Suryaa.co.in

Andhra Pradesh

ఇవి సిద్ధం సభలు కాదు-అబద్ధాల సభలు

– జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైంది
-మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

జగన్ నాయకత్వంలో రాష్ట్రం వంచనకు గురైందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ..

మళ్లీ మోసానికి ఒడిగట్టిన జగన్

మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో మళ్లీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి సిద్ధమయ్యారు. కొత్త మేనిఫెస్టో విడుదల చేసేముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలుచేశారో తెలపాలి. 17 శాతం కన్నా ఎక్కువ హామీలు అమలు చేసివుంటే మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో ప్రూ చేయాలి. బీసీ సబ్ ప్లాన్ నిధులను మీరు దారి మళ్లించలేదా?

రైతాంగం నడ్డివిరిచింది వైసీపీ ప్రభుత్వం కాదా? కార్పొరేషన్ లను, మద్యాన్ని తాకట్టు పెట్టి 8 లక్షల కోట్లు అప్పెందుకు చేశారు? ఏవర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలి. సామాజిక న్యాయం చేసి ఉంటే సుధాకర్, చంద్రయ్యలు చనిపోయివుండేవారేకాదు. ఉద్యోగ సంఘాలకు న్యాయం చేయకపోగా.. వారిని సారా కొట్ల వద్ద కాపలా ఉంచారు. జగన్ కు విశ్వసనీయత లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయి

వైసీపీ మేనిఫెస్టో బైబిల్ కన్నా గొప్పదని చెప్పి తుంగలో తొక్కాడు

ఎన్నికలకు ముందు జగన్ కు మేనిఫెస్టో అంటే బైబిల్ కంటే గొప్పదని, ఖురాన్ కంటే మహోన్నతమైనదని, భగవద్గీతకంటే అమూల్యమైనదన్నారు. అధికారం వచ్చాక మేనిఫెస్టోను 17 శాతం కంటె ఎక్కువ అమలుపరచలేదు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పి మాటా తప్పారు, మడమ తిప్పారు,

నేనొస్తున్నా, నేను చూస్తున్నా అన్న జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేశారో తెలపాలి. కొత్త మేనిఫెస్టోతో ప్రజల్ని మాయ చేయడానికి వస్తున్న జగన్ ను ప్రజలు నమ్మరు. వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ప్రజలను మోసం చేశారు. రేపు సిద్ధం సభలో కొత్త మేనిఫెస్టో గురించి మాట్లాడబోయే ముందు పాత మేనిఫెస్టో ను ఏవిధంగా అమలు చేశారో చెప్పాలి.

నాల్గవ రాజధాని హైదరాబాద్ అని సుబ్బారెడ్డి చెప్పడంలో అర్థమేంటి?

మూడు ముక్కలాట తరువాత నాలుగవ రాజధాని హైదరాబాద్ అని సుబ్బారెడ్డి చెప్పిన మాటలు ఎవరిని మోసం చేయడానికో తెలపాలి. ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ ను నాశనం చేశారు. రివర్స్ టెండర్ ద్వారా ఏం సాధించారు? నిజం చెబితే జగన్ తల వెయ్యి ముక్కలౌతుందని శాపమేమైనా ఉందా? జగన్ ఒట్టి అబద్దాల పుట్ట. ఎన్నికలకు ముందు బీసీలకు మూడు వంతుల బడ్జెట్ కేటాయిస్తానన్నావు. కేటాయించావా? 150 కార్పొరేషన్ లను ఏర్పాటు చేస్తానన్నావు, వేసిన కార్పొరేషన్ కార్యాలయాల్లో కూర్చోవడానికి ఛెయిర్ లు కొనుక్కోవడానికి కూడా నిధులివ్వలేదు.

బీసీల జీవన విధానాన్ని మారుస్తానని.. నీ జీవితాన్ని మార్చుకున్నావు

ఎన్నికలకు ముందు బీసీల అభివృద్ధికి కృషి చేస్తాను, వారి జీవిన విధానం మారుస్తానని హామీ ఇచ్చావు. వారిని పూర్తిగా వంచనకు గురి చేశావు. రాజ్యంగ బద్దంగా బీసీలకు కేటాయింపబడిన నిధులను పక్కదారి పట్టించిన నాయకత్వం జగన్ ది కాదా? ప్రాజెక్టులు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, ప్రతి జనవరికి ఒక మెగా డీఎస్సీ వేస్తానన్నావు.. ఏదీ?

నిరుద్యోగ యువతీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించావా? సీపీఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకోలేకపోయారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ పై అవగాహన లేదని మాట మార్చారు. సీపీఎస్ పై ఆరోజుల్లో చంద్రబాబును రెచ్చగొట్టారు. ఆరోజుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా జరిగింది. ‘ఒక్క ఛాన్స్’ అని అధికారంలోకి వచ్చారు. ఏరోజైనా ఉపాధ్యాయులకు న్యాయం చేశారా? ఉద్యోగస్థులను తీరని మోసం చేశారు.

చంద్రబాబు హయాంలో ఉద్యోగస్థులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు

చంద్రబాబు హయాంలో 43 శాతం ఫిట్ మెట్ ఇచ్చాం. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నా.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగస్థులను భాగస్వామ్యం చేశారు. జగన్ ఏ ఉద్యోగ సంఘానికి న్యాయం చేశావో చెప్పాలి. విద్యా విధానాన్ని సర్వ నాశనం చేశారు. నాడు-నేడు పేరుతో మొత్తం అవినీతిమయం చేశారు.

30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చానన్నారు. అందులో అంతా అవినీతే. చంద్రబాబు హయాంలో ఏపీ షేర్ వాల్ టెక్నాలజీ కింద, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సామాన్య మానవుడు కూడా ఇలాంటి ఇంట్లో ఉండగలడనే మనో ధైర్యం కలిగేలా టిడ్కో ఇళ్లను కట్టించారు. దాన్ని మసిపూసి మారేడుకాయ చేశారు. పేదలకు అందకుండా చేశారు.

పేదల సెంటు స్థలంలో అవినీతి

పేదలకు సెంటు స్థలం ఇస్తానని చెప్పి 44 గజాలు మాత్రమే ఇచ్చి మోసం చేశారు. జగన్ ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాల కోసం అప్పులు తీసుకుని పేదలు అప్పులపాలయ్యారు. 5 నుండి10 రూపాయల వడ్డీతో అప్పులు తెచ్చుకొని ఇళ్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే.. కట్టుకోలేక సర్వం నష్టపోయారు. ఎన్నిళ్లు పూర్తయ్యాయో చెప్పాలి. సంవత్సరానికి 5 లక్షల ఇళ్లన్నావు. 5 వేల ఇళ్లన్నా పూర్తయ్యాయా? మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన ఏ ఆధారంగా పూర్తయిందో చెప్పగలిగిన శక్తి, సమర్థత మీకు లేవు.

సిద్ధం సభల్లో మేనిఫెస్టో గురించి మాట్లాడే దమ్ము లేదు

ప్రభుత్వానికిగానీ, మీ నాయకులకుగానీ మేనిఫెస్టోపై మాట్లాడే దమ్ము లేదు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు రేపు జరిగే సభలో మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారో చెప్పండి. కనీసం 17 శాతం కూడా అమలు చేయలేదు. కాదని చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? ఈ ఎన్నికల హామీని నేను అమలు చేశామని చెప్పగలిగే ధైర్యముంటే రండి. రేపు సిద్ధం సభలో మీరు చెప్పగలిగిన ధైర్యముంటే నిజంగా మీరు ప్రజలకు బాధ్యుడనుకుంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది.

తల్లి, చెల్లికి అన్యాయం చేశారు . బాబాయి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడుకున్నరోజు నుంచే జగన్ పతనం ప్రారంభమైంది. సునీతా రెడ్డి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా జగన్ రెడ్డి! సమాధానం చెప్పలేనప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదు. తప్పుకుంటే సంతోషం, లేకుంటే తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని సీఎంగా, చరిత్ర హీనుడిగా నిలిచిపోతావని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు.

 

LEAVE A RESPONSE