Suryaa.co.in

Andhra Pradesh

మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు?

– సనాతన ధర్మాన్ని అవమానించేలా రోజురోజుకు కుట్రలు
– రేవంత్ కు ఆరోజున మతి ఉంటే.. ఈరోజు ఎక్కడపోయింది?
– బీఆర్ఎస్ ను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్
– కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో మాటమార్చింది
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి కోరకపోవడం తెలంగాణ ప్రజలను దగా చేయడమే
భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు

జనవరి 22న అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ ప్రపంచంలోని భారతీయులు, హిందువులు వేచిచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ, సమన్వయంతో ప్రపంచంలోనే అద్వితీయమైన, మహత్తరమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగనుంది.

ఈ సమయంలో కాంగ్రెస్ సహా తమ భాగస్వామ్యపక్షాలైన I.N.D.I కూటమి కుట్రపూరిత రాజకీయాలకు తెరదీశాయి. దేశ వ్యాప్తంగా ప్రజలను రెచ్చగొట్టి శాంతియుత వాతావరణాన్ని భంగపరుస్తున్నాయి. హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేలా పత్రికా ప్రకటనలతో ప్రజల్లో అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేలా వ్యవహరిస్తున్నాయి.

టిప్పు సుల్తాన్ కు మద్దతుగా మాట్లాడే కాంగ్రెస్ నాయకులు ఆరాధ్యదైవం శ్రీరాముడికి వ్యతిరేకంగా మట్లాడుతున్నారు. శ్రీరాముడి విషయంలో, సనాతన ధర్మాన్ని అవమానించేలా రోజురోజుకు కుట్రలు పెరుగుతున్నాయి.

ఒకవేళ కాంగ్రెస్ కు వీటన్నింటితో సంబంధం లేకుంటే.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? దేశ వ్యతిరేక శక్తులు, కాంగ్రెస్ నాయకులు చేసే కుటిలప్రయత్నాలను పూర్తిగా అణచివేసేలా భారత ప్రధాని గొప్ప ప్రకటన ఇచ్చారు. జనవరి 22న దేశ ప్రజలందరూ ప్రతి ఇంటా రామజ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలని, ఆలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగున్నాయి. హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు వస్తున్నప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించకపోవడం యావత్ హిందూ సమాజాన్ని అవమానించడమే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపుతూనే, ప్రజల మధ్య అంశాలను చర్చిస్తున్నాం.

ప్రభుత్వంలోకి రాకముందు.. ప్రస్తుతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఆగస్టు 29,.2019 న ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది. సీబీఐ ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది.
డిసెంబర్ 7, 2021 న రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై కేంద్రం ఎందుకు సీబీఐ దర్యాప్తు జరపడం లేదని నాడు రేవంత్ ప్రశ్నించారు .

నవంబర్ 4న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
మే 4, 2021న శామీర్ పేట్ (మం) దేవరయంజాల్ గ్రామంలో సీతారామస్వామి ఆలయ భూ ఆక్రమణలపై విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 19, అడ్వొకేట్ వామన్ రావు దంపతుల మర్డర్ కేసులో సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మరి, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తుపై గజదొంగ అంటూ మాట్లాడుతున్నారు. మరి రేవంత్ కు ఆరోజున మతి ఉంటే.. ఈరోజు ఎక్కడపోయింది? బీఆర్ఎస్ ను బెదిరించి మ్యాచ్ ఫిక్సింగ్ తో రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ మేనేజ్ మెంట్ చేస్తోందా..?

సీబీఐ వస్తే తమ వ్యక్తిగత రాజకీయాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అవకాశం ఉండదు కాబట్టే.. కాంగ్రెస్ తమ లైన్ ను మార్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో దర్యాప్తు జరపాలని భారతీయ జనతా పార్టీ నాటి నుంచి చెబుతూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ తొలి క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తారని భావించాం.

కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో మాటమార్చింది. బీజేపీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఏమాత్రం వ్యతిరేకం కాదు.. కాని… మనీ ట్రాకింగ్, మరియు ఇతర అవకతవకల విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించగలిగేది కేవలం సీబీఐ మాత్రమే. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు CBI ని ఆహ్వానిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని కోరాలి అని వారు డిమాండ్ చేశారు..

కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి కోరకపోవడం తెలంగాణ ప్రజలను దగా చేయడమే. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు కోరాలని డిమాండ్ చేస్తున్నాం.బీఆర్ఎస్ అవినీతిని పూర్తిగా వెలికితీసేవరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ వెంబడిస్తుంది. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. అభివృద్ధి జరగాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఫార్మాసిటీనిరద్దు చేస్తామని చెప్పారు.. డిసెంబరు 31న ఆ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి యూ టర్న్ తీసుకోవడంలో మతలబు ఏంటి? ఇది సెటిల్ మెంట్ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ గానే ప్రజలు భావిస్తున్నారు. యూపీఏ హయాంలో లక్షల కోట్లు కుంభకోణాలు జరిగాయి. భారతదేశ కీర్తిని అప్రతిష్టపాలు చేసేలా రాహుల్ గాంధీ.. అదానీ విషయంలో భారత ప్రధానిని, ప్రభుత్వాన్ని విమర్శించారు.

సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కు మొహం చెల్లని పరిస్థితి ఎదురైంది. కేవలం భారత ప్రధానిని అప్రతిష్టపాలు చేసేందుకే కుట్రపూరిత ప్రచారం చేశారని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైంది. అదానీ కంపెనీతో కాంగ్రెస్ పెట్టుబడులు తీసుకొస్తే అభివృద్ధి… నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొస్తే దోపిడీ ఎలా అవుతుంది? అదానీ దోపిడీకి, అవినీతికి, గుత్తాధిపత్యానికి ప్రతీక అయితే.. అటువంటి అదానీ కంపెనీతో లావాదేవీలు జరుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి? కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజాదర్భార్ పెడతామన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. బీఆర్ఎస్ అవినీతిని వెలికితీసేంత వరకు బిజెపి ఊరుకోదు. అవిశ్రాంత పోరాటం చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్దుబాటు చేసుకునేలా, ఒకరికొకరు కప్పిపుచ్చుకునేలా రాజకీయాలకు తెరదీస్తున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాలను ప్రజలు ధ్వంసం చేయక తప్పదు. తెలంగాణలో సెటిల్ మెంట్ రాజకీయాలకు సహించేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తోంది.

మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ గారు, కట్టా సుధాకర్ గారు, టి. కృష్ణ ప్రసాద్ గారు, సోలంకి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE