Suryaa.co.in

Andhra Pradesh

పెన్షన్ల డబ్బును సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు

-ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర
-అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధులనూ మోసం చేశాడు
-జగన్ రాజకీయ లబ్ధి కోసం టీడీపీ పెన్షన్లు ఆపిందంటూ నీచమైన ప్రచారం
-15 రోజుల్లో రూ.13 వేల కోట్లు మళ్లించి ఖజానా ఖాళీ చేశాడు
-సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదు
-ప్రజాగళం సభలకు వచ్చిన స్పందనతో గెలుపు సూచకంగా కనిపిస్తోంది
-ప్రభుత్వం ప్రజలు కాకతో ఉన్నారు…అందుకే సీఎంకు అడుగడుగునా నిరసనలు
-పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తల టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

అమరావతి : అవ్వాతాత అంటూనే జగన్ వృద్ధులనూ మోసం చేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1వ తేదీన ఇంటి వద్దకు తెచ్చి పెన్షన్ ఇవ్వకపోవడం వెనక వైసీపీ కుట్ర ఉందన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 15 రోజుల్లోనే జగన్ రెడ్డి రూ.13 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని మండిపడ్డారు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ ఇవ్వలేకపోయిన జగన్…ఆ నెపాన్ని తమపై, ఎన్నికల సంఘంపై నెడుతున్నాడని దుయ్యబట్టారు. పార్టీ నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….‘‘పెన్షన్ లపై ప్రభుత్వ అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం. జగన్ కు వచ్చే ఎన్నికల్లో తన ఓటమి అర్థం అయ్యింది…అందుకే ఫేక్ ప్రచారాలు, కుట్ర రాజకీయాలకు స్పీడు పెంచాడు. వృద్ధులు, వికలాంగులకు మానవీయ కోణంలో పెన్షన్ ఇంటి వద్దనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగానే వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టింది.

సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా ఇవ్వలేదు. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయనీయకూడదని టీడీపీ ఎవరినీ కోరలేదు….కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పలేదు. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు…వారితో ఒక్క రోజులోనే ఇంటింటింకీ పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వమే కావాలని ఇవ్వలేదు. ప్రభుత్వ పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు..సొంత కాంట్రాక్టర్లకు జగన్ ఇచ్చుకున్నాడు. తన రాజకీయ లబ్ధి కోసం నడి వేసవిలో వృద్ధులు, వికలాంగులకు కూడా జగన్ ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నాడు.

గ్రామ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో ఎందుకు ఇంటింటికీ పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు.? ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ విషయంలో వైసీపీ ప్రభుత్వ కుట్రలు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. తన రాజకీయ లబ్ది కోసం బాబాయినే చంపేసిన జగన్…ఓట్ల కోసం ఇలాంటి కుట్రలు అనేకం చేయడనుకోకూడదు. మనం వచ్చాక రూ.4 వేల పెన్షన్ ఇంటింటికీ ఇస్తాం….రెండు మూడు నెలలు తీసుకోకపోయినా అన్నీ కలిపి ఇస్తాం. ఈ అన్ని విషయాలు లబ్ధిదారులకు వివరించండి. ప్రభుత్వం గత 15 రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత బిల్లులు ఇచ్చిందో ప్రకటన చేయాలి.

మే 13 తరువాత ఇంటికి పోయే ప్రభుత్వం ఖజానాలో ఉన్న డబ్బునంతా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టి…పేదలకు ఇచ్చే డబ్బులు విషయంలో మాత్రం నాటకాలు అడుతోంది. ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి…..ఎన్నికల సంఘం కూడా ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. జిల్లా నేతలు కలెక్టర్లు, మండల నేతలు తహశీల్దార్లను కలిసి పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పాలి. వాలంటీర్ల విషయంలో మనం స్పష్టంగా ఉన్నాం….వైసీపీ కోసం పనిచేయకండి…మీ భవిష్యత్ ను చూసుకునే బాధ్యత మాది. వాలంటీర్లు ఎన్నికల వేళ తప్పులు చేస్తే వారిపైనా కేసులు పడే అవకాశం ఉంది…వాళ్లూ అప్రమత్తంగా ఉండాలి. జగన్ రాజకీయ క్రీడలో వాలంటీర్ల జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నాడు.

ప్రజాగళం సభలకు వచ్చే స్పందనతో మిత్ర పక్షాల గెలుపు సూచకంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అనే బలమైన భావన, కసి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్న అంశాన్ని ప్రతి ఒక్కరికీ వివరించాలి. నా పేరుతోనూ పొత్తులపై తప్పుడు పోస్టులు సృష్టిస్తున్నారు. శింగనమలలో బినామీగా ఉన్న డ్రైవర్ కు సీటు ఇచ్చారంటే…దాన్నీ డ్రైవర్ ను అవమానపరిచినట్లు ప్రచారం చేశారు. యువత, ప్రజలు, రాష్ట్రానికి నేనే డ్రైవర్ గా ఉండి గమ్యానికి చేరుస్తా.

3 రాజధానులు కట్టానని జగన్ సిగ్గూ ఎగ్గూలేకుండా చెప్పుకుంటున్నాడు. ప్రజాగళం ప్రచార సభలు మళ్లీ 3వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం. ముస్లింలలో అభద్రతా భావం కలిగించేందుకు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎన్డీయే పార్లమెంట్ లో పెట్టిన ప్రతి బిల్లుకు వైసీపీ బేషరతుగా మద్దతు తెలిపింది.

గతంలోనూ మనం ఐదేళ్లు ఎన్డీయేలో ఉన్నాం…ఏనాడూ ముస్లింలకు ఇబ్బంది కలగనీయలేదు. షాదీఖానాలు, హజ్ హౌస్ లు, ఉర్దూ రెండో బాష, రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, దుల్హన్ ఇచ్చింది మనమే..కానీ అధికారంలోకి వచ్చాక వాటిని జగన్ రద్దు చేశాడు. జగన్ రూ.13 లక్షల కోట్లు అప్పులు చేశాడు…వాటన్నింటినీ తీర్చి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కేంద్ర సహకారం అవసరం.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A RESPONSE