– ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా ?
ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలి
– శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: మూసీ నది విషయంలో డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వ ఆశ్రయించినట్లు నిర్ధిష్టమైన సమాచారం ఉంది మాకు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా ? డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఈ రోజు సభకు చెప్పింది. ఏ తేదీన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సాయం కోరుతూ ప్రతిపాదనలు పంపించింది?
మూసి కోసం రూ 14,100 కోట్ల వ్యయం అవుతుందని, నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏ ప్రాతిపదికన అడిగారు? ఒక వేళ కేంద్రాన్ని సాయం కోరడం, ప్రపంచ బ్యాంకు సాయం కోరడం వాస్తవమైతే సభను, ప్రజలను ఎందుకు తప్పదోవపట్టిస్తున్నారు ? సభను తప్పదోవ పట్టిస్తే అవసరమైతే… ప్రివిలేజ్ మోషన్ ను ప్రవేశపెడతాం. మూసీ నదిగర్భంలో నివసించే 309 కుటుంబాలు వాళ్లంతట వాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది.
కానీ హృదయవిదారకమైన వీడియోలను చూస్తే ప్రభుత్వం చెబుతున్నది అవాస్తవమని స్పష్టమవుతోంది. ఆ 309 కుటుంబాలు సమ్మతిస్తూ ఏవైనా పత్రాలపై సంతకాలు చేసి ఉంటే అవి సభకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 181 కుటుంబాలు తామంతట తామే కూల్చేసుకొని వెళ్లిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఇది వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంది. మూసీ నిర్వాసితుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించాలి. కూలగొట్టిన ఇళ్లకు ఉంటే ఈఎంఐలను ప్రభుత్వం చెల్లిస్తుందా ?