Suryaa.co.in

Andhra Pradesh

అథోగతి పాలైన వ్యవసాయ రంగంపై చర్చించే ధైర్యం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు

• వాస్తవాలు బయటకొస్తే రైతులు తనను, తన ఫ్రభుత్వాన్ని ఛీ కొడతారన్న భయంతోనే జగన్ రెడ్డి టీడీపీ వాయిదా తీర్మానంపై చర్చ లేకుండా చేశాడు
• రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంటే, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలోఉంది
• ఇక రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో ఏపీ ఏకంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది
• జగన్ రెడ్డి వచ్చాక ఒక్కో రైతుకుటుంబంపై రూ.2.45లక్షల కోట్ల అప్పులభారం వేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు
• వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు 4వేలకు పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు
• రైతు సమస్యలపై ఉభయ సభల్లో గంటసేపు చర్చకు కూడా ఇష్టపడలేదంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రైతుద్రోహులు కాక ఏమవుతారు?
– సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
– రైతుల సమస్యలు, ఇరిగేషన్ రంగంపై చర్చించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదని తేలిపోయింది : టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

“ సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగం, నిర్వీర్యమైపోయిన సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడం చూస్తే, రైతుల సమస్యలపై, ఇరిగేషన్ రంగం దుస్థితిపై చర్చించడానికి జగన్ సర్కార్ ఇష్టపడ టం లేదని తేలిపోయింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన మొత్తం వ్యవసాయరంగ వ్యతి రేక విధానాలతో ముందుకు సాగింది అనేది కాదనలేని వాస్తవం.

కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంటే, రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉండటాన్ని బట్టే జగన్ ప్రభుత్వం ఎంతటి రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాలపై ఉన్న అప్పుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందువరసలో ఉంది. రాష్ట్రంలోని ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది.

తెలంగాణ ప్రభుత్వం 2022-23లో 1.31కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 49.54లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది
టీడీపీప్రభుత్వం ఉచితంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే, జగన్ రెడ్డి దాన్ని ఎత్తేసి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్రప్రభుత్వ నిబంధనలకు తలొగ్గి, రైతుల మెడలకు ఉరి తాళ్లు బిగించడానికి సిద్ధపడ్డాడు. ఏటా ప్రతి రైతుకి రూ.13,500లు ఇస్తానన్న జగన్ రెడ్డి చివరకు అధికారంలోకి వచ్చాక కేవలం రూ.7,500లతో సరిపెట్టాడు. జగన్ రెడ్డి నిర్వాకంతో ఒక్కోరైతు సంవత్సరానికి రూ.6వేల చొప్పున, ఐదేళ్లలో రూ.30వేలు నష్టపోయాడు. ధాన్యం కొనుగోళ్లలో కూడా జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది.

2022-23 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 1.31 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం 49.54 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేసింది. ధాన్యాగారంగా పిలవబడే గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతుల్ని దోచుకున్నారు. 75 కేజీలకు అదనంగా 10కేజీల ధాన్యం ఇస్తేనే కొంటామనే నిబంధన పెట్టి, రైతు ల కష్టాన్ని వైసీపీనేతలు దోచుకున్నారు. తేమఎక్కువని, రంగు మారిందని.. ఇతర సాకులు చెప్పి మరీ రైతుల కష్టాన్ని దోచేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కి తన శాఖలో ఏం జరుగుతోందో తెలియదు గానీ, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి దోపిడీ లేదని సమర్థించుకున్నాడు.

సాధారణంగా రైతులు ధాన్యం అమ్ముకుంటే వారికి డబ్బులు వస్తాయి. కానీ జగన్ రెడ్డి రైస్ మిల్లుల ద్వారా కొనుగోళ్లు జరిపి, ముందు ధాన్యం తీసుకొని, తరువాత ఎప్పుడో రైతులకు డబ్బులు చెల్లించే దుస్థి తి తీసుకొచ్చాడు. జగన్ రెడ్డి గొప్పగా చెబుతున్న రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయి. ఉచిత పంటలబీమా అందిస్తానని చెప్పి రైతుల్ని మోసగించిన జగన్ రెడ్డి, చివరకు ప్రభుత్వం తరుపున చెల్లించాల్సిన సొమ్ము కూడా చెల్లించకుండా రైతుల్ని నిండా ముంచేశాడు.

ప్రకృతి విపత్తులు, తుఫాన్ల వల్ల నష్టపోయిన రైతులకు పైసా కూడా ఇన్ పుట్ సబ్సిడీ సాయం అందించలేదు . వాస్తవంగా రైతులు ప్రకృతి విపత్తుల వల్ల రూ.30వేలకోట్ల విలువైన పంట ఉత్ప త్తులు నష్టపోతే, జగన్ రెడ్డి ప్రభుత్వం వారికి కేవలం రూ.2వేలకోట్ల సాయంతో సరిపెట్టింది. దశాబ్దాల నుంచి రైతులకు సేవలందిస్తున్న సహకార డెయిరీలను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి, తన కమీషన్ల కక్కుర్తితో అమూల్ వంటి సంస్థలను తెరపైకి తెచ్చాడు. లీటర్ పాలకు రూ.4ల బోనస్ ఇస్తానని చెప్పి పాడి రైతుల్ని వంచించాడు.

ఆక్వా రైతులు ఏకంగా రాష్ట్రంలో హాలిడే ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వంలో ఆక్వాసాగు, ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆక్వా రైతుకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1కే చంద్రబాబు అందిస్తే, జగన్ రెడ్డి ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ అనే నిబంధనలు పెట్టి, లక్షల్లో ఉన్నఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఎత్తేసి మొత్తం ఆక్వారంగాన్నే నాశనం చేశాడు. మరోపక్క ఈ ప్రభుత్వంలో ఆక్వా సీడ్ ఫీడ్ ధరలు భారీగా పెరిగాయి.
పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ రెడ్డి గోదాట్లో ముంచేశాడు

చంద్రబాబునాయుడు సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని 72శాతం పూర్తిచేశారు. సాగు విస్తీర్ణం పెంచడం కోసం పట్టిసీమను నిర్మించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాగునీటి రంగం పూర్తిగా పడకేసింది. పోలవరం పనులు ఎక్కడివక్కడ నిలిపేసి, చివరకు జాతీయప్రాజెక్ట్ ను గోదాట్లో ముంచేశారు. ఇలాంటి వాస్తవాలు బయటకు వస్తే, రైతులు తనను ఛీ కొడతారన్నభయంతోనే జగన్ రెడ్డి టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరక్కుండా చేశాడు.

తనపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి అసహానికి గురైన స్పీకర్, ఆవేశంలో మమ్మల్ని సస్పెండ్ చేశాడనిపించింది
స్పీకర్ ముఖంలో అసహనం..ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన సొంత జిల్లాకు సంబంధించి నేడు పత్రికల్లో వచ్చిన వార్తలు చూశాక, ఆయన తీవ్ర మైన అసహనానికి గురై, ఆప్రభావంతోనే మమ్మల్ని సస్పెండ్ చేశారని అనిపిం చింది.” అని రామానాయుడు తెలిపారు.

60 వేలమంది ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలకు ఇస్తున్నట్టు చెప్పిన ప్రభుత్వం రైతులు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో ఎందుకు చెప్పలేదు? : మంతెన రామరాజు
“ అసెంబ్లీలో నేడు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదు. రాష్ట్ర రైతాంగం సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది? ఆక్వారైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50పైసలకు ఇస్తున్నట్టు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చెప్పిం చింది. ఎంతమందికి ఇస్తున్నారంటే 60వేల మంది ఆక్వారైతులకు అని చెప్పారు కానీ ఇంతకుముందు ఆక్వారైతులు ఎంత విద్యుత్ వాడేవారు..ఇప్పుడు ఎంత వాడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి.

60వేల మంది రైతులు రోజుకి కోటి యూనిట్ల విద్యుత్ వాడుతున్నారా..లేక 30లక్షల యూనిట్ల విద్యుత్ వాడుతున్నారా అనేది చెప్పకుండా మేం రూ.1.50పైసలకే ఇస్తున్నామని ప్రభుత్వం చెప్పుకోవడం బాధాకరం. వాస్తవంగా ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీలు లేక రాష్ట్రవ్యాప్తంగా ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. టీడీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి ఇబ్బందు లు లేవని, వైసీపీప్రభుత్వం వచ్చాకే పాతబకాయిల పేరుతో తమపై అధికంగా విద్యుత్ ఛార్జీల భారం మోపి వేధిస్తోందని ఆక్వారైతులు బోరుమంటున్నారు.

రైతుల పక్షాన టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. పంటకాలువల్ని కూడా బాగుచేయించలేని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం
వ్యవసాయ రంగానికి కానీ, ఆక్వా సాగుకి కానీ పంటకాలువలు చాలా ముఖ్యం. వాటిని ఎప్పటికప్పుడు బాగుచేయాలి. వాటిలోని పూడిక తీయడం.. గుర్రపు డెక్క వంటి వాటిని తొలగించడం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. నీటికాలువలు పూర్తిగా నాచు, గుర్రపుడెక్క, బురదతో నిండి పోవడంతో పొలాలకు, చెరువులకు నీరు అందని పరిస్థితి. ఆక్వాసాగుకి ముఖ్యమైన ఫీడ్, సీడ్ ధరలు భారీగా పెంచారు. ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ ను క్షేత్ర స్థాయిలో అమలుచేయడం సాధ్యంకాదని చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా గుడ్డిగా ముందుకెళ్లింది.

పెరిగిన డీ.వో.ఆర్.బీ ధరల్ని కట్టడిచేయడంలో విఫల మైంది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతో రైతుభరోసా కేంద్రాలు నిర్మించిన జగన్ ప్రభుత్వం, వాటిలో రైతులకు ఎలాంటి సేవలు ఎంతసమయంలో అందిస్తున్నారో చెప్పాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు ఏమీ రైతు భరోసా కేంద్రాల్లో లభించడంలేదు. ఇలాంటి సమస్యలపై రైతుల పక్షాన చర్చించడం కోసం తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే, దానిపై చర్చకు ప్రభుత్వం వెనకడుగు వేసింది.

కేవలం సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలనే ఆరాటంకోసం ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహిస్తోంది తప్ప, నిజంగా ప్రజలు, వారి సమస్యల పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం ఎంత మూర్ఖత్వంగా వ్యవహరించినా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రేపు మరలా మరో అంశం పై వాయిదా తీర్మానం ఇస్తాం.” అని రామరాజు తేల్చిచెప్పారు.

రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడమే జగన్ రెడ్డి వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతి : దువ్వారపు రామారావు
“ రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమే కాకుండా 10మంది టీడీపీ సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నాం. కౌన్సిల్ లోకూడా మేం రైతాంగ సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ అక్కడ కూడా ప్రభుత్వం చర్చ చేపట్టలేదు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలపడమే జగన్ రెడ్డి సాధించిన రైతు ప్రగతి. రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా అందించలేని దౌర్భాగ్యపు స్థి తిలో జగన్ రెడ్డి సర్కార్ ఉంది.

టీడీపీప్రభుత్వం ఆక్వా రైతులకు 50శాతం సబ్సిడీ పై అనేక పరికరాలు అందించింది. అన్నదాతా సుఖీభవ కింద రూ.4వేల కోట్లను చంద్రబాబునాయుడు రైతులకు అందించారు. రైతురుణమాఫీ కింద రూ.15వేల కోట్ల అప్పులు మాఫీ చేయడం ద్వారా చంద్రబాబు రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమా సాయం అందించారు. తమ గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర రైతాంగం సిద్ధంగా ఉంది.” అని రామారావు తెలిపారు.

గంటపాటు రైతుల సమస్యలపై చర్చించమంటే, దానికి కూడా జగన్ ప్రభుత్వం ఒప్పుకోలేదు : బీ.టీ.నాయుడు
“ శాసనమండలిలో టీడీపీ సభ్యులు అందరం రైతుల సమస్యలపై చర్చకు పట్టుబట్టి, వాయిదా తీర్మానం ఇచ్చాం. కౌన్సిల్ ఛైర్మన్ మా తీర్మానాన్ని తిరస్క రించారు. కౌన్సిల్ లో బడ్జెట్ పై చర్చ 11 గంటలకు జరుగుతుంది కాబట్టి, 10 గంటల నుంచి రైతులసమస్యలపై చర్చించాలని తాము కోరితే ఛైర్మన్ కుదరదు అన్నారు.

రైతుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు గానీ, సభా సమయాన్ని గంటలపాటు వృథా చేస్తోంది. దేశంలో అత్యధిక అప్పుల భారం ఉన్నది ఏపీ రైతులపైనే. ఒక్కో రైతు కుటుంబంపై రూ.2.45లక్షల అప్పు ఉంది. దేశంలో మరే రాష్ట్రంలో ఇంత భారీస్థాయిలో రైతులపై అప్పులు లేవు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో 4వేల మంది రైతులు చనిపో యారు. కారణం జగన్ రెడ్డి అతని ప్రభుత్వం అనుసరించిన రైతు వ్యతిరేక విధా నాలే.

జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం రైతు ద్రోహులు
రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు కల్పతరువుల్లా మారాయి. పోలవరం ప్రాజెక్ట్ పై నీటిపారుదల శాఖ మంత్రికి అవగాహన ఉండదు. వ్యవసాయం గురించి సదరు శాఖ మంత్రికి ఏమీ తెలియదు. పౌరసరఫరాల శాఖమంత్రికి ఖరీఫ్, రబీల్లో ఎంత ధాన్యం రైతుల నుంచి వస్తుంది.. ప్రభుత్వం ఎంత కొనాలనేది తెలియదు. ఇలాంటి మంత్రులు రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తారా? జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం ముమ్మాటికీ రైతుద్రోహులనే చెప్పాలి.” అని బీటీ.నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE