Suryaa.co.in

Andhra Pradesh

సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?

– అయిన వాళ్లచే ఛీ కొట్టించుకుంటున్న జగన్
– విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ హానీ జరిగినా దానికి జగన్ దే బాధ్యత
– సొంత బాబాయిని చంపిన అబ్బాయికి తల్లి, చెల్లి ఓ లెక్కా అని ప్రజలు భావిస్తున్నారు
– శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు

జగన్ రెడ్డి పాపం పండింది. అధికారం కోసం ఆయన చేసిన పాపాలే నేడు శాపాలుగా మారి జగన్ మెడ చుట్టు బిగుసుకుంటున్నాయి. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెళ్లే జగన్ రెడ్డి నేరాలు, ఘోరాల గురించి చెబుతున్నారు. ఆయన సీఎంగా అనర్హుడని వాళ్లే అంటున్నారు. జగన్ రెడ్డి 420 అని నిన్న వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

వంచన, నమ్మకద్రోహంతో మహిళా ద్రోహిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మహిళా లోకం సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ రెడ్డి లాంటి క్రూర మనస్థత్వం గల నాయకుడు ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగలేరు. ఆయన వ్యవహార శైలిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతుంది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆయన విపరీత ధోరణితో తలవంపులు తెచ్చిన మాట నిజం.

పులివెందులలో సొంత చెల్లెలు సునీతారెడ్డి సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం మహిళలను అవమానించడం కాదా? సొంత కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఉద్ధరిస్తారు? సునీతారెడ్డి, వైఎస్ షర్మీలాలు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముందా? ఎందుకు నోరు మెదపటంలేదు? అన్నకి ఓటు వేయొద్దని సొంత చెల్లెలే చెప్పిందంటే అర్థం ఏంటి? విలువలు, విశ్వసనీయత అంటూ పదే పదే మాట్లాడే జగన్ రెడ్డి ఎందుకు స్పందించటం లేదు?

సొంత బాబాయిని దారుణంగా చంపిన హంతకులకు వంతపాడి న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్లపై విష ప్రచారం చేయటమే మీ విశ్వసనీయతా? ఆఖరికి సొంత చెల్లి పుట్టుక మీద కూడా తప్పుడు ప్రచారం చేయిస్తున్న నీ లాంటి అన్న బహుశా ఏ చెల్లికి ఉండకూడదేమో? సొంత చెల్లెళ్లే న్యాయం చేయలేని వాడిని రాష్ట్ర మహిళలకు ఏం చేస్తావని సగటు నారీమణి నిన్ను ప్రశ్నిస్తుంది జగన్ రెడ్డి? దమ్ముంటే సమాధానం చెప్పు.

మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యం
స్వర్గీయ ఎన్టీరామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించడంతోపాటు రిజర్వేషన్లను కూడా ఇచ్చి ప్రోత్సహిస్తే.. చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాల ఏర్పాటు ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం లభించేలా అవకాశాలు కల్పించారు. మహిళల రాజకీయ, ఆర్తిక, సామాజికాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. జగన్ రెడ్డి చర్యలతో మహిళల భద్రత గాలిలో దీపమైంది.

మహిళా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా రద్దు చేసి మహిళలకు జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశాడు. మహిళల ప్రగతిని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో అధికారంలోకి రాగానే మహాశక్తి, ఆడబిడ్డ నిధి, పూర్ టు రిచ్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తాం.

LEAVE A RESPONSE