– బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకి అన్యాయం
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 724 టీఎంసీలు కాగా, బీఆర్ఎస్ హయాంలో 1,254 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం సహకరించింది. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల రూ.68 వేల కోట్ల అదనపు భారం పడింది. ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా?” అని ప్రశ్నించారు.
తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరారు.
ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవివాదాల పరిష్కార నిబంధనలకు, జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాలకు, అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని..ఈ అంశంపై తమ అభ్యంతరాలను వివరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు ఇప్పటికే లేఖలు రాశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు తమ వద్దకు రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని పాటిల్ చెప్పారు. చట్ట ప్రకారమే ముందుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ఉల్లంఘనలను తాము రాసిన లేఖల్లో సమగ్రంగా వివరించామని, చట్టవిరుద్ధమైన పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తాము భావించడం లేదని, ఒకవేళ తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం ఎంతవరకైనా పోరాడతామని హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.