బాదుడే బాదుడు అని చెప్పి..విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు

-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని చెప్పి నేడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మంగళవారం జూమ్ యాప్ ద్వారా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలనే క్లుప్తంగా మీకోసం…నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ట్రూఅప్ అనే ఒక కొత్త పద్దతిని ప్రవేశపెట్టి విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేస్తోంది. 3,660 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పినవన్నీ గాలి కబుర్లని ప్రజలకు తెలిసిపోయింది.
అధికారంలోకి రావడానికి జనగ్ చెప్పని అబద్ధం లేదు. అలివిగాని హామీలిచ్చారు. అధికారంలో లేనప్పుడు ఎన్నికల ప్రచారంలో కరెంటు చార్జీలు పూర్తిగా తగ్గించేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే 50 రూపాయలు వస్తుండిన కరెంటు బిల్లును రెండువందలు వచ్చేలా చేశారు. జగన్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్ల పాలనలో నాలుగుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి. విద్యుత్ బిల్లుల రూపేణ రూ.9,069 కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం దండుకుంది. 2019లో అధికారంలోకి రాగానే 5వందల యూనిట్లకంటే అధికంగా విద్యుత్ వినియోగించినవారికి వీరబాదుడు బాది దాదాపు 13వందల కోట్ల రూపాయలు దండుకున్నారు. రెండో సారి విద్యుత్ సర్ చార్జీ పేరుతో యూనిట్ కు పది రూపాయల చొప్పున రెండు వందల నుంచి మూడు వందల వరకు విద్యుత్ చార్జీలు పెంచారు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు అధికంగా ఉన్నాయి.
టెక్నాలజీ పరంగా దేశ వ్యాప్తంగా విద్యుత్ చార్జీలు తగ్గుతుంటే మన రాష్ట్రంలో పెరుగుతున్నాయి. రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకపోవడం దురదృష్టకరం. పేద రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతు ఆత్మహత్యలకు కారకులయ్యారు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ధరలు చూసి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. కరోనా సమయంలో ప్రజలు అల్లాడుతున్నా దొడ్డిదారిన విద్యుత్ సర్ చార్జీల పెరుతో దోపిడి చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో దాదాపు రూ.25 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. 2014లో 14 వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని అంచలంచలుగా పెంచుకుంటూపోయి 24 వేల మెగావాట్లకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. 24వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చిన జగన్ కేవలం 910 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని మాత్రమే పెంచగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై భారం తగ్గిస్తాను అని చెప్పిన జగన్ ఇప్పుడు విద్యుత్ వినియోగదారులపై మోత వేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ చార్జీలు తగ్గించి, మంచి పరిపాలన అందించాలి, లేకుంటే ప్రజల్లో తిరుగుబాటు తప్పదు.

Leave a Reply