Suryaa.co.in

Telangana

ఏం సాధించారని రైతు సంబరాలు?

– ఇది ఎన్నికల స్టంట్ గానే రైతులు చూస్తున్నారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: రైతుల్ని నిండా ముంచి నమ్మించి మోసం చేసినందుకు సంబరాలు చేసుకోవా లా రేవంత్ రెడ్డి ? ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారు? రైతును రాజును చేయాలన్న ఉద్దేశ్యంతో పంటకు పెట్టు బడి సాయంగా కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారభించారు.

కేసీఆర్ గత 9 ఏండ్లలో రైతు బంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో 11 విడతల్లో సుమారు 75,000 కోట్లు జమ చేసాడు. కానీ ఏనాడు మీలాగా ఇంత హంగామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7500 కాకుండా 5000 ఇచ్చి, రెండో విడత పూర్తిగా ఎగ్గొట్టి, మూడో పంటకు 4 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా ?

సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా ? అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు అని మాటమార్చి బోనస్ ఎగ్గొట్టినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్ ఆటకెక్కించినందుకా ? రైతు భీమా ప్రీమియం కట్టనందుకా ? కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇంకా అమలు చేయనందుకా ? రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా రైతు నడ్డి విరుస్తున్నందుకా ?

నాడు కేసీఆర్ పరిపాలనలో వ్యవసాయం పండగ అయితే…రేవంత్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయం దండగ అయినందుకా ? నీ సంవత్సరన్నర పరిపాలనలో 500 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా ? నీ పరిపాలనలో పండించిన ధాన్యం సకాలంలో అమ్ముకోలేక కల్లాల పై పిట్టల్లాగా రైతులు రాలిపోయినందుకా ? ఎందుకు చేసుకోవాలి సంబరాలు రేవంత్ రెడ్డి ?

కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా వేసి సంబరాలు చేస్తున్నావు. రైతు సంబరాల్లో పిలిచిన రైతులెవ్వరు పాల్గొనటం లేదు. ఇది ఎన్నికల స్టంట్ గానే రైతులు చూస్తున్నారు

ఇప్పటికైనా సంబరాల పేరిట ఎన్నికల డ్రామాలు ఆపి రైతుల కిచ్చిన హామీలు నెరవేర్చు. ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలి. అందరూ రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయాలి.అన్ని రకాల వడ్లకు పాత సీజన్ లతో సహా రూ. 500 బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి అని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE