Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర పాలన ఎన్నికల సంఘం పరిధిలోనే సాగుతోందా?

• ఎన్నికల కోడ్‌తో పాలన మారినా ఇంకా జగన్ రెడ్డి పెత్తనం ఏంటి?
• జగన్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం
• చంద్రబాబు నాయుడు గెలుస్తారనే జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నాడు
-తెదేపా పొలిట్‌‌బ్యూరో సభ్యుల వర్ల రామయ్య

అమరావతి: రాష్ట్ర పాలన ఎన్నికల కమీషన్ పరిధిలోకి వెళ్లినా ఇంకా జగన్ సర్కార్ పెత్తనం చేయడం రాష్ట్ర ఎన్నికల కమీషన్ అసమర్ధతను చూచిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు వర్ల రామయ్య అన్నారు. వైకాపా నాయకులు ఓటర్లకు గిప్టులు పంచి ప్రలోభ పెట్టేందుకు శ్రీకాళహస్తి, రేణిగుంట విమానాశ్రయానికి దగ్గరలోని రెండు గోడౌన్‌లలో పెద్దఎత్తున స్టాక్ పెట్టారన్నారు. అధికారపార్టీ పట్ల ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ మంగళగిరిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.

‘జగన్ రెడ్డి పరిపాలన అప్రజాస్వామికం. రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడితోనే రామరాజ్యం సాధ్యమౌతుందని ప్రజలు నమ్మి రాబోయే ఎన్నికల్లో ఆయనను గెలిపించాలనుకుంటున్నారు. ఇది గమనించిన జగన్ రెడ్డి అడ్డదారులు తొక్కైనా అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నాడు. అప్రజాస్వామ్య, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారు. వైకాపా నాయకులు ఓటర్లకు గిప్టులు పంచి ప్రలోభ పెట్టేందుకు శ్రీకాళహస్తి, రేణిగుంట విమానాశ్రయానికి దగ్గర్లోని రెండు గోడౌన్‌లలో పెద్దఎత్తున స్టాక్ చేశారు.

అందులో రిస్ట్‌ వాచ్‌లు, కుక్కర్లు, గొడుగులు, చీరలు, హ్యాండ్ ఫ్యాన్లు లాంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఖరీదైన గిప్టులు ఉన్నాయి. ఈ గోడౌన్‌లలో పెద్దఎత్తున డబ్బు సైతం దాచిపెట్టారని అక్కడ అందరూ అంటున్నారు. ఈ వ్యవహారంపై తెదేపా నాయకులు సీఈసీకి, ఎస్ఈసీకి, ఆర్ఓకు, సీ విజిల్ లో సైతం పిర్యాదు చేశారు. సీవిజిల్ పిర్యాదు నెం. 822869తో పిర్యాదు చేసినా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఎన్నికల సంఘం ఆశించిన రీతిలో పనిచేయడం లేదు. ఎన్నికల నియమావళిని కాలరాస్తున్న వైసీపీ నాయకులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు ఆ గోడౌన్‌లను ఎందుకు సీజ్ చేయడం లేదు? జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఫిర్యాదులు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సరైన రీతిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు.

వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్నటి నుంచి ఆ గోడౌన్‌లకు కాపాలా కాస్తున్నారు. పోలీసులు చేయాల్సిన పని తెదేపా కార్యకర్తలు చేస్తుంటే తిరిగి వారినే బెదిరిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా నేతలకు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గోడౌన్‌ను విడిచిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాలన ఇంకా జగన్ రెడ్డి చేతుల్లోనే ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు.

ఇప్పటికైనా, ఎన్నికల అధికారులు చట్టబద్దంగా వ్యవహరించి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్న వైకాపా నాయకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య సౌధానికి పునాధుల్లాంటివి. అటువంటి ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా ఎన్నికల సంఘం నిర్వహించకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా మారుతుందని రామయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE