Suryaa.co.in

Telangana

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డినీ విచారిస్తారా?

– మహేందర్‌రెడ్డి చెబితేనే ట్యాపింగ్ చేశామన్న ప్రభాకర్‌రావు?
– ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ?
– బండి సంజయ్‌కూ సిట్ పిలుపు
– వాంగ్మూలం ఇవ్వాలని సంజయ్‌కు ఫోన్
– మీ ఫోన్ ట్యాప్ అయిందని బండికి సిట్ వెల్లడి
– సమయం చూసుకుని వస్తానన్న సంజయ్?
– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొత్త మలుపు

హైదరాబాద్ : దేశంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
బీజేపీ జాతీయ నాయకుల ఫోన్లను కూడా నాటి కేసీఆర్ సర్కారు ట్యాపింగ్ చేసిందని, సిట్ విచారణలో వెల్లడయిన నే పథ్యంలో.. ఇప్పటి హోం శాఖ సహాయమంత్రి, నాటి ఎంపి బండి సంజయ్ ఫోన్లు కూటా ట్యాపింగ్ అయినట్లు సిట్ గుర్తించింది.

ఆ మేరకు ఆ సమాచారాన్ని బండి సంజయ్‌కు తెలిపి, ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు సమయం ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఆయనకు ఫోన్ చేయడంతో ఫోన్ ట్యాపింగ్ కథ కొత్త మలుపు తిరిగినట్టయింది. అయితే తగిన సమయం చూసుకుని విచారణకు వస్తానని, సంజయ్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ సర్కారు తన కుటుంబసభ్యులు, తన సిబ్బంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తోందని నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు సిట్ స్వయంగా ఆయననే పిలిచి, వాంగ్మూలం ఇవ్వాలని కోరడంతో, బీఆర్‌ఎస్‌కు చిక్కులు తప్పకపోవచ్చంటున్నారు.

ఇదే కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు సైతం.. నాటి డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్ చేశామని, సిట్ అధికారుల ముందు వెల్లడించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని కూడా విచారించడం అనివార్యమంటున్నారు.

తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. 2023 నవంబర్‌లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప.. మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్‌లో ట్యాపింగ్‌కు గురైన నెంబర్లు ఉన్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా పెడుతున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉండగా.. తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే పని చేశానని ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐదో రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు. విచారణలో ప్రభాకర్ రావును ప్రశ్నిస్తూ ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సిట్ అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఐదు రోజులు, గంటల పాటు విచారణ జరిపినప్పటికీ చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం వల్లనే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న రిలీఫ్‌పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది.

పోలీస్ ఆఫీసర్ కావడంతో సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అధికారి, ప్రిన్సిపల్ సెక్రెటరీలను కూడా సిట్ విచారణ జరిపి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరూ తనకు తెలియదని.. అప్పటి డీజీపీ ఆదేశిస్తేనే ఫోన్‌ట్యాప్ చేసినట్లు చెబుతున్నారు ప్రభాకర్ రావు.

ఈ క్రమంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించి.. స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్లు ఆధారాలు సిట్ సేకరించింది .

LEAVE A RESPONSE