Suryaa.co.in

Telangana

తెలంగాణలో స్లీపర్ సెల్స్

– రోహింగ్యాల అక్రమంగా వలస
– కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా నివారించలేదు
– కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్
– మత కలహాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్: హిందూ ప్రజల పట్ల, సంస్థల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వేషభావనతో ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీది ఒకటే కల్చర్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మత విద్వేషాలు సృష్టించే వారిని ఏనాడు నియంత్రించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మతోన్మాదులకు షెల్టర్ ఇస్తూ వారిని పెంచి పోషిస్తున్నా నియంత్రించే ప్రయత్నం చేయలేదు.

హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడిన విషయంలో ప్రశ్నిస్తున్న వారిపై, సంఘవిద్రోహశక్తులుగా, మతోన్మాదులుగా, దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు. కాంగ్రెస్ పార్టీది నీచమైన కల్చర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చాలన్నా కూడా మత కలహాలు సృష్టించిన పార్టీ కాంగ్రెస్.

1978లో రమీజా బీ హత్య కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో హైదరాబాద్ నగరంలో మత కలహాలు చెలరేగాయి. హైదరాబాద్‌లో మంటలు రేగి, అల్లర్లు జరిగాయి. వందల మంది ప్రాణాలు పోయాయి. 1982-83 సంవత్సర కాలంలోనూ కాంగ్రెస్ పార్టీ మత కలహాలు సృష్టించి వందల మందిని బలిపెట్టింది. వారి శవాలమీద రాజకీయం చేసింది. 2014 కు ముందు ప్రపంచ వ్యాప్తంగా సిరియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్.. ఇలా అనేక చోట్ల టెర్రరిస్టులు జిహాదీల పేరిట రక్తాన్ని ఏరులుగా పారించారు.

జమ్ము కాశ్మీర్ లో భారత సైనికుల మీద రాళ్ల వర్షం కురిసినప్పుడు, సైన్యం ట్రక్కుల మీద బాంబులు పేలినప్పుడు ఆ మారణహోమాన్ని చూసి ప్రజలు ఏడ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చాలాచోట్ల ఉన్మాదంతో జిహాదీ పేరుతో బాంబు దాడులకు పాల్పడిన ఘటనలు చాలా ఉన్నాయి. 2004 నవంబర్ 1న సరూర్‌నగర్ దగ్గర కాలేజీ బస్సు కింద బాంబు పేలి, ప్రజలు గాయపడ్డారు.

2004 నవంబర్ 12న జామే ఉస్మానియా సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన బాంబు పేలుడు సంఘటన చోటు చేసుకుంది. 2007 మే 18న పాతబస్తీ మక్కా మసీదులో బాంబులు పేలి 14 మంది చనిపోయిన్రు. చాలా మంది గాయపడ్డారు.

2007 ఆగస్టు 25వ తేదీన లుంబినీ పార్కు, కోఠీలోని గోకుల్ చాట్‌ల్లో సంభవించిన పేలుళ్లలో 42 మంది మరణించారు. వందల మంది గాయాలపాలయ్యిన్రు.

తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో మత కలహాలతో జరిగిన దాడుల్లో వందల మంది చనిపోయారు. అలాంటి భయానక పరిస్థితుల తర్వాత ఏ షాపుకెళ్లినా, జనసమర్థంగా ఉన్న ప్రాంతాలకు మెటల్ డిటెక్టర్లు లేకుంటే అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ, సమాజాన్ని అస్థిరపర్చే టెర్రిరిస్టులమీద ఉక్కుపాదం మోపిన్రు. జమ్మూ కశ్మీర్ వైపు పరాయి దేశం కన్నెత్తి చూడకుండా, ప్రశాంతత నెలకొల్పిన ప్రభుత్వం బిజెపి, టెర్రరిస్టులపై ఉక్కు సంకల్పంతో ఉక్కుపాదం మోపిన నాయకుడు నరేంద్ర మోదీ.

కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల రాజకీయం కోసం.. మత కలహాలు సృష్టించే వారిని పట్టుకోలేక, నియంత్రించే దమ్ములేక, దాడులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై హత్యా కేసులు పెట్టించి, బిజెపి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. ఇటువంటి వైఖరి తగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

తెలంగాణలో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, టెర్రిస్టులకు అడ్డాగా మారిందని, రోహింగ్యాలు అక్రమంగా వలస వస్తున్నారని కేంద్ర ఏజెన్సీలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను నివారించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి పోలీసులు తెలంగాణకు వచ్చి టెర్రిస్టులను పట్టుకున్న ఘటనలు ఉన్నాయి.

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటన తర్వాత హిందూ ప్రజానీకం ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సంప్రదాయాన్ని కించపర్చే ప్రసంగాలు చేస్తున్నది ఎవరో తేలిపోయింది. హిందూ సమాజంపై ధ్వేషాన్ని, విషాన్ని కక్కుతూ, ప్రజల్లో ధ్వేషభావాన్ని రెచ్చగొట్టే దుర్మార్గమైన వ్యక్తులను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో సంఘవిద్రోహ శక్తుల కుట్రలను నిగ్గు తేల్చాలి.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందూ ప్రజల ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కాపాడటంలో విఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఎంఐఎం పార్టీ మెప్పు కోసం, ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే పనిచేస్తున్నరు.. ఇప్పటికైనా అన్ని వర్గాల ప్రజల క్షేమం కోసం, సమాజ హితం కోసం పనిచేయాలని హెచ్చరిస్తున్నాం.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నది. అన్ని మతాలను సమానంగా చూసే దేశం భారతదేశం. బాంబు బ్లాస్టులను, దుర్మార్గపు హత్యలను, రక్తపాతాన్ని ఏ మతపెద్దలూ హర్షించరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి.

బిజెపి నాయకులు, కార్యకర్తల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో పాటు కేసులను విత్ డ్రా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

బిజెపి నాయకుల ఇండ్లలోకి వెళ్లి పోలీసులు వేధించాలని చూస్తే సహించేది లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజల హక్కులను ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని హరించి, ప్రతిపక్షాలను అణిచివేయాలనే ప్రయత్నం చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులతో అణచివేయాలనుకోవడం దుర్మార్గ చర్య.

LEAVE A RESPONSE