Suryaa.co.in

Andhra Pradesh

బాబు పై అసైన్డ్ భూముల కేసు స్టంట్

– ఎస్సీల చేతుల్లో బడితపూజ తప్పదు
– దళితుల అసైన్డ్ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి
– తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

చంద్రబాబుపై జగన్ ఆరోపణలు చేసేముందు నిప్పుకు చెదలు పట్టదని గ్రహించాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు…

ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ప్రమేయం అనడం అవివేకం
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని జగన్ నమ్మబలుకుతున్నారు. ఇడుపులపాయలో 700 ఎకరాలు అసైన్డ్ భూములను జగన్ స్వాధీనం చేసుకున్నది నిజం కాదా? రైతులు ఆత్మాహుతికి దారితీసేలా చేసిన వ్యక్తి జగన్. చంద్రబాబు దేవుడితో సమానమని రైతులంటుంటే జగనేమో దెయ్యంతో పోలుస్తాడా? సిద్ధం సభ విఫలం కావడంతో జగన్ కు దిక్కుతోచడంలేదు. వేలాది ఎకరాల రైతుల భూముల్ని అన్యాక్రాంతం చేసిన ఘనుడు జగన్. దళితులపై అక్రమ కేసులు బనాయించిన ఘనత జగన్ కే దక్కుతుంది. త్వరలో రైతులంతా మూకుమ్మడిగా చంద్రబాబు పై ఆరోపణలు చేసి నమ్మే తీరాలి అంటాడు నమ్మకపోతే కుదరనడం అవివేకం జగన్ ది.

రాజధానిని సర్వనాశనం చేశాడు
రాజధానిని సర్వనాశనం చేశాడు. రాజధానిని నిర్వీర్యం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు బయటపడినప్పుడు, వివేకా కేసు బయటపడినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తుంటాడు. టిడిపి నాయకులపై దొంగ కేసులు పెడుతుంటాడు. చంద్రబాబు నాయుడుపై అసైన్డ్ భూముల కేసు స్టంట్ మాత్రమే. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిపై బురదజల్లడం, అక్కసు వెళ్లగక్కడం నిరంతర ప్రక్రియగా పెట్టుకున్నట్లు ఉంది.

నాడు ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ చిలకపలుకులు పలికి ఐదేళ్లు గడుస్తున్నా ఒక్క ఆధారం చూపలేకపోయిన జగన్ రెడ్డి నేడు ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు నాయుడిపై అసైన్డ్ భూములు కేసు పెట్టడం సిగ్గుచేటు. వైసీపీ నాయకుల దందాలు, అక్రమాలు బయటకు వచ్చిన ప్రతిసారీ వాటిని పక్కదారి పట్టించేందుకు సిఐడీని రంగంలోకి దింపుతారు. గతంలోనూ సీఐడీ విచారణ అంటూ నలుగురు వ్యక్తులకు అబద్ధాలు చెప్పి సంతకాలు పెట్టించి కేసు పెట్టారు. చివరకు వారు..తమ భూములు ఎవరూ లాక్కోలేదని, భూముల వ్యవహారమని తెలిస్తే సంతకాలు పెట్టే వారిమి కాదని చెప్పారు. అయినా సిగ్గు, ఎగ్గూ లేకుండా మళ్లీ అసైన్డ్ భూములు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.

సెంటు పట్టా పేరుతో దోపిడీ
సెంటు పట్టా పేరుతో తెచ్చిన జీవో నంబర్ 72 సంగతేంటి.? సెంటు పట్టా పేరుతో 20 వేల ఎకరాలు బలవంతంగా నువ్వు లాక్కున్నది నిజం కాదా?ఇతర కారణాలతో రాష్ట్రంలోని 14 లక్షల ఎకరాల అసైన్ మెంట్ భూములు దోచుకున్నది వాస్తవం కాదా?విశాఖపట్నం, అనకాపల్లి డివిజన్లలో 2,552 ఎకరాల అసైన్డ్ భూములను దళితులను పోలీసులతో కొట్టించి లాక్కున్నారు.ఇడుపులపాయలో జగన్ రెడ్డి కుటుంబం సుమారు 700 ఎకరాల అసైన్ మెంట్ భూములను ఆక్రమించి ఎస్టేట్ కట్టుకున్నారు.

పెనగలూరు ఎస్టేట్, సరస్వతీ సిమెంట్స్ లోని అసైన్డ్ భూముల్లో నీ సౌదాలు నిర్మించుకున్నది మరిచావా జగన్ రెడ్డి. ముడుపులు దండుకునేందుకు 7.11.2021న జీ.ఓ 25 తెచ్చి సోలార్ ప్రాజెక్టులకు అసైన్ మెంట్ భూములను కట్టబెట్టారు. వైఎస్ హయాంలో 104 సెజ్ లకు వేలాది ఎకరాల అసైన్ మెంట్ భూములను లాక్కున్నారు. అసైన్డ్‌దారులైన దళితులను పట్టాదారులుగా మార్చి న్యాయం చేసింది చంద్రబాబైతే.. ఇళ్లపట్టాల పేరుతో దళితుల అసైన్డ్ భూములు కాజేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.

తమ భూమి గతంలో రూ.3 లక్షలు వుండేదని, అమరావతి రాజధాని ప్రకటించాక రూ.3 కోట్లకు వెళ్లిందని దళిత రైతులు చెప్తున్నారు. తమకు అవసరమైన వరకు అమ్ముకుని మిగతా భూములు తమ వద్దే ఉన్నాయని ఎస్సీలు చెప్తున్నా జగన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం దళితుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. అమరావతికి భూములిచ్చిన రైతులతో ఆడుకున్నాడు.

భూములిచ్చిన రైతులకు 63,410 రెసిడెన్సియల్, కమర్షియల్ ప్లాట్లు చంద్రన్న ఇచ్చారు. భూములు బెదిరించి కొనుగోలు చేస్తే కేటాయించిన ప్లాట్లలో దళితుల పేర్లు వుండవు కదా. నీకు దమ్ము, ధైర్యం ఉంటే రాజధానికి భూములిచ్చిన దళిత రైతుల పేర్లు సీఆర్డీఏ రికార్డుల్లో లేవని నిరూపంచగలవా? దళిత రైతుల విజ్ణప్తి మేరకే నాడు చంద్రబాబు నాయుడు జీవో నంబర్ 1 కి అనుబంధంగా 41 జీవో తెచ్చారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు రిజిస్ట్రేషన్ భూములకు ఇచ్చినట్లుగానే అసైన్డ్ భూములకు కూడా పరిహారం అందించాం.

అసైన్డ్ భూములకు సంబంధించి దళితులకు న్యాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబునాయుడు.రాజధానికి భూములిచ్చిన రైతులకు పెన్షన్, వార్షిక కౌలు ఇవ్వకుండా రాజధానికి భూములిచ్చిన దళిత రైతులను వేధిస్తున్నారు.వారికి దక్కాల్సిన కౌలు, పెన్షన్ వెంటనే ఇవ్వాలి.ఎస్సీల నోట్లో మట్టికొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీ. నిత్యం దళితులను అవమానించే విధంగా పిచ్చి చేష్టలకు పాల్పడితే ఎస్సీల చేతుల్లో బడితపూజ తప్పదని గుర్తు పెట్టుకోవాలని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు

LEAVE A RESPONSE