Suryaa.co.in

Andhra Pradesh

స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు

-ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరం
-వైసీపీ నేతల స్మగ్లింగ్ కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసింది
– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరని చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా కె.వి.పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు.

ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులను స్మగ్లర్లు తమ వాహనంతో ఢీ కొట్టారు. ఈ క్రమంలో వారిని అడ్డుకోబోయిన 14వ బెటాలియన్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెందడం బాధాకరం అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే…వ్యవస్థలు ఎలా మనగలుగుతాయని చంద్రబాబు ప్రశ్నించారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమిస్తుంటే వాళ్లు పోలీసులను ఏం లెక్క చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

తెలుగుదేశం ప్రభుత్వంలో ఎర్రచందనం దొంగలపై నాడు కఠినంగా వ్యవహరించామన్నారు. ఎర్రచందనం వైపు స్మగ్లర్లు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. నాడు స్మగ్లింగ్ ను అరికట్టడం కోసం పటిష్టంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్ ను ఈ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. వ్యవస్థలు గాడి తప్పినప్పుడు అందులో అందరూ బాధితులే అవుతారని…ఇప్పుడు గణేష్ మృతికి ఈ అధికారులు, ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు.

పోలీసులపై ఎర్రచందనం దొంగలు దాడులు చేయడం, ప్రాణాలు తీయడం రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని…ఎర్ర చందనం స్మగ్లర్లపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE