Suryaa.co.in

Features

స్వాధీనత నుండి స్వతంత్రత వైపు

– డాక్టర్ మోహన్ భాగవత్ 
విదేశీ పాలన నుండి మనం స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. మనకి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశ రథపు పగ్గాలను మనమే చేపట్టాము. అలా స్వాధీనత నుండి స్వతంత్రత వైపు మన ప్రయాణం మొదలైంది. ఈ స్వాతంత్ర్యం ఒక్కరోజులో రాలేదని మనందరికీ తెలుసు. భారతీయత ఆధారంగా, దేశ స్వాతంత్ర్య కాంక్షతో వివిధ వర్గాలు, కులాలకు, ప్రాంతాలకు చెందిన అనేకమంది స్వాతంత్ర్య వీరులు ఈ పవిత్ర లక్ష్యం కోసం అనేక త్యాగాలు చేశారు. వీరందరితోపాటు సమాజం మొత్తం పరాయిపాలన, బానిసత్వపు చేదు అనుభవాలను చవిచూసింది. అహింసాయుత ఉద్యమాలతోపాటు సాయుధ పోరాటాలు కూడా ఫలించి చివరికి మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ కృత్రిమమైన విభజన రేఖలు, స్వధర్మం, స్వరాష్ట్రం, స్వతంత్రం అంటే ఏమిటనేది మనం మరచిపోవడం, స్పష్టతలేని, అసంబద్ధ విధానాలు, బ్రిటిష్ వారి కూటనీతి వల్ల ప్రతి భారత పౌరుడి మనసులో లోతైన వేర్పాటువాద గాయాన్ని చేశాయి. అందువల్ల సమాజం, ముఖ్యంగా యువత, ఈ చరిత్రను తెలుసుకుని, అర్ధం చేసుకుని, గుర్తుంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరిపట్లనో శతృత్వాన్ని వహించడానికో, ద్వేషాన్ని పెంచుకోవడం కోసమో కాదు. ఆ విఘటన, విభజన వాదాన్ని మళ్ళీ అమలు చేయాలనే ప్రయత్నాలను వమ్ము చేసి సమైక్యతను, సద్భావనను నెలకొల్పుకోవడం కోసం.

సామాజిక సమరసత

వివక్షలేని, సహిష్ణుత కలిగిన సమాజం ఉన్నప్పుడే ఆ దేశం సమైక్యంగా ఉంటుంది. పురాతనమైన కులపరమైన విభజనలు ఇటువంటి సమాజానికి ప్రధాన అడ్డంకి. దీనిని పరిష్కరించడానికి అనేకరకాల ప్రయత్నాలు, అనేక మార్గాల్లో జరిగాయి. అయినా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇప్పటికీ మన సమాజంలో కుల దురభిమానం కనిపిస్తూనే ఉంది. ప్రజల మధ్య సయోధ్య, సద్భావనను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నవారి కంటే అందుకు భిన్నంగా పనిచేస్తున్న వారే దేశపు మేథో పటలంపై ఎక్కువగా కనిపిస్తున్నారు. సుహృద్భావపూర్వకమైన సామాజిక వ్యవస్థను కోరుకునేవారందరూ సకారాత్మక సంవాదాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. కుటుంబాల మధ్య అనుబంధం, సామాజిక సద్భావన పెంపొందాలి. కుటుంబాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలు, వ్యవహారం పెరిగితే సమాజంలో కూడా సమానత్వం, ఏకత్వభావన పెంపొందుతాయి. సామాజిక సమరసత కార్యక్రమాల ద్వారా సమాజంలో ఏకత్వభావన, సహోదరభావనను నిర్మాణం చేసేందుకు స్వయంసేవకులు కృషిచేస్తున్నారు.

స్వాతంత్ర్య, జాతీయ విలువలు

పురాతన కాలం నుండి ఈ దేశపు సమైక్యత, ఏకత్వం, సర్వ మానవాళి స్వేచ్చలే మన జీవన విధానపు ప్రధాన అంశాలుగా ఉన్నాయి. దీని కోసమే అనేకమంది తమ రక్తాన్ని ధారపోశారు. ఈ సంవత్సరం గురు తేగ్ బహదూర్ జీ మహారాజ్ 400 ప్రకాశ్ పర్వం(జయంతి) జరుపుకుంటున్నాము. ఆ కాలంలో ఎక్కువగా ఉన్న మతపరమైన మూఢత్వాన్ని ఎదిరించి నిలబడిన ఆయన, చివరికి ప్రాణత్యాగం చేసి అమరులయ్యారు. ఎలాంటి భయము లేకుండా ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాలకు అనుగుణంగా జీవించగలిగే మతస్వేచ్ఛ, మొదలైన ఈ దేశపు సాంస్కృతిక విలువలను పునఃస్థాపితం చేయడం కోసం కృషి చేసినందుకు ఆయనపై దాడి జరిగింది. అయితే ప్రజలు మాత్రం ఆయనకు `హింద్ కీ చాదర్’ లేదా `హింద్ రక్షణ కవచం’ అని బిరుదునిచ్చి గౌరవించారు. భారత్ వారసత్వమైన విశాలత్వం, సర్వ పంథాలను ఇముడ్చుకునే మతస్వేచ్ఛను కొనసాగించడానికి బలిదానం చేసిన వీరుల వినీలాకాశంలో ఆయన జాజ్వల్యమానమైన సూర్యుడు. అటువంటి మహోన్నత పూర్వజులపట్ల అపారమైన గౌరవం, విశాలత్వం, అన్నింటిని కలుపుకోగలిగిన సాంస్కృతిక వారసత్వం విలసిల్లిన ఏ దేశం కోసం వారు తమ జీవితాలను అర్పించారో ఆ మాతృభూమి పట్ల నిష్ట మొదలైనవి మన జాతీయ జీవనపు ప్రధాన లక్షణాలు.
భారతీయ భావనలో `స్వేచ్ఛాయుత జీవనం’ అంటే ఒక ప్రత్యేకమైన, ఖచ్చితమైన నిర్వచనం ఉంది. మహారాష్ట్రకు చెందిన సంత్ జ్ఞానేశ్వర మహారాజ్ జీ ఒక ప్రార్ధనలో ఇలా అంటారు – ”దుష్టులలోని దుష్టత్వం అంతమగుగాక. వారి చర్యలు సత్కార్యాలుగా మారుగాక. కష్టాల కారుమేఘాలు తొలగి ప్రతిఒక్కరి కోరికలను తీర్చే సదాచారపు కాంతులు వెలుగుగాక.”
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇదే భావాన్ని తన ప్రఖ్యాత కవితలో ఇలా వ్యక్తంచేశారు – “భీతిలేక మనిషి ఎచట శిరమునెత్తి నిలచునో; తనివితీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరకునో; అడ్డుగోడలేని సమసమాజమెచట నుండునో; హృదంతరాళ జనితమౌ సత్యమెచట వరలునో; అటువంటి స్వేచ్చా స్వర్గములో నా దేశం సాగునట్లు వరమునిమ్ము తండ్రి”
ఈ ఉన్నత ఆదర్శంతో ప్రస్తుత మన స్థితిని పోల్చి చూస్తే మనం స్వాధీనత నుండి స్వతంత్రానికి ప్రారంభించిన యాత్రలో ఇంకా చాలా దూరం వెళ్లవలసి ఉందని అర్ధమవుతుంది.
భారత్ అభివృద్ధి, ఒక ఉన్నత స్థానానికి ఎదగడం తమ స్వార్ధ ప్రయోజనాలకు భంగకరమని భావించే శక్తులు కొన్ని ప్రపంచంలో ఉన్నాయి. అటువంటి శక్తులు కొన్ని దేశాల్లో అధికారంలో కూడా ఉన్నాయి. భారత్ లో సనాతన విలువలతో కూడిన మతం విలసిల్లితే ఈ స్వార్ధపర శక్తుల ఆటలు సాగవు. ప్రపంచంలో లోపించిన సమతుల్యతను పునరుద్ధరించి, పరస్పర సహకారాన్ని పెంపొందించే ధార్మిక వైశ్విక దృష్టిని భారత్ కలిగి ఉంది. దీని ద్వారా ప్రపంచంలో భారత్ చూపే ప్రభావాన్ని వమ్ము చేయడానికి చాలా ప్రయత్నాలే సాగుతున్నాయి. ప్రపంచాన్ని, అలాగే భారత ప్రజానీకాన్ని గందరగోళపరచడానికి పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, జాతీయ పునరుజ్జీవానికి కృషి చేస్తున్న సామాజిక-సాంస్కృతిక సమూహాలకు వ్యతిరేకంగా ఈ ప్రచారం సాగుతోంది. పరాజయం, పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామనే భయంతో ఈ శక్తులన్నీ కలిసి ప్రత్యక్ష, పరోక్ష చర్యలకు పూనుకుంటున్నాయి. ఈ శక్తుల ఏకీకరణను గుర్తించి వాటి సైద్ధాంతిక, మానసిక దాడుల నుండి మనలను మనం, సమాజాన్ని రక్షించుకునేందుకు జాగరుకులమై వ్యవహరించాలి.
మొత్తానికి , కొన్ని వినాశక బుద్ధులు తమ పాత మార్గాలను వదిలి విధ్వంసం కోసం కొత్త మార్గాలకోసం అన్వేషిస్తున్నాయి. పిడివాదం,వాళ్ళ స్వార్థపరత్వం ద్వారా కొంత మద్దత్తు కూడగట్టే ప్రయత్నం, ప్రస్తుత స్థితని భ్రమింపజేసి ప్రజలను ఆందోళనకు గురి చేయడం, సమాజంలో ఏదోరకమైన అస్థిరతను కలుగజేయడం, నిరంతర ఘర్షణ, అనిశ్చితి , తీవ్రవాద ప్రచారం , నియంతృత్వ ధోరణిని అవలంబించి సమాజంపై రుద్దడం వంటి మార్గాలు ఇప్పటికే తేటతెల్లమయ్యాయి.
`స్వ’ అనే భావన పట్ల ఉన్న అజ్ఞానం,సంకోచం, సందేహాల తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలు ఈ స్వార్థపర శక్తులకు బలాన్ని, వేగాన్ని చేకూరుస్తున్నాయి. బిట్ కాయిన్ వంటి నియంత్రణ లేని ద్రవ్య విధానాలు ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేయగలవు, పెద్ద సవాళ్లను విసరగలవు. ప్రస్తుతం ఓ టి టి మాధ్యమాలలో అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రసారమవుతున్న వివిధ రకాల విషయాలకు నియంత్రణ కరవైంది. మహమ్మారి కారణంగా ఆన్లైన్ విద్య ప్రవేశపెట్టడం జరిగింది. పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లల్ని ఫోన్లకి అతికించేశారు. నియంత్రణ , మార్గదర్శన వ్యవస్థ లేని ఈ విషయంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఊహించడం కష్టమవుతుంది. దేశ వ్యతిరేక శక్తులు వీటిని ఎలా ఉపయోగిస్తాయో ఇక తెలిసిందే. కనుక ప్రభత్వం ఈ వ్యవహారాలను తక్షణమే నియంత్రించాలి.

కుటుంబ ప్రబోధన్

ఈ సవాళ్ళ పై పట్టు సంపాదించేందుకు, తప్పు, ఒప్పు, మంచి, చెడు వంటి వాటి మధ్య వ్యత్యాసం తెలిపే వాతావరణం మన ఇళ్ళలో నిర్మాణమవ్వాలి. ఎంతో మంది సంస్కర్తలు, ప్రవచనకారులు, సామాజిక ధార్మిక సంస్థలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. మనం కూడా మన కుటుంబ సభ్యులతో ఈ విషయాలు ఆలోచించి ప్రవర్తనా సరళిని పెంపొందించవచ్చు. సంఘ స్వయంసేవకులు కూడా కుటుంబ ప్రబోధన్ ద్వారా ఈ లక్ష్యం కోసం పని చేస్తున్నారు. “మన్ కా బ్రేక్ ఉత్తమ్ బ్రేక్ “ అని మనం వినో , చదివో ఉంటాం. నిర్లక్ష్య ధోరణిని , భారతీయ విలువల వ్యవస్థపై పలు రకాలుగా జరుగుతున్న దాడికి జ్ఞానమే మందు.

కరోనాపై యుద్ధం

కరోనా 3 వ ఉధృతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూనే మనం మన 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం కోసం తయారవుతున్నాం. రెండవ ఉద్ధృతిలో సమాజం తన సామూహిక ప్రయత్నంతో నిబ్బరం ప్రదర్శించింది. రెండవ ఉధృతి చాలా భీకరంగా ఉండింది. చాలా మంది యువకులను సైతం బలిగొంది. తమ ప్రాణాలను లెక్క చేయక మానవాళి సేవలో స్వచ్ఛందంగా నిమగ్నమైన వ్యక్తుల కృషి అభినందనీయం. ప్రమాదం ఇంకా పొంచి ఉంది. కరోనాతో మన యుద్దం ఇంకా ముగియలేదు. అయితే మనం మూడవ ఉధృతిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉన్నాం. టీకాలు ఎక్కువ సంఖ్యలో ఇవ్వబడ్డాయి. ఇవి పూర్తిగా ఇవ్వాలి. సమాజం చాలా మేరకు అప్రమత్తంగానే ఉంది, ఏదైనా అత్యవసర పరిస్థితులలో స్పందించేందుకు శిక్షితులైన ధార్మిక సంస్థల కార్యకర్తలు , ఇతర వ్యక్తులతో పాటు సంఘ స్వయంసేవకులు ఎల్ల వేళలా గ్రామ స్థాయి వరకు ఉన్నారు. ఈ మహమ్మారిని బలహీన పరిచే ప్రయత్నాలు ఒక పక్క సాగుతున్నా, చివరి దశలలో మహమ్మారి ప్రభావం తక్కువని తెలుస్తోంది. అయినప్పటికీ మనం ప్రభత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ఎల్లప్పుడూ జాగరూకతతో వ్యవహరించాలి.
ప్రభుత్వం, సమాజం కరోనా భయంతో ప్రజల రోజువారీ వ్యవహారాలను నియంత్రించే ఆలోచనలో లేనట్టే కనిపిస్తోంది. కరోనా రెండు ఉధృతులలో విధించిన లాక్ డౌన్లు ఆర్థిక స్థితి బాగా దెబ్బ తీశాయి. పాత నష్టాలను పూరుస్తూనే ఆర్థిక సవాళ్లను వేగంగా ఎదుర్కోవాలి. అందుకోసం ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు, అవలంబిస్తున్నారు. ఈ ప్రయత్నాలు నిరంతరం సాగాలి. కోవిడ్ మహమ్మారి సవాలు తరువాత మన భారతీయ ఆర్థిక వ్యవస్థ బలమైన ప్రతిస్పందననే కనబరుస్తోంది.వ్యాపార రంగంలో త్వరిత గతిన తిరిగి వేగం, దృఢీకరణ కనిపిస్తునాయి. అందరు భాగస్వాముల పాత్రను ప్రభుత్వం ప్రోత్సాహిస్తే ఈ కష్ట దశని సాఫీగా దాటే అవకాశం ఉందనే విశ్వాసం పెరుగుతోంది. అలాగే ఈ పరిస్థితి స్వ ఆధారిత దిశ , వ్యవస్థను నిలబెట్టే అవకాశాన్ని ఇచ్చింది. సమాజంలో స్వాభిమాన జాగృతి జరిగింది. శ్రీ రామ జన్మభూమి నిధి సేకరణలో వచ్చిన ప్రతిస్పందన ఇందుకు ఉదాహరణ. సమాజంలో అన్ని రంగాలలో దీని ప్రకటీకరణ కూడా జరిగింది.
టోక్యో ఒలంపిక్ క్రీడలలో ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు, పారాలింపిక్స్ లో అయిదు స్వర్ణ, ఎనిమిది రజత,ఆరు కాంస్య పతకాలు సాధించి మన దేశ క్రీడాకారులు కనబరిచిన పటిమ అభినందనీయం. దేశం మొత్తంలో వారికి లభించిన సత్కారంలో మనందరం భాగం. కోవిడ్ మహమ్మారి `స్వ’ ఆధారిత శాస్త్రీయ జ్ఞాన వ్యవస్థ, దృష్టి పట్ల అవసరాన్ని మళ్ళీ ఒకసారి చూపించింది. కోవిడ్ ను ఎదుర్కొనడంలో మన దేశీయ పద్ధతులు , ఆయుర్వేదం చూపిన ప్రభావం మనం అనుభవించాం. దేశం మొత్తంలో ప్రతి వ్యక్తికీ ప్రభావవంతమైన, చవకైన వైద్య సదుపాయ అవసరం దీని ద్వారా మనం చూశాం. ఇంత వ్యాపకమైన, జనాభా కలిగిన మన దేశంలో చికిత్స మాత్రమే కాక ఆయుర్వేదం చెప్పినట్టు సహజ ఆరోగ్య దృష్టిలో ఒక వ్యవస్థ వికాసం దిశగా మనం ఆలోచించాలి.

ఆరోగ్యం – భారతీయ దృష్టి

మన శాస్త్రీయ పద్ధతిలో ఉండే ఆహార , విహార,వ్యాయామ,ధ్యాన విధానం ఆరోగ్యకర వాతావరణాన్ని , రోగాల నుంచి తట్టుకునే శక్తి కలిగిన దేహాలను పెంపొందిస్తుంది. మన శాస్త్రీయ పద్ధతి ప్రకృతి అనుసంధానమై , వైశ్విక దృష్టిని కలిగిస్తుంది. సామూహిక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కోవిడ్ లో నియంత్రించబడ్డాయి. సందడి, కోలాహలం, ఉత్సుకత కొంత కుంటుపడినా, ధన శక్తి వనరులు పొదుపయ్యాయి. ఆ ప్రభావం మన ప్రకృతి మీద కూడా నేరుగా ఉంది. సహజ జీవనం మళ్ళీ మొదలైనప్పుడు ఈ అనుభవాల నుండి నేర్చుకొని వృధా ఖర్చులను నియంత్రించే ప్రకృతి సిద్ధ జీవన పద్ధతిని అవలంబించడం ఉత్తమం. ప్రకృతి సిద్ధ జీవన పద్ధతిని ప్రోత్సహించే వ్యాపక ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది. సంఘ స్వయంసేవకులు కూడా నీటి పొదుపు, ప్లాస్టిక్ రహిత జీవనం, వృక్షారోపణం వంటి వాటి ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఆయుర్వేద పద్ధతులు, ఇతర విధానాల ద్వారా ప్రాథమిక వైద్య అవసరాలను గ్రామ స్థాయిలో అందించవచ్చు. రెండవ అంచలో మండల కేంద్రాలలో ఒక వ్యవస్థ,జిల్లా కేంద్రాలలో మూడవ అంచె వ్యవస్థ ద్వారా అత్యాధునిక వైద్య పద్ధతులను ప్రధాన పట్టణాలలో అందించడం సాధ్యం. వైద్య పద్ధతులలో ఉన్న వ్యత్యాసాల మధ్య ఘర్షణ కంటే వాటిని అవసరాన్ని బట్టి వాడడం ద్వారా చవకైన, గుణాత్మకమైన చికిత్సను అందరికీ అందుబాటులో ఉంచవచ్చు.

ఆర్థిక స్థితిపై మన దృష్టి

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితి చాలా దేశాలు ఊహించిన దానికంటే పెద్ద సవాళ్లను కుదుపులను ఎదుర్కొంటోంది. యంత్రీకరణ ద్వారా నిరుద్యోగం , అనైతికమైన పరిజ్ఞానం ద్వారా మానవ విలువల వ్యవస్థలో లోపాలు, జవాబుదారీతనం లేని అధికారం ఇందుకు ఉదాహరణలు. ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పు, విధానాల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. మన ఆర్థిక దృష్టి బాహ్యమైన వస్తు సేకరణ ఎంత చేసినప్పటికీ, ఆనందం వ్యక్తిగతమైనది అనే భావన మీద ఆధారపడినది. బాహ్య వస్తువులు ఆంతరంగిక ఆనందానికి మూలం కాదు. ఆనందం కేవలం భౌతికం కాదు. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆత్మలను ఎవరు అనుభవిస్తారో, సహజమైన వ్యక్తిగత అభివృద్ది ద్వారా ఎవరు పరమాత్మ జ్ఞానాన్ని సంపాదిస్తారో, ఎక్కడ మానవ జీవితం స్వేచ్చా శిఖరాలను ధార్మిక పద్ధతిలో స్పృశిస్తుందో అటువంటి ఆర్థిక వ్యవస్థ మన సంస్కృతిలో ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది. మన ఆర్థిక దృష్టి వినియోగం కంటే నియంత్రణ మీద దృష్టి పెడుతుంది. మానవుడు వస్తువులకు వినియోగదారుడే తప్ప యజమాని కాదు. మనిషి సమస్త సృష్టిలో భాగం. సృష్టి ఇచ్చే ఫలాలను అందిపుచ్చుకోవడం అతని హక్కు. అలాగే వాటిని సంరక్షించడం, పొదుపు చేయడం అతని బాధ్యత అనే భావనలు మన వ్యవస్థలో మౌలికంగా ఉన్నాయి. ఇది ఏకపక్ష ఆలోచన కానే కాదు. వ్యాపారులో,పెట్టుబడిదారులో,శ్రామికులో ఎవరో ఒక్కరి కోసం మాత్రమే ఫలాలు అందించడం దీని ఉద్దేశ్యం కాదు. కాగా , ఈ ఆలోచన వీరందరి తో పాటు సమస్త మానవ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని పరస్పర సామరస్యం , సమతూకంతో కూడిన సంతృప్తిని అందించేది. ఈ దృష్టి కలిగిన ఆర్థిక ప్రగతితో కూడిన వ్యవస్థను నిర్మాణం చేయడం ఈనాడు దేశంలో అత్యావశ్యకం. స్వాతంత్ర్య ప్రగతిలో ఇటువంటి వ్యవస్థా నిర్మాణం సహజ ప్రక్రియ. `స్వ’ ను ప్రతిబింబించడంలో ఇది ఒక దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆవిష్కరణ.

జనాభా విధానం

దేశపు అభివృద్ధిని ఆకాంక్షించేవారందరికీ ఒక ప్రధాన సమస్య కనిపిస్తుంది. దేశంలో అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్న జనాభా భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యను గురించి ఆలోచించాలి. ఈ విషయమై 2015 రాంచిలో జరిగిన అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి.
తీర్మానం: జనాభా పెరుగుదల రేటులో అసమతుల్యత మూలంగా ఎదురయ్యే సవాళ్ళు
గత దశబ్దకాలంగా జనాభా నియంత్రణకై తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. కానీ 2011 జనగణన వివరాలు విశ్లేషిస్తే మతపరమైన జనాభా మార్పుల దృష్ట్యా జనాభా విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అఖిల భారతీయ కార్యకారీ మండలి అభిప్రాయపడుతున్నది. జనాభా పెరుగుదలలో వివిధ మత వర్గాల మధ్య ఉన్న అసమతుల్యత చొరబాట్లు, మత మార్పిడులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో ఇది దేశ భద్రత, సమైక్యత, సమగ్రతలకు ముప్పుగా పరిణమిస్తున్నది. జనాభా నియంత్రణ చర్యలు ప్రారంభమవుతాయని 1952లో భారత్ ప్రకటించినా జనాభా విధానం 2000 సంవత్సరం వరకూ తయారవలేదు. అప్పుడు జనాభా కమిషన్ ఏర్పాటయింది. 2045 నాటికి సంతాన సాఫల్య రేటు 2.1 ఉండేలా చూడటం వంటి లక్ష్యాలతో జనాభా నియంత్రణ విధానం రూపొందింది. జాతీయ వనరులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పరచుకున్న ఈ సూచికను అన్ని వర్గాల ప్రజలకు వర్తింపజేయాలి. కానీ 2005-06 నాటి ఆరోగ్య, సంతాన సాఫల్య అధ్యయనం ప్రకారం 0-6 వయస్సు ఉన్న వారి శాతంలో మతాలవారీగా చాలా వ్యత్యాసం ఉంది.
1951-2011 మధ్య హిందువుల జనాభా 88 శాతం నుండి 83 శాతానికి పడిపోగా ముస్లిముల జనాభా 9.8 శాతం నుండి 14.23 శాతానికి పెరిగింది. జాతీయ సరాసరికంటే ముస్లిం జనాభా పెరుగుదల రేటు చాలా ఎక్కువగా ఉంది. సరిహద్దు జిల్లాలు ఉన్న అస్సామ్, పశ్చిమ బెంగాల్ , బీహార్ లలో బంగ్లాదేశీయుల చొరబాట్లు దీనికి కారణం. సుప్రీం కోర్ట్ నియమించిన ఉపమన్యు హజారికా కమిషన్ కూడా ఈ విషయాన్ని ఆయా సమయాల్లో ధృవీకరించింది. చొరబాటుదారులు దేశ పౌరుల హక్కులను కాలరాయడమే కాకుండా అరకొర వనరులున్న రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా పరిణమించారు. అనేక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్ధిక ఉత్పాతాలకు కారణమవుతున్నారు. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లో మతపరమైన జనాభా అసమతుల్యత బాగా కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లో 1951నాటికి హిందువుల సంఖ్య 99.21శాతం ఉండగా, 2001 నాటికి 81.3 శాతానికి, 2011 నాటికి 67శాతానికి పడిపోయింది. ఒక దశాబ్ద కాలంలో క్రైస్తవ జనాభా 13 శాతం పెరిగింది. మణిపుర్ లో కూడా 80 శాతం ఉన్న హిందువుల జనాభా 2011 నాటికి 50 శాతానికి పడిపోయింది. ఈ తరహా జనాభా అసమతుల్యతకు కారణం వ్యవస్థీకృతంగా కొన్ని విదేశీ శక్తులు చేస్తున్న మతమార్పిడులేనని అఖిల భారతీయ కార్యకారీ మండలి నొక్కివక్కాణిస్తున్నది. ఈ నేపధ్యంలో క్రింది చర్యలు చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నది –
జాతీయ జనాభా విధానాన్ని పునర్ నిర్వచించాలి. దేశంలో లభ్యమవుతున్న వనరులు, భవిష్యత్ అవసరాల ఆధారంగా అందరికీ ఈ విధానాన్ని వర్తింపచేయాలి.సరిహద్దుల్లో అక్రమ వలసలు అరికట్టాలి. ఒక జాతీయ జనాభా పట్టికను రూపొందించాలి. చొరబాటుదారులు పౌరులుగా చెలామణి అవకుండా, భూములు కొనకుండా కట్టడి చేయాలి.
ఈ జనాభా అసమతుల్యత గురించి స్వయంసేవకులు అప్రమత్తమై ప్రజలకు అవగాహన కలిగించి, న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించి, ఈ సమస్య నుండి దేశాన్ని రక్షించడం తమ బాధ్యతగా గుర్తెరగాలని అఖిల భారతీయ కార్యకారీ మండలి పిలుపునిస్తున్నది.
ఈ అంశాలకు సంబంధించిన సరళ,సర్వకాలీన విధానాల అమలు కోసం జనామోదం, నిస్పాక్షికత అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో హిందువుల పట్ల వివక్షత , జనభా అసమతుల్యత మూలంగా తమ స్వస్థలాలను వదిలి వలస వెళ్లాల్సిన ఒత్తిడి పెరిగాయి. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తరువాత జరిగిన అల్లర్లు అక్కడి హిందువుల దీన స్థితికి, ప్రభుత్వం ద్వారా అనాగరిక శక్తుల బుజ్జగింపు, ఈ అసమతుల్యత కారణంగా చెప్పవచ్చు. కనుక అందరికీ ఒకే విధంగా వర్తించే విధానం అత్యవసరం. మన స్వలాభాన్ని వదిలి దేశ ప్రయోజనాలను ముందుంచే అలవాటు మనం చేసుకోవాలి.

వాయువ్య సరిహద్దుల అవతల

పూర్తిగా ఆశ్చర్యం కాకపోయినప్పటికీ, అనుకున్న దాని కంటే ముందుగా జరిగిన పరిణామం తాలిబన్ల ద్వారా ఆఫ్గనిస్థాన్ ఆక్రమణ. ఇస్లాం పేరిట తీవ్రవాదం, అతివాదం, నిరంకుశత్వంతో మొదటినుండి వారికున్న పిడివాదం చాలు తాలిబాన్లంటే అందరికీ భయం పుట్టడానికి. అయితే ఇప్పుడు చైనా , పాకిస్థాన్, టర్కీలు కూడా వీళ్ళతో కలిశాయి. అబ్దాలీ తరువాత మళ్ళీ ఇప్పుడు మన వాయువ్య సరిహద్దులపై నిరంతర దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. తాలిబాన్ లు కాశ్మీర్, శాంతి చర్చల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నారు. కనుక వీళ్ళని మనం పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి లేదు. మన సైన్యం నిరంతరం సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితులలో అంతర్గత భద్రత విషయంలో అత్యంత జాగరుకతతో ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం, సమాజం మీద ఉంది. రక్షణ రంగంలో స్వావలంబన, సైబర్ రక్షణ రంగంలో ఎప్పటికప్పుడు నవీకరణ వేగంగా జరగాలి. రక్షణకు సంబంధించి మనం అతి త్వరగా స్వావలంబన సాధించాలి. సత్సంబంధాలు కొనసాగిస్తూనే , హృదయ పరివర్తనను ఆహ్వానిస్తూనే మనం అన్ని పరిస్థితులకీ సన్నద్ధమై ఉండాలి. ఈ కఠిన సమయంలో జమ్ము కాశ్మీర్ ప్రజల భావాలను మిగిలిన దేశం మొత్తం పంచుకోవాలి, గుర్తించాలి. తీవ్రవాదులు మళ్ళీ దేశభక్తిపరులైన పౌరులను, అందునా హిందువులను, వారి మనోనిబ్బరాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. తద్వారా మరలా లోయలో భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పౌరులు ధైర్యంగా ఉన్నారు కానీ…. ఈ ఘటనలు ఆపడానికి, తీవ్రవాదాన్ని నిలువరించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకోవాలి.

హిందూ దేవాలయాలు

దేశ అఖండతకు, రక్షణకు, ఐక్యతకు, ఎదుగుదలకు, సుసంపన్నత్వానికి, శాంతికి, అంతర్గత, బాహ్య ముప్పులకు తోడు హిందూ సమాజానికి మరికొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించడం కూడా అవసరం. ఈనాడు హిందూ దేవాలయాల స్థితి వాటిలో ఒకటి. దక్షిణభారత్ లో ఉన్న దేవాలయాలు అన్నీ ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. మిగితా దేశంలో కొన్ని ప్రభుత్వం, కొన్ని కుటుంబ ట్రస్టులు, మరికొన్ని నిర్ధారిత ట్రస్టుల కింద ఉన్నాయి. కొన్ని దేవాలయాలకు ఎటువంటి పరిపాలన పద్ధతీ లేదు. వాటి స్థిర,చరాస్తుల వ్యవహారాలలో అవకతవకలు బయటపడ్డాయి. నిర్దిష్టమైన శాస్త్ర నియమాలు, ఆగమ నియమాలు ప్రతీ దేవాలయానికి అందులోని దేవతా మూర్తికీ వర్తిస్తాయి. అటువంటి శాస్త్ర విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కుల జాతి భేద రహిత ఆలయ ప్రవేశం, దర్శనం ఇంకా కొన్ని ఆలయాలలో జరగడం లేదు. ఇది జరిగేటట్టు చూడాలి. వీటి నియమాలు సాధువులు, జ్ఞానులను సంప్రదించకుండా హిందూ సమాజ భావాన్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా చేసినవి. చారిత్రిక హిందూ ధార్మిక స్థలాల నిర్వహణ బాధ్యతలు పరమతస్తులకి అప్పజెప్పడం అన్యాయం. లౌకిక భావనకు వ్యతిరేకం. దీన్ని సమూలంగా తొలగించాలి. హిందూ ఆలయాల నిర్వహణ హిందూ భక్తులకు అప్పజెప్పడం, దాని నుండి వచ్చే ధనాన్ని హిందూ దేవతారాధనకు , హిందూ సమాజ అభ్యున్నతికి మాత్రమే ఖర్చు చేయడం అవసరం, సహేతుకం. దీనితో పాటు హిందూ సమాజ శక్తి కేంద్రంగా దేవాలయాన్ని మరలా మలచేందుకు ఒక విధానాన్ని రూపొందించడం అవసరం.

సంఘటనకు ఆధారం

వ్యక్తులు ప్రభుత్వ, వ్యవస్థలలో వారి వారి స్థానాలలో పని చేస్తున్నప్పటికీ దేశ విషయాలలో సమాజం భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సక్రియ పాత్ర పోషించడం అవసరం. కొన్ని సమస్యలు సమాజ సక్రియత్వంతోనే పరిష్కారమౌతాయి. అందుకని, ముందు అనుకున్న సవాళ్లకు , సామాజిక అవగాహన , సహజ క్రియ , ఆలోచన,అభిప్రాయాలతో పాటు సమాజానికి ప్రతిస్పందన అవసరం. అందుకని మన ఈ సనాతన దేశానికి, ధర్మానికి సంబంధించిన మౌలిక భావనలు, జ్ఞానం సమాజంలో బాగా వ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది. భారత్ లోని వివిధ భాష , మత , ప్రాంతీయ పద్ధతులను ఒకటిగా చేసి పరస్పర సహకారాన్ని పెంపొందిస్తూ , అందరికీ అభివృద్ధిలో సమాన భాగం ఉందని భావిస్తూ ఆదరించడం మన సంస్కృతి. మన వ్యవహారం ఈ పరంపరకు అనుగుణంగా ఉండాలి. మన రాజకీయ, మత, కుల, భాష, ప్రాంతీయ గుర్తింపుల నుండి వచ్చిన అహంభావాన్ని విడనాడాలి. మన ఆధ్యాత్మిక భావనలలో వ్యత్యాసం ఉన్నప్పటికీ, పూజా విధానంలో వ్యత్యాసం ఉన్నప్పటికీ బయట పుట్టిన మతానుయాయులతో సహా భారతీయులమందరం ఒకే శాశ్వతమైన నాగరికత, సంస్కృతి, పరంపరకు చెందిన వాళ్ళమనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి. ఈ విశిష్ఠ పరంపరే మన ధార్మిక స్వేచ్ఛకు ఆధారం. ప్రతి వ్యక్తికీ తనకనుగుణమైన పూజా విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. విదేశీ ఆక్రమణదారులతో చాలా మతాలు, తెగలు ఇక్కడికి వచ్చాయన్నది చారిత్రిక సత్యం. కానీ ఈరోజున ఆ తెగలకు చెందిన వారికి ఆ ఆక్రమణదారుల నుండి ఈ దేశాన్ని కాపాడిన హిందూ పూర్వజులతో సంబంధం ఉంది తప్ప ఆ ఆక్రమణ దారులతో ఏ మాత్రం కాదు. మన పూర్వజులు మన ఆదర్శం. ఈ దేశం హాసన్ ఖాన్ మెవాతి , హకీం ఖాన్ సూరి, ఖుదా బక్ష్, గౌస్ ఖాన్ మరియు విప్లవ వీరుడు ఆస్ఫకుల్లా ఖాన్ వంటి అమరవీరులను చూసింది. వీరు అందరికీ ఆదర్శం. వ్యక్తి ,మత ప్రేరేపిత విభజనకర మనస్తత్వం, ఆధిక్య భావన, స్వార్థ భావనల నుండి బయటకు వచ్చినప్పుడే భారత్ దాని సనాతన హిందూ సంస్కృతి, వ్యాప్త హిందూ సమాజం, దాని ఆమోదయోగ్యతే సమస్త ప్రపంచాన్ని అసహిష్ణుత, వివాదం, తీవ్రవాదం, వైషమ్యం, దోపిడీ ల నుండి కాపాడుతుందని తెలుసుకుంటాడు.

సంఘటిత హిందూ సమాజం

చారిత్రకంగా పరస్పర అన్యాయం , హింసకు సంబంధించిన ఘటనలు దేశంలో చోటుచేసుకున్నప్పుడొ, విభజన, వైషమ్యాలు ఎక్కువ కాలం సాగినప్పుడో, లేదా ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటివి జరిగినప్పుడో ఆ సమస్యల మూలం అర్ధం చేసుకోవడం, మన వాక్కు, చర్యల ద్వారా ఆ కారణాలను నిలువరించడం అవసరం. మనలోని వివిధత్వాన్ని ఆసరాగా చేసుకొని మనల్ని విడదీయడానికి చూస్తున్న శక్తులు మన పరస్పర విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని సవాలు చేస్తునాయి. మన ధార్మిక భావనలను కలుషితం చేసి నాశనం చేసేందుకు అదను కోసం చూస్తున్నాయి. భారత్ లోని ప్రధాన స్రవంతిగా హిందూ సమాజం ఈ దాడుల నుండి తన సంఘటిత శక్తి, విశ్వాసం, భీతిరహిత భావనలను తెలుసుకున్నప్పుడే తట్టుకుని నిలబడగలదు. కనుక ‘హిందువు’ అని చెప్పుకునే వారందరూ తమ వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, వృత్తి జీవితాలలో హిందూ జీవన పద్ధతిని పాటించి నిలబడాలి. అన్ని భయాల నుండి ముక్తులమవ్వలి. బలహీనత పిరికితనానికి దారితీస్తుంది. శారీరిక , మానసిక , ఆధ్యాత్మిక బలం, ధైర్యం, శక్తి, ఓర్పు, సహనం కోసం వ్యక్తిగతంగా దృష్టి సారించాలి. సమాజ బలం దాని ఐక్యతలో ఉంది. సామూహిక విషయాల పట్ల దృష్టి , ఆలోచన , అంకిత భావన చాలా ముఖ్యం. వైషమ్యాలు రేకెత్తించే అన్ని రకాల సిద్ధాంతాలు, వ్యక్తులు, సమూహాల పట్ల అప్రమత్తంగా ఉండడం ముఖ్యం. ఈ సంఘటన శక్తి యొక్క పిలుపు ప్రతీకారాత్మకమైనది కాదు. సమాజ వ్యవస్థలో సహజమైనది. జాతీయ శీలం కలిగిన సంఘటిత, సుదృఢ, సచేతనమైన సమాజమే ప్రపంచం ముందు తన వాణి వినిపించగలదు. సత్య, శాంతి స్థాపనకు శక్తి అవసరం. శక్తివంతం, భీతిరహితం అవడం ద్వారా మనం “నేను ఎవరినీ భయపెట్టను, నేను ఎవరికీ భయపడను” అనే హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి. సచేతన, సంఘటిత, సుదృఢ, సక్రియ సమాజమే అన్ని సమస్యలకీ పరిష్కారం.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఈ లక్ష్యం కోసం గత 96 సంవత్సరాలుగా పని చేస్తోంది. లక్ష్యం చేరేవరకు చేస్తుంది. ఈనాడు మనం జరుపుకుంటున్న పండుగలో ఉన్న సందేశం కూడా ఇదే. తొమ్మిది రోజుల పాటు దైవీ శక్తులు శక్తిని ఉపాసన చేసి, ఆవహన చేసి, సంఘటితం చేశాయి. అప్పుడు సమస్త మానవాళినీ పీడిస్తున్న రాక్షసుల సంహారం జరిగింది. ఈనాడు ప్రపంచం సమస్యల పరిష్కారం కోసం భారత్ వైపు చూస్తోంది. భారత్ వాటిని అందించేందుకు, తన మాట నెరవేర్చుకునేందుకు సన్నద్ధమవ్వాలి. మనందరినీ కలిపే బంధం మన పరంపర, మన హృదయాలలో మన పూర్వీకుల పట్ల ఉన్న భావన, మన మాతృ భూమి పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ. హిందూ అనే పదానికి అర్ధం ఇదే. ఈ మూడు భావనలను మనసులో పెట్టుకుని సనాతన ఐక్యతను ఆభరణంగా ధరించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లచ్చు. మనం ఇది చేయాలి. ఇదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ లక్ష్యం. ఈ తపస్సులో మీవంతు సమర్పణనను అందించమని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తాను.
भ्रांति जनमन की तमटरिे क्रांति कर सांगी गरिे
एक के दशलक्ष होकर कोतटयों को है बुलरिे
ष्ट मराँ होगी भी तिश्व में सम्मरन परकर ।
बढ रहे हैं चरण अगतणि बस इसी धुन में तनरन्र
चल रहे हैं चरण अगतणि ध्येय के पथ पर तनरन्र ।
भररि मरिर की जय
మేము విప్లవ గీతాలు ఆలపిస్తాము
ప్రజల మనస్సుల నుండి భ్రాంతిని తొలగించడానికి
ఒకరు లక్షలమందిగా మారాలని
కోట్లాదిమందికి పిలుపునిస్తాము
పొందవలసిన గౌరవాన్ని పొంది
మా తల్లి (మాతృభూమి) తృప్తి చెందుతుంది.
ఈ గీతానికి అనుగుణంగా మా పదాలు నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటాయి.
ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో లెక్కలేనన్ని అడుగులు పడుతూనే ఉంటాయి.

LEAVE A RESPONSE