మోడీ గారూ.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ ఏమైంది?

– ప్రధాని మోడీ మాటలు నీటి మూటలే
– మోడీ హయాంలో మరింత దిగజారిన రైతుల ఆదాయం
– న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలుగా మారాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఆరేళ్ళ క్రితం హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైంది అని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల స్థితిగతులను, కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల ఆదాయం విషయం పట్టించుకున్న పాపాన పోలేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మాటలు అమలు కావడం లేదన్న విషయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నివేదికతో స్పష్టం చేసిందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరితో దేశంలో రైతుల ఆదాయం మరింత దిగజారిపోయిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గత కొంతకాలంగా పలు రూపాల్లో టీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు.
రానున్న రోజుల్లో వరి ఆందోళన కార్యక్రమాలు ఎలా ఉండాలో పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్ధేశం చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పుష్కలంగా నీళ్లు, విద్యుత్ అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప నాయకులు కేసీఆర్ అని వినోద్ కుమార్ వివరించారు.

 

Leave a Reply