Suryaa.co.in

Telangana

ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పలేదు

– ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ
– వలసవచ్చి వారి పద్దతులలో వ్యవసాయం చేసి ఉండవచ్చు
– తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత
– పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమే.తెలియకుంటే తెలుసుకోవాలి .. ఇది తెలంగాణ సమాజాన్ని అవమానించడమే. కానీ తన అజ్ఞానాన్ని సమాజం మీద రుద్దడం సంస్కార హీనత.

ఎవరో వచ్చి తెలంగాణ ప్రజలకు వ్యవసాయం నేర్పలేదు. భారతదేశం లోనే దక్కన్ పీఠభూమి ప్రజలు, అందులో తెలంగాణ ప్రజలే అందరికంటే ముందు తమ నైపుణ్యంతో వ్యవసాయం అభివృద్ధి చేశారు. దానికి పునాదులు వేసింది విష్ణు కుండినులు, శాతవాహనులు, ప్రధానంగా కాకతీయ రెడ్డి రాజులు , అటుపిమ్మట అసఫ్ జాహీ పాలకులు.

వెయ్యేళ్ల క్రితమే ఈ తెలంగాణ నేల వరి పండిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచానికి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నేర్పించింది తెలంగాణ. ప్రపంచపు భారీ నీటిపారుదల తొలి ప్రాజెక్టు కట్టింది తెలంగాణలో నిజాం సాగర్. ఇక్కడ ఉన్న వనరులు చూసి బతకడానికి అనేకమంది వలస వచ్చారు.

వలసవచ్చి వారి పద్దతులలో వ్యవసాయం చేసి ఉండవచ్చు. ఆ విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వలస వచ్చినవాళ్లు వ్యవసాయం నేర్పారు అన్న మాటలు మాట్లాడడం తెలంగాణ సమాజాన్ని అవమానించడమే.

జొన్నకలి జొన్నంబలి
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పలనాటి సీమ ప్రజలందరకున్
అని శతాబ్దాల కిందటే శ్రీనాథుడు తన రచనల్లో వర్ణించారు. తెలియకుంటే పండితులను అడిగి పీసీసీ అధ్యక్షుడు తెలుసుకోవాలి. కాలానుగుణంగా కేవలం సమైక్య రాష్ట్రంలో కలిసిన పాపానికి తెలంగాణ రైతులు, తెలంగాణ వ్యవసాయం చిద్రమైపోయింది.

అది మరిచి ఎవరి సంతృప్తి కోసమో ఏ రోటి దగ్గర ఆ పాట పాడే మీ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ అస్థిత్వ పతాకకు రుద్ద వద్దు , అవమానించవద్దని హెచ్చరిస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు భేషరతుగా తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE