Suryaa.co.in

Andhra Pradesh

సంక్షేమ రాజ్యానికి మొట్టమొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్

-సంక్షేమ రాజ్య సృష్టికర్త స్వర్గీయ ఎన్టీఆర్
-కె.అచ్చెన్నాయుడు

తెలుగునాట సంక్షేమ రాజ్యానికి మొట్టమొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి 28 ఏళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అని నినదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కాదు.. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. కిలో రెండు రూపాయలకే బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. రైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పెన్షన్ ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో కొలువయ్యారు. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగువారి ఆత్మగౌరవ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు.

నేడు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దోపిడీకి, వంచనకు గురవుతున్నాయి. రాక్షస పాలనకు చరమగీతం పాటి ఎన్టీఆర్ కలలుగన్న రామరాజ్యం స్థాపనకు ప్రతిఒక్కరం కంకణబద్ధులవుదాం. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధిచెబుదాం.

LEAVE A RESPONSE