– టీడీపీ గ్రీవెన్స్లో బాధితుల ఫిర్యాదులు
– అర్జీలు స్వీకరించిన మంత్రి ఆనం, దేవేంద్రప్ప
మంగళగిరి: టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన నిందితుడు ఒగ్గు గవాస్కర్ అండతో గానుగపెంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి దొంగ డాక్యుమెంట్ లు సృష్టించి తమ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా తనపైనే తప్పుడు కేసులు పెట్టారని.. దీనిపై విచారించి అక్రమ కేసుల నుండి తనను తొలగించి కబ్జా నుండి తన స్థలాన్ని విడిపించి తమకు న్యాయం చేయాలని విజయవాడకు చెందిన రిటైర్డ్ టీచర్ పి. అరవింద అర్జీ ఇచ్చి విజ్ఞప్తిచేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కురబ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప పాల్గొని, వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
• మైదుకూరుకు చెందిన వైసీపీ నాయకుడు ఉపేంద్ర పట్టాభి సీతారామరాజు తమ భూమిని అక్రమంగా ఆన్ లైన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. దీనిపై విచారణ జరిపించి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కడప జిల్లా కాశినాయన మండలం కేఎన్ కొట్టాల గ్రామానికి చెందిన ఒరుసు కృష్ణకుమార్ నేతలకు విజ్ఞప్తి చేశారు.
• సునిపెంటకు చెందిన వైసీపీ లీడర్ సయ్యద్ నూర్ బాషా గత ప్రభుత్వంలో తమకు శ్రీశైలం దేవస్థానంలో షాపులను ఇప్పిస్తానని చెప్పి తమ వద్ద రూ. 10 లక్షల డబ్బులు తీసుకొని మోసం చేశారని.. అతనిపై చర్యలు తీసుకొని తమకు డబ్బులు ఇప్పించేలా చూడాలని నంద్యాల జిల్లా శ్రీశైలానికి చెందిన సగ్గిల రామయ్య వేడుకున్నారు.
• తన అత్త తనకు రాసి ఇచ్చిన భూమిని గత ప్రభుత్వంలో తనకు తెలియకుండా జగనన్న కాలనీ పేరుతో తీసుకొని అధికారులు కబ్జాదారులు ప్రభుత్వం నుండి రూ. 50 లక్షలు కొట్టేశారని.. వారిపై చర్యలు తీసుకొని తనకు రావాల్సిన పరిహారం ఇప్పించవలసిందిగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలానికి చెందిన కొల్లి ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎండీహళ్లి గ్రామ సర్పంచ్ జి. సుధాకర్ విజ్ఞప్తి చేస్తూ.. కర్నాటక బార్డర్ లో ఉన్న తమ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉందని.. గ్రామంలో మౌలిక వసతులైన రోడ్లు డ్రైన్లు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని.. దయ చేసి తమకు గ్రామానికి నిధులు మంజూరు చేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
• రంగయ్య అనే కానిస్టేబుల్ తనకు దొంగ డాక్యుమెంట్లతో స్థలాన్ని అమ్మి డబ్బులు కొట్టేశాడని.. అతనిపై చర్యలు తీసుకొని అతని నుండి తిరిగి డబ్బులు ఇప్పించాల్సిందిగా.. నంద్యాల జిల్లా గడివేముల మండలానికి చెందిన పి. రామకృష్ణరావు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.
• తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం ముదిమూరు గ్రామానికి చెందిన బి. మునిశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో 2014 -2019 మధ్య అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్లు నిర్మించామని అందుకు సంబంధించి బిల్లులు ఇంకా 30% పెండింగ్ ఉన్నాయని వాటిని ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• రెవెన్యూ శాఖలో ఆర్ ఐగా పనిచేస్తున్న తన భార్య తనకు దూరంగా ఉంటూ.. పిల్లలకు చిత్ర హింసలు పెడుతోందని.. పిల్లల చెంపలు ఒంటిపై వాతలు పెట్టి హింసించిందని..కన్న తల్లె కాకుండా ప్రభుత్వ అధికారిననే విచక్షణ మరచి పిల్లాడిని హింసించిన తనభార్యపై చర్యలు తీసుకొవాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రామవతు నాయక్ విజ్ఞప్తి చేశారు.
• తమ తాతల నుండి సాగుచేసుకుంటూ.. 2021 వరకు ఆన్ లైన్ లో ఉన్న తమ భూమిని 2022 ఆన్ లైన్ లో అక్రమంగా తమ పేరు మార్చి లో వైసీపీ నాయకుడు లక్ష్మీనారాయణ గుప్త పేరు ఎక్కించారని.. దీనిపై విచారణ జరిపి అక్రమ పేర్ల మార్పుపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా పత్తి కొండ మండలానికి చెందిన మేదర మేరి విజ్ఞప్తి చేశారు.