Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబును ప్రశ్నించే అర్హత ఎమ్మెల్యే కొడాలి నానికి ఎక్కడిది?

– ముఖ్యమంత్రి అయ్యే అర్హత చంద్రబాబుకు మాత్రమే ఉంది
– ప్రజల మద్దతుతో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు
– నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీకి పూర్వ వైభవం తథ్యం
– రాష్ట్ర ప్రజలను నమ్ముకుని రాజకీయం చేస్తున్న తెలుగుదేశం
– టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

గుడివాడ, అక్టోబర్ 11: రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత చంద్రబాబుకు మాత్రమే ఉందని, చంద్రబాబును ప్రశ్నించే అర్హత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. గుడివాడ పట్టణంలో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబుకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రజల మద్దతుతోనే 14 ఏళ్ళ పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నారని తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజమని, 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు జరిగిన 2014 ఎన్నికల్లో ఎందుకు ఓటమి పాలైందో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. రాష్ట్ర ప్రజలను నమ్ముకుని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని చెప్పారు. నారా లోకష్ కు తెలుగుదేశం పార్టీని అప్పగించేందుకు ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారంటూ చేస్తున్న విమర్శలను కొట్టిపారేశారు.

లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తథ్యమన్నారు. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఈ పాదయాత్రను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిందని అన్నారు. అయితే జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే మహా పాదయాత్ర చేస్తున్నారంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు.

200 ఏళ్ళకు కూడా అమరావతిని చంద్రబాబు కట్టేది లేదంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ భూములు, నిర్మాణాల ముసుగులో రిషికొండలో ఏం జరుగుతుందో విశాఖ ప్రజలకు తెలుసని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు, మీడియాను దుర్భాషలాడితే అబద్ధాలు నిజాలు అయిపోవనే విషయాన్ని గుర్తించాలని శిష్ట్లా లోహిత్ సూచించారు.

LEAVE A RESPONSE