వాట్సాప్ ద్వారా సేవలు పొందే పరిస్థితి తీసుకువస్తున్నామని రానున్న రోజుల్లో 1000 సేవలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు.

ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వడం తమను ఎంతో ఆశ్చర్య పరిచిందని, వృద్ధి గణాంకాలపై ఇంత లోతుగా విశ్లేషించడం, కేంద్ర సాయం పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను పనగారియా ప్రశంసించారు. మరోవైపు 30 ఏళ్ల క్రితం తాను హైదరాబాద్ వెళ్లిన నాటికి… నేటికీ ఎంతో అభివృద్ధి చెందిందని.. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమైందని ఆర్ధిక సంఘం సభ్యురాలు అన్నెజార్జ్ మాథ్యూ అన్నారు. అమరావతి కూడా అదే స్థాయిలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందన్నారు.

16వ ఆర్ధిక సంఘానికి రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజంటేషన్ :

ఏపీ వృద్ధికి అనుకూలతలు

అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ తూర్పు దేశాలకు గేట్‌వేగా ఉంది. 3 పారిశ్రామిక కారిడార్లు, విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్లు ఉన్నాయి. 6 పోర్టులు, 7 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. దేశ ఎగుమతుల్లో 5.8 శాతం రాష్ట్రం నుంచే అవుతున్నాయి. బ్లూ ఎకానమి, ఐటీ, నాలెడ్జ్ ఎకానమి, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్, ఐవోటీ, బ్లాక్ చెయిన్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్రం ముందుంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్, అమోనియా… ఇలా గ్రీన్ ఎనర్జీకి ఏపీ హబ్‌గా ఉంది. అటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్ వంటి నగరాలు అమరావతికి చేరువలో ఉన్నాయి. ఈ నాలుగు నగరాలను కలుపుతూ దక్షిణ భారత దేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తే వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం అవుతుంది.

స్వర్ణాంధ్ర-2047 విజన్

భారతదేశాన్ని 2047 కల్లా వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు విజన్ రూపొందించుకున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి కనీస అవసరాలు తీర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్క కుటుంబానికి సొంతిళ్లు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, కుళాయి కనెక్షన్, వంటగ్యాస్, సమృద్ధిగా విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు, విద్యుత్ ఆదా చేసే వీధి లైట్లు, పాఠశాలలు, ఆరోగ్యకేంద్రాలు బలోపేతం చేసేలా చర్యలు చేపట్టాం.

వినూత్న కార్యక్రమం పీ4

జీరో పావర్టీ లక్ష్యంగా సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను…అత్యున్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది సంపన్నులు ఆదుకేనే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సమాజంలో అసమానతలు తొలిగేలా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. జనాభా వృద్ధిపైనా దృష్టి సారించాం.

స్వర్ణాంధ్ర – 2047 లక్ష్యాలు

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధించి 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరించేలా కృషి చేస్తున్నాం. అలాగే తలసరి ఆదాయం 42,000 వేల డాలర్లకు చేరడంతో పాటు ఎగుమతులు 450 బిలియన్ డాలర్లు, సగటు జీవిత కాలం 85 ఏళ్లు, అక్షరాస్యత 100 శాతం సాధించడం, నిరుద్యోగ రేటు 2 శాతానికి మించకుండా అభివృద్ధి చెందేలా చూస్తున్నాం.

రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం

ప్రస్తుతం జీఎస్డీపీ రూ.18.25 లక్షల కోట్లు ఉండగా, 2028-29 నాటికి రూ.29.29 లక్షల కోట్లకు చేరుకోవాలనేది లక్ష్యం. ఇది సాకారం కావాలంటే 2029 కల్లా రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది.

2014-15 నాటికి వివిధ రంగాల వాటా

2014లో రాష్ట్ర విభజనతో ఆదాయ వనరులు అన్నీ తెలంగాణకు వెళ్లాయి. కేవలం ప్రాథమికరంగంపైన మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ ఆధారపడాల్సి వచ్చింది. 2014లో ఏపీకి 31శాతం ఆదాయం ప్రధానంగా వ్యవసాయ రంగం నుంచి వస్తే, తెలగాణ రాష్ట్రానికి 16 శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. అలాగే పరిశ్రమల రంగం నుంచి ఏపీకి 25 శాతం, తెలంగాణకు 22 శాతం, సేవల రంగం నుంచి ఏపీకి 44 శాతం, తెలంగాణ 61 శాతం వాటా ఉంది.

2023-24 నాటికి వివిధ రంగాల వాటా

2023-24 నాటికి ఏపీ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా 34 శాతం ఉంటే, భారతదేశానికి 20 శాతం, తెలంగాణకు 15 శాతం ఉంది. ఏపీలో పరిశ్రమల రంగం వాటా 24 శాతం ఉంటే, భారతదేశంలో 26 శాతం, తెలంగాణలో 18 శాతం ఉంది. ఏపీలో సేవలరంగం వాటా 42 శాతం ఉంటే, భారతదేశంలో 54 శాతం, తెలంగాణలో 67 శాతం ఉంది.

ప్రధాన ఆదాయ వనరు లేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ఆదాయం ఏపీ కోల్పోయింది. దీంతో తెలంగాణకు ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఇది తెలంగాణ వృద్ధికి, తలసరి ఆదాయం పెరుగుదలకు, ఏపీ వెనకబాటు తనానికి కారణమైంది.

గత ప్రభుత్వ హయాంలో కోలుకోలేని నష్టం

గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014 – 2019 మధ్య 13.49 శాతం సరాసరి వృద్ధి వుంటే… 2019-2024 మధ్య సరాసరి వృద్ధి 10.32 శాతానికి పడిపోయింది.

జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయం తక్కువ

దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాలతో పోల్చుకుంటే జీఎస్డీపీలో రాష్ట్ర సొంత ఆదాయ వనరుల శాతం ఏపీలో తక్కువుగా ఉంది. ఏపీలో 6.48 శాతం ఉంటే, తెలంగాణలో 9.51 శాతం, కేరళలో 8.49 శాతం, మహారాష్ట్రలో 7.93 శాతంగా ఉంది.

విభజనతో నష్టం-పంపకాలు పెండింగ్

విభజనతో జాతీయ సంస్థలు, విద్య-వైద్య సంస్థలు, భారత ప్రభుత్వ సంస్థలు ఏపీకి లేకుండా పోయాయి. విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం 91 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి రూ.1.63 లక్షల కోట్లు, అలాగే షెడ్యూల్ 10 కింద ఉన్న 142 సంస్థలకు చెందిన రూ.39,191 ఆస్తుల పంపంకం అంశం రెండు రాష్ట్రాల మధ్య విభజన జరిగి పదేళ్లవుతున్నా ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

తలసరి ఆదాయంలోనూ తలకిందులు

రాష్ట్రం విడిపోయే నాటికి 2014-15లో ఏపీ తలసరి ఆదాయం రూ.93,903 ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104గా ఉండేది. మొదటి ఐదేళ్ల మా పాలనలో ఏపీలో తలసరి ఆదాయం 13.21 శాతం పెరిగి 2019కి రూ.1,54,031కు చేరుకుంది. అదే కాలానికి తెలంగాణలో 13.37 శాతం పెరిగి రూ.2,09,848 అయ్యింది. 2019-24 మధ్య ఏపీలో తలసరి ఆదాయ వృద్ధి 9.18 శాతానికి పడిపోయింది. తెలంగాణలో మాత్రం 11.45 శాతం నమోదైంది. దీంతో 2023-24లో ఏపీ తలసరి ఆదాయం రూ.2,37,951, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,56,56 నమోదైంది. ఇలా రాష్ట్ర విభజన, గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా తలసరి ఆదాయంలో తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయమే అత్యంత తక్కువ.

ఖచ్చితంగా చేయాల్సిన వ్యయమే ఎక్కువ

రాష్ట్రానికి సొంతంగా వచ్చే ఆదాయం కన్నా… వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, జీతాలు..ఇలా ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన వ్యయం ఎక్కువుగా ఉంటోంది. 2023-24లో చూస్తే… మొత్తం ఖచ్చితంగా చేయాల్సిన వ్యయం రూ.1,0322 కోట్లు ఉంటే, సొంత ఆదాయం రూ.93,410 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఆదాయం కన్నా, ఖచ్చితంగా చేయాల్సిన వ్యయం 110.6 శాతం ఎక్కువ ఉంది. ఇది రాష్ట్రానికి భారంగా మారింది.

2019-24లో గాడితప్పిన వ్యవస్థ

గత ప్రభుత్వ హయాంలో ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టకపోవడం రాష్ట్రానికి భారీగా నష్టం కలిగించింది. రెవెన్యూ వ్యయంపై ఎలాంటి నియంత్రణ లేదు. 2024లో అధికారం చేపట్టేనాటికి మొత్తం రుణాలు రూ.9.74 లక్షల కోట్లకు ఉంది. దీనికి తోడు గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు రూ.1.35 లక్షల కోట్లు ఉన్నాయి. మూలధన వ్యయం కూడా 2014-19లో 2.01 శాతం నుంచి 2019-24కి 1.38 శాతానికి తగ్గింది.

ఈ 9 నెలల్లో గాడిలో పెట్టాం

2024లో అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం మిగిల్చిన రూ.24,811 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. కేంద్ర ప్రాయోజిక పథకాలకు సంబంధించిన బకాయిలు రూ.13,085 కోట్లు తీర్చాం. మూలధన వ్యయానికి సంబంధించి రూ.13,314 కోట్లు చెల్లించాం. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు రూ.3,339 కోట్లు ఖర్చు చేశాం. అమరావతి, పోలవరం, ఇండస్ట్రియల్ హబ్, పోర్టుల నిర్మాణం కోసం నిధులు భారీగా ఖర్చు పెడుతున్నాం.

19 కొత్త పాలసీలు తీసుకువచ్చాం

రాష్ట్రాభివృద్ధి కోసం కొత్తగా 19 పాలసీలు ప్రవేశపెట్టాం. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎంఎస్ఎంఈ, మేరిటైమ్, క్లీన్ ఎనర్జీ, టూరిజం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీల ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం.

స్వర్ణాంధ్ర సాకారానికి వృద్ధి రేటే ఆధారం

స్వర్ణాంధ్ర విజన్ -2047 సాకారం కావాలంటే వృద్ధి రేటు 15 శాతం ఉంటేనే సాధ్యమవుతుంది. 15 శాతం తగ్గకుండా వృద్ధి నమోదు చేయగలిగితే జీఎస్డీపీ రూ.347 లక్షల కోట్లకు చేరుతుంది. తలసరి ఆదాయం రూ.58,14,916కు పెరుగుతుంది. అదే 12.50 శాతం వృద్ధి నమోదైతే జీఎస్డీపీ రూ.214 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.35,85,473 అవుతుంది.

ఏటా పెరుగుతున్న రెవెన్యూ లోటు

ప్రతీ ఏటా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పెరిగిపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.1,28,146 కోట్లు ఉంటే, 2030-31 నాటికి రూ.1,43,640 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం.

వర్టికల్ డెవల్యూషన్ వాటా పెంచాలి

వికసిత్ భారత్ సాధనలో రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. దీనికి ఆర్థిక సంఘం వర్టికల్ డెవల్యూషన్ వాటా ప్రస్తుతం ఉన్న 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. అటు, హారిజెంటల్ డెవల్యూషన్‌లోనూ దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిపోతోంది. 10వ ఆర్ధిక సంఘం సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు హారిజెంటల్ డెవల్యూషన్ 24.30 శాతం ఉంటే, 15వ ఆర్ధిక సంఘానికి వచ్చే సరికి 15.80 శాతానికి తగ్గింది. హారిజెంటల్ డెవల్యూషన్‌లో ఏపీ వాటా పరిశీలిస్తే… దేశ జీడీపీ, జాతీయ జనాభా వాటా కన్నా తక్కువుగా ఉంది. ఇది ఆర్ధికంగా ఏపీకి నష్టం కలిగిస్తోంది.

గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు

రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు కేటాయించేటప్పుడు 70 శాతం వెయిటేజీ జనాభాకు, 20 శాతం వెయిటేజీ వ్యవసాయం, అనుబంధ రంగాలకు 10 శాతం వెయిటేజీ ప్రాంతానికి ఇవ్వాలని ప్రతిపాదన. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు రూ.69,897 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.7,381 కోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో రూ.62,516 కోట్ల నిధులు కావాల్సి ఉంది.

పట్టణ స్థానిక సంస్థలకు గ్రాంట్లు

పట్టణ, స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, రహదారుల నిర్మాణం, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్, వీధి లైట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల కోసం రూ.19,871 కోట్ల గ్రాంట్లు అవసరం అవుతుంది. అలాగే 2026-2031 మధ్య కాలానికి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రూ.16,181 కోట్లు కావాల్సి ఉంది.

ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ

క్లీన్ ఎనర్జీకి రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. 2030 నాటికి 160 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దీనికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం ఉంది. 7.5 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది.

అమరావతికి రూ.47,000 కోట్లు అవసరం

రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ.31,000 కోట్లు సమకూరాయి. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు

ఇవీ ఆంధ్రప్రదేశ్ అవసరాలు

1. పోలవరం-బనకచర్ల అనుసంధానం
2. తాగునీటి ప్రాజెక్టులు
3. 5 పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు, తిరుపతి, రాజమహేంద్రవరం) ఐఐటీ తిరుపతిలో ఇంక్యుబేషన్ సెంబర్, బుద్ధిస్ట్ సర్క్యూట్, అమరావతిలో జాతీయ మ్యూజియం, విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు
4. నాలెడ్జ్ ఎకానమీలో భాగమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, స్కిల్ డెవలప్మెంట్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 100 శాతం అక్షరాస్యత
5. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఇన్‌ల్యాండ్ వాటర్ వేలు, రహదారులు
6. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి రీజనల్ గ్రోత్ సెంటర్లు… ఈ ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్లు ఇచ్చేలా సిఫారసులు చేయాలని ఆర్ధిక సంఘాన్ని ముఖ్యమంత్రి కోరారు.

LEAVE A RESPONSE