Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు

– టీటీడీ ఛైర్మన్‌ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు
– టీటీడీ ఛైర్మన్‌ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి
– తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇచ్చారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను, టీటీడీని వాడుకున్నారు.

గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులు తొక్కిసలాటకు గురికావడం, అందులో మరణించడం సాధారణమైన విషయం కాదు. టీటీడీ చరిత్రలో ఇదొక చీకటిరోజు .

చంద్రబాబు ప్రభుత్వం ఈపాపం మూటగట్టుకుంది. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవు. గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమే.

హిందూ ధర్మంమీద భక్తి, శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు. భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి, వాటిని తేలిగ్గా చూడ్డంవల్లే ఇలాంటి ఘటనలు.

పరమపవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాదిమంది వస్తారని అందరికీ తెలుసు. తెలిసీ ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారు?
తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉంది.

వైయస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి. తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదు. అధికారుల మధ్య, పోలీసుల మధ్య సమన్వయం లేదు.

శ్రీవారి భక్తుల సేవకన్నా, టీటీడీ ఛైర్మన్‌కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువ. ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమే. టీటీడీ ఛైర్మన్‌ తన టీవీ కార్యాలయాలను తిరుమల టిక్కెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరగాలి. టీటీడీ ఛైర్మన్‌ సహా, స్థానిక ఎస్పీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి. అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి.

LEAVE A RESPONSE