నవరాత్రులలో సువాసిని,కుమారి పూజ

పసుపుకొమ్మలను సేకరించి , నిమ్మరసంలో మూడు రోజులు నానబెట్టి , ఎండలో ఆరబెట్టి , కుంకుమరాళ్లను కలిపి , దంచి , జల్లించి , సేకరించినది ఉత్తమమైనది. ఇటువంటి కుంకుమతో అమ్మను ఆరాధించిన అన్నికోర్మెలు నెరవేరతాయి.
కుంకుమను స్త్రీలు ప్రత్యక్షంగా ధరించవచ్చు. పురుషులు ముందుగా చందనమును ధరించి , ఆపైన కుంకుమను ధరించాలి. ఈవిధంగా ధరించనియెడల పురుషత్వము నశిస్తుంది. అదేవిధంగా పసుపును పురుషులు శరీరానికి పూసుకొనరాదు. పూసుకొనిన యెడల పురుషత్వము నశిస్తుంది.
సువాసినీ పూజ ఏవిధంగా చేయాలి ?
సలక్షణాలతో ఏవిధమైన అవయవలోపంలేని సౌమ్యమైన , ముతైదువను ఎంచుకొని., అమ్మవారిగా భావించి., షోడశ ఉపచారములతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీ , అష్ణోత్తర , ఖడ్గమాల నామములతో అర్చించి , మంగళహారతి ఇచ్చి , ఆభరణ , పుప్ప , హరిద్ర , కుంకుమ చందనాదులతో సత్కరించి , ఆ సువాసినితో ఆశీర్వచనము తీసుకొనిన సువాసినీపూజ పూర్తియగును.
ఈ సువాసినీపూజ శ్రీచక్రనవావరణార్చన అనంతరం దేవీనవరాత్రులలో నిర్వహించాలి.శక్తి అనుసారం ఒక ముతైదువకుగానీ , ముగురికిగానీ , ఐదుగురికిగానీ , ఏడుగురికిగానీ , తొమ్మిదిమందికిగానీ , పద్దెనిమిదిమందికి గానీ , ఇరవై ఏడుమందికి గానీ , యాభై నాలుగుమందికి గానీ ,నూట ఎనిమిది మందికిగానీ ,ఐదువందల యాభై ఎనిమిదిమందికి గానీ , వెయ్యిన్నూట పదహారు మందికిగానీ సువాసినీపూజ చేయవచ్చును.
బ్రాహ్మణ ముతైదువలకు సువాసినీపూజ చేసిన భక్తి , జ్ఞాన , వైరాగ్యములు , విద్యాభివృద్ధి కలుగును.క్షత్రియ ముతైదువలకు సువాసినీపూజ చేసిన ధైర్య సాహసములు వృద్దియగును. ముతైదువలకు సువాసినీపూజ చేసిన అప్టెశ్వర్య భోగభాగ్యములు వృద్దియగును.శూద్ర ముతైదువలకు సువాసినీపూజ చేసిన సత్సంతానప్రాప్తి కలుగును. మన యొక్క కామ్యమునుబట్టి సువాసినులను ఎంచుకొని , ఆహ్వానించి , ఆరాధించి , ఆశీస్సులు పొందవలయును.
కుమారీపూజ ఏవిధంగా చేయాలి ?
అమ్మవారికి ప్రియమైన అర్చనలలో కుమారీ అర్చన విశేషమైనది. శ్రీదేవీ నవరాత్రులలో
మొదటిరోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా ,
రెండవ రోజు రెండు సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా,
మూడవరోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా ,
నాల్గవరోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కన్యను కళ్యాణిగా,
ఐదవరోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ,
ఆరవరోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళికగా ,
ఏడవరోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ,
ఎనిమిదవరోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యకను శాంభవిగా ,
తొమ్మిదవరోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యకను దుర్గగా ,
పదవరోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా భావించి షోడశఉపచారాలతో శ్రీసూక్త విధానంగా సహస్ర , త్రిశతీనామ , అష్ణోత్తర శతనామ , దేవీఖడ్గమాలా నామాదులతో , హరిద్ర , కుంకుమ పుష్పాదులతో అర్చించి , మంగళహారతులిచ్చి , ఆభరణ , పుష్ప , చందనాదులతో సత్కరించి వారియొక్క ఆశీర్వచనము తీసుకొనిన సకలశుభములు కలుగును.

Leave a Reply