– పైలోకాలకు పయనమవుతున్న సాక్షులు
– పులివెందులలో ఏం జరుగుతోంది?
– కూటమి సర్కారులోనో కుట్రను ఛేదించరేం?
– వివేకా హత్య కేసులో సీరియల్ గా సాక్ష్యుల మిస్టరీ మరణాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పులివెందులలో ఏం జరుగుతోంది? మాకు తెలియాలి!.. ఇదీ ఏపీ ప్రజలు, ప్రధానంగా వైఎస్ కుటుంబాన్ని అమితంగా ఆరాధించే వారి ప్రశ్న. వైఎస్ వివేకాన ందరెడ్డి హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చనిపోతున్నారు? అవి సహజ మరణాలా? అసహజ మరణాలా? గొడ్డలిపోటుతో నరికేసిన మృతదేహానికి కుట్లేసిన డాక్టరు మాయ్య బాల్చీ తన్నేశారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన వాచ్మెన్ లేటెస్టుగా పైకెళ్లిపోయారు. కుట్లు వేసిన డాక్టరుకు సహాయం చేసిన తమ్ములుంగారూ వెళ్లిపోయారు. ఎందుకిలా? ఏమిటిలా? ఎన్నాళ్లిలా? కూటమి సర్కారులోనూ వివేకా హత్య కుట్రను ఛేదించలేరా? తెలుగు టీవీ సీరియళ్లు కూడా సిగ్గుపడేలా సాగుతున్న వివేకా హంతకుల కేసును ఎప్పుడు తేలుస్తారు?.. ఇదీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్.
చిన్నాయన్ను ఎవరు చంపారో పైనున్న దేవుడికి తెలుసు అంటాడు జగన్. సాక్షులు మాత్రం ఒక్కొక్కరు పైనున్న దేవుడి దగ్గరికి వెళుతున్నారు. బహుశా దేవుడికి తెలియజెప్పడానికి వెళుతున్నట్లున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో కీలక సాక్షులు వరుసగా మరణిస్తుండటంతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కీలక సాక్షుల మరణాలు
కె. శ్రీనివాసరెడ్డి (02.09.2019): ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న కె. శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
గంగాధర్రెడ్డి (09.06.2022): గంగాధర్రెడ్డి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు.
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి: వివేకాకు కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
వైఎస్ అభిషేక్ రెడ్డి: కుట్లు వేయటానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో మరణించారు.
రంగన్న: వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రింస్లో అనారోగ్యంతో మరణించారు.
ఈ వరుస మరణాలు ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.